"మొగుడి దగ్గర తప్ప ఎంత కర్కోటకుడైన ట్రైనర్ దగ్గరైనా డ్రైవింగ్ నేర్చుకోవడం సులభం " అని నా ఫ్రెండ్ అనిత ఇచ్చిన స్టేట్మెంట్ నిజమే అని అంగీకరించాల్సొచ్చింది ఒకాదివారం ఉదయం!
శ్రీ శ్రీ ఒకసారి..'మీరు సిగరెట్ మానెయ్యొచ్చుగా" అని ఎవరో అడిగితే, 'సిగరెట్ మానెయ్యడం చాలా సులభం! నేను చాలా సార్లు మానేసాను" అన్నార్ట!నేనూ అదే కోవలో డ్రైవింగ్ చాలా సార్లు నేర్చుకున్నాను. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు మన పక్కనే ఉంటే ఎన్ని కిలోమీటర్లైనా, రోడ్డు ఎలా ఉన్నా కారు నడపాలనిపిస్తుంది. సొంత కారు, అదీ పక్కన తోడు లేకుండా బయటకు తీయాలంటే మాత్రం ఉహూ!
అసలు నేను మొదట డ్రైవింగ్ నేర్చుకుంది స్వరాజ్ మజ్దా లో! నేను మొదటి క్లాసుకి వెళ్ళినపుడు మారుతి రిపేర్లో ఉందని మెగాసిటీ డ్రైవింగ్ స్కూలు వాడు నాల్రోజులు స్వరాజ్ మజ్దా మీద క్లాసు తీసుకున్నాడు. తర్వాత మారుతి మీద! 'ఇక్కడ రైట్ తీసుకోవాలంటే స్టీరింగ్ ని మూడు చుట్లు తిప్పాలి. తిప్పారుకదా! ఇపుడు మళ్ళీ కారు సీదాగా రోడ్డు మీదకు రావాలంటే మళ్ళీ మూడు చుట్లు తిప్పాలి." అని చెప్పేవాడు. ఈ చుట్ల గొడవ అర్థం కాకముందే, నాకు లైసెన్స్ వచ్చ్చింది. దాంతో పాటే ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా! 'టెస్టింగ్' అంటే ఏమిటొ తెలియకుండానే! మెగాసిటీ వాళ్ళనడిగితే 'ఖైరతాబాద్ ఆర్టీయే వాళ్ళకి మెగాసిటీ స్టూడెంట్స్ ని ఆపేంత సీన్ లేదులే మీరు కానీండన్నాడు. ఇంతకీ నాకు డ్రైవింగ్ వచ్చిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం తేలకుండానే మేము డల్లాస్ వెళ్ళాము.
అక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినపుడు గర్వంగా నా ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసి చూపించగానే నాకు డ్రైవింగ్ నేర్పబోతున్న వాడు 'అయితే నేనేం చెయ్యా 'లన్నాడు. ఇదిక్కడ పని చెయ్దా అంటే, తెల్లబొయి, ఇదికూడా తెలీకుండా ఇంతదూరం వచ్చేశావా అన్నట్టు చూసి, ఇంటికెళ్లాక, దాంతో నేతిగిన్నె వెచ్చబెట్టుకోమన్న తరహాలో ఏదో సలహా ఇచ్చాడు.
రాత పరీక్ష బాగనే పాసై పూడ్చాను. టెస్టింగ్ దగ్గరకొచ్చే సరికి కొంత దూరం నడిపాక, make a right అని వాడనగానే, right only లేన్లోంచి ఏ మాత్రం సందేహించకుండా U తీస్కున్నాను.రెండో మాట లేకుండా వాడు 'నువ్వు లాభం లేదు పొమ్మ 'న్నాడు. ఖడ్గం సినిమాలో సంగీత లాగా 'ఒకే ఒక్క చాన్స్ ' అని బతిమాలినా , హ్రుదయం లేని బండ గాడిద, వీల్లేదన్నాడు.
లైసెన్స్ లేకపోయినా, ఇంటి చుట్టు పక్కల వీధుల్లో, పోలీసులు లేని చోట కారు నడిపే ప్రయత్నాలు సాగించే దాన్ని!
మూడేళ్లకి మళ్లీ ఇక్కడికొచ్చేసాక, మళ్ళి డ్రైవింగ్ నేర్చుకున్నాను. మన కార్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందన్నాడు వాసు(మా వారు). గంటకి వంద రూపాయలిచ్చి మా కార్లోనే ఇన్ స్ట్రక్టర్ని పక్కన కూచో బెట్టుకుని పొద్దున్నే మణికొండ ప్రాంతాల్లోనూ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోనూ కుడి ఎడమలు పిచ్చగా కన్ ఫ్యూజ్ అవుతూ ఎలాగో వారం రోజులు లాగించాను. డబ్బులెక్కువ అవుతున్నాయని ఆపేశాను. తర్వాత ఆదివారం వాసు 'పద కారు తీయమన్నాడు '. పార్కింగ్ లోంచి కారు బయటికి తీయడమంటె బ్రహ్మ ప్రళయమే నాకు. చీవాట్లు అక్కడినుంచే మొదలయ్యాయి.వెనకాల పిల్లర్ చూసుకోవా అన్నాడు, గేటు దగ్గర హారన్ వేయాలన్నాడు, అలా బిగుసుకుపోయి రోబోట్ లాగా కూచుంటావేం అన్నాడు,ఎలాగో మియాపూర్ ఫ్లై ఓవర్ ఎక్కబోతుంటే, ఇదంతా హఫీజ్ పేట తల్లీ, రోడ్డు ఎవరు ఎప్పుడు ఎక్కడినుచి దాటతారో ఊహించడం బ్రహ్మక్కూడా తరం కాదు. జాగ్రత్తగా ఉండాలన్నాడు. రోడ్డు మీద ఉన్నంత సేపూ పళ్ళు పట పటా కొరుకుతూనే ఉన్నాడనుకోండి. 'అంటే నేర్చుకునే టపుడు కూడా ఇలాగే చంపుతారన్నమాట మీరంతా ' అన్నాడు. అదేమిటంటే, 'ఏముంది, రోజూ చూస్తూనే ఉంటాగా రోడ్లమీద! ఒక పక్క ఆఫీస్ కి టైం అయిపోతూ ఉంటే, మధ్య లేన్లో ఇరవైలో, ముప్ఫైలో నడుపుతూ ఉంటారు! స్పీడుగా తోల్లేరు, వెనక గింజుకునే వాడికీ దారీ ఇవ్వరు 'అని ఆడ డ్రైవర్లు అందరిమీదా కోపం పడ్డాడు. ఇంటికొచ్చి పార్క్ చేద్దామని ప్రయత్నిస్తుంటే....ఎంత హడావుడి చేశాడో తల్చుకుంటే ఒళ్ళు మండిపోతుంది. కారు రివర్స్ చేస్తుంటే..వెనక్కి చూస్తూ, ' పిల్లర్ పిల్లర్ పిల్లరుందక్కడ ' అని కేకలు! నాకిహ కోపం కట్టలు తెంచుకుని, కారు అల్లాగే వదిలి పారేసి,'ఇక 'నీ ' కారు ముట్టుకుంటే అడుగు ' అని వెళ్ళిపోయాను!
నెల్రోజులకల్లా వాసు ఆఫీస్ పని మీద ఒహాయో వెళ్ళినపుడు, అక్కయ్య వాళ్ళు వచ్చారని కారు తీశాను శిల్పారామం వెళదామని!వెళ్లడం జాగ్రత్తగానే వెళ్ళాం! వచ్చేటపుడు కొత్తగూడ క్రాస్ రోడ్స్ దగ్గర గచ్చిబౌలి నుండొస్తున్న ఆటో ఒకటి చాలా వేగంగా కారుని రాసుకుంటూ వెళ్ళిపోయింది. కారు వెనక పడనే పడింది స్క్రాచు! అప్పటికి కారు కొని ఏడాది కూడా కాలేదు! గుండాగిపోయింది. కార్లో వాళ్ళని అక్కడే పారేసి, మియాపూరు హ్యుండాయ్ సర్వీస్ సెంటర్ కి పరిగెట్టాను. అక్కడ తెలిసిన వాడినొకడిని పట్టుకుని పర్సనల్ గా డబ్బిచ్చి వాసు ఇంటికొచ్చేసరికి బాగు చేయించాను.
బెంగుళూరుకొచ్చాకయినా డ్రైవింగ్ చేద్దామనుకుంటే, ఇక్కడి ట్రాఫిక్ చూసి నేనే విరమించాను. యర్రంసెట్టి శాయి గారి హ్యూమరాలజీలో హైదరాబాదు ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్న పక్క పక్క బస్సుల వాళ్ళు పరిచయాలు పెరిగి పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుంటారు! నిజానికది బెంగుళూరు ట్రాఫిక్ కి వర్తించాలి.
ఇక్కడికొచ్చాక మళ్ళీ కొత్త కారు కొందామని మా ఆయన స్కార్పియో వా ళ్ళకి ఫోన్ చేస్తే, టెస్ట్ డ్రైవ్ కని స్కార్పియో పట్టుకొచ్చారు. 'మీరు కూడా డ్రైవ్ చేస్తారా మేడం? ' అని వాళ్ళడగ్గానే నేను అనందంతో 'య్యెస్ ' అనబోతుండగానే ఈయన 'ఆగండాగండాగండాగండాంటూ అడ్డం పడి 'మా ఆవిడ ఫాం లో లేదు లెండి ' అని చెడగొట్టాడు.
ఇక్కడా కారింకా కొత్తదే! ముట్టుకోనివ్వడని తెల్సిపోయింది. అందుకే, నానో కోసం ఎదురు చూస్తున్నా! చిన్న కారయితే నా ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. (ఈ మాటక్కూడా, 'డ్రైవింగ్ రావడం ముఖ్యం గాని, చిన్నదైనా, లారీ అయినా ఒకటే అంటాడు..నాకు తెలుసు)
ఇంతకీ నా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగం ఏమిటంటే, రైలుకో, బస్సుకో ఈ- టికెట్ బుక్ చేసినపుడు TTE కో, కండక్టరుకో ID Proof గా చూపించడానికే! ఎ ప్పటికైనా అది కేవలం డ్రైవింగ్ కోసం ఉపయోగపడుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఎదురు చూస్తున్నా!
April 30, 2008
April 23, 2008
అరవ(డ)ము
ఇవాళ పొద్దున్న ఎదురింట్లోంచి పెద్ద పెద్దగా కేకలు వినబడుతుంటే, ఏమిటో అని తలుపు తీసి చూశా! ఏమీ లేదు. సెలవులకి వచ్చిన శ్రీధర్ రామనాధన్ (మా పొరుగాయన)వాళ్ళ నాన్న గారు రామనాధన్ గారు, శ్రీధర్ పిల్లలకు లెక్కలు చెపుతున్నారు. ఆయన కింద ఫ్లోర్ కు కూడ వినపడేట్టు పాఠాలు బోధిస్తుంటే, శ్రీ శ్రీ విసిరిన చిన్న చలోక్తి గుర్తొచ్చింది.
ద్రావిడ భాషలు నాలుగు!
తెలుగు
మళయాళము
కన్నడము
"అరవడము"
అన్నారట చివరిదాకా మద్రాసులో జీవించిన శ్రీ శ్రీ
ఈ జోకు నాకు యాదాటి కాశీపతి (సీనియర్ జర్నలిస్ట్) చెప్పారు.
నోట్: తమిళాన్ని కించపర్చాలనే ఉద్దేశం నాకు లేదండొయ్! జోకుని జోకుగా తీసుకోండి.
ద్రావిడ భాషలు నాలుగు!
తెలుగు
మళయాళము
కన్నడము
"అరవడము"
అన్నారట చివరిదాకా మద్రాసులో జీవించిన శ్రీ శ్రీ
ఈ జోకు నాకు యాదాటి కాశీపతి (సీనియర్ జర్నలిస్ట్) చెప్పారు.
నోట్: తమిళాన్ని కించపర్చాలనే ఉద్దేశం నాకు లేదండొయ్! జోకుని జోకుగా తీసుకోండి.
April 13, 2008
ఒక మంచి పుస్తకం..డాక్టర్ కేశవ రెడ్డి నవల 'మునెమ్మ '
డాక్టర్ కేశవ రెడ్డి గారు చాలాకాలం తర్వాత 'మునెమ్మ ' నవల రాశారు. ఈ నవల 2007 అక్టోబర్ నెల చతురగా వచ్చింది. కేశవరెడ్డి గారు అద్భుతమైన రచనలు చేసారు. సిటీ బ్యూటిఫుల్, అతడు అడవిని జయించాడు,రాముడుండాడు.రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ మునెమ్మ.(ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ) రాసి కంటే, వాసి ముఖ్యమని ఇలాంటి వాళ్ళ రచనల గురించే అంటారు కాబోలు.
రాయలసీమ మాండలికాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది స్వర్గీయ పులికంటి క్రిష్ణారెడ్డి గారైతే, దాన్ని తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళలోకి సరఫరా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నామిని, కేశవ రెడ్డి గార్లు.
ఇక మునెమ్మ నవల విషయానికొస్తే, కథాకాలం మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. కథని ఒక పదేళ్ళ కుర్రా డు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. భర్త చావుకి కారణమైన కొంతమంది వ్యక్తుల ఆచూకీ కనుక్కుని, వారిని అంతమొందించడానికి బయలు దేరిన ఒక భార్య కధ. వినగానే, ఇదేదో ఫాక్షన్ సినిమాలా ఉంది గానీ...కాదు!
మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.
తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు 'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయిస్తాడు. అప్పట్లో బస్సులూ, అవీ అరుదు గనక, కాలి నడకన బయలు దేరతాడు.
రెండు రోజులయ్యక, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. దానితో, మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. ఒక రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బకెట్ కి బదులుగా జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన వెంట్రుకల తాడు బిగించి ఉంటుంది.(ఆ తాడు మునెమ్మ వెంట్రుకలతో పేనిందే) దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకధాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా, ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో ( ఈ కథ చెప్పే కుర్రాడు) కలిసి బయలు దేరుతుంది.
బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.
మొదట వాళ్ళు తరుగులోడిని కలుస్తారు. వాడు ఎటూ చిక్కకుండా సమాధానాలు చెపుతాడు. పైగా ' ఏవమ్మా, జయరాముడు పైకంతో మంచి గొడ్డుని పట్టుకున్నాడా...జల్సా చేస్తా వున్నాడా ' అని అడుగుతాడు కూడా! జయరాముడు బొల్లిగిత్తను సంత దాకా తీసుకెళ్లకుండానే, దార్లోనే అమ్ముడైపోయిందని చెప్తాడు. సంత చీటీ తమ దగ్గరున్న సంగతి చెప్పకుండా , వాడిచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగుతారు. ఒక పూట కూళ్ళ ఇంట్లో వారికి మరింత విలువైన సమాచారం లభిస్తుంది.
సంతలో మరికొంత మంది చెప్పిన విషయాల ఆధారంగా పశువైద్యుడి ఇంటికి వెళతారు. కాని అప్పటికే అతడు మరణ శయ్య మీద ఉంటాడు. వైద్యం చేస్తుంటే ఆవు కుమ్మిందని ఇంట్లో వాళ్ళు చెపుతారు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అన్నట్లున్న అతడు, మునెమ్మ చేతిమీద బొల్లి గిత్త పచ్చ బొట్టు చూడగానే, వెర్రికేక పెట్టి ప్రాణం వదిలేస్తాడు.
జయరాముడి హత్యలో తరుగులోడికి, పశువద్యుడుకి భాగం ఉందని గ్రహిస్తుంది మునెమ్మ! అప్పుడు వెళుతుంది పోలీస్ స్టషన్ కి...ఏదైనా అనాధ శవం దొరికిందా అని తెల్సుకోవడానికి. ఒక రోజు ముందే జయరాముడి శవ దహనం జరిగిందని తెల్సుకుంటుంది.ఒక వెంట్రుకల తాడుతో జయరాముడి గొంతు బిగించి చంపారని తెలిసి వణికి పోతుంది. ఆ తాడుని జయరాముడే స్వయంగా మునెమ్మ తల దువ్వుకునేటపుడు రాలిన వెంట్రుకలతో పేనాడు.
మునెమ్మ బొల్లి గిత్తను తోలుకు రమ్మని మరిదిని పంపుతుంది. బొల్లిగిత్తతో పాటు తరుగులోడి ఇంటికి వెళుతుంది. తరుగులోడిని నిలదీసి, వాడు తనకేమీ తెలీయదని బుకాయిస్తుండగా , బొల్లి గిత్తను వదులుతుంది. అది ఉగ్రరూపం దాల్చి తరుగులోడి పేగులు తీసి కొమ్ములకు చుట్టుకోవడంతో కథ ముగుస్తుంది.
ఇక్కడ మీకు ఆసక్తికరంగా అనిపించిందో లేదో కాని, చదవడం మొదలెట్టాక ఆపకుండా చదివించే నవల ఇది. కేశవ రెడ్డి గారి శైలి అదే! అద్భుతమైన కథనం ఊపిరి తిప్పుకోనివ్వదు.
మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొసుంది.ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడె ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రయాన్ని గుర్తు చేస్తుంది.
'వదినా, జయరామన్న అంత్యక్రియలు ఎక్కడ చెయ్యా ల? " అని మరిది అడిగితే ' ఇప్పుడు నేనేం జేస్తున్నాను? ఆయన అంత్యక్రియలేగా! జయరాముడిని పడగొట్టిన వాళ్ళ నోట్లో రూకలు పడాల! ఆయన అంత్యక్రియలు పూర్తైనట్టే " అని మునెమ్మ చెప్పే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి.
లైబ్రరీలో తప్పక ఉండవలసిన పుస్తకం ఇది. ప్రస్తుతానికి బయట దొరికే అవకాశం లేదు కాబట్టి, కావలసిన వారు చతుర సర్క్యులేషన్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేయాల్సిందే! దొరికితే మాత్రం తప్పక చదవండి!
రాయలసీమ మాండలికాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది స్వర్గీయ పులికంటి క్రిష్ణారెడ్డి గారైతే, దాన్ని తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళలోకి సరఫరా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నామిని, కేశవ రెడ్డి గార్లు.
ఇక మునెమ్మ నవల విషయానికొస్తే, కథాకాలం మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. కథని ఒక పదేళ్ళ కుర్రా డు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. భర్త చావుకి కారణమైన కొంతమంది వ్యక్తుల ఆచూకీ కనుక్కుని, వారిని అంతమొందించడానికి బయలు దేరిన ఒక భార్య కధ. వినగానే, ఇదేదో ఫాక్షన్ సినిమాలా ఉంది గానీ...కాదు!
మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.
తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు 'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయిస్తాడు. అప్పట్లో బస్సులూ, అవీ అరుదు గనక, కాలి నడకన బయలు దేరతాడు.
రెండు రోజులయ్యక, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. దానితో, మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. ఒక రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బకెట్ కి బదులుగా జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన వెంట్రుకల తాడు బిగించి ఉంటుంది.(ఆ తాడు మునెమ్మ వెంట్రుకలతో పేనిందే) దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకధాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా, ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో ( ఈ కథ చెప్పే కుర్రాడు) కలిసి బయలు దేరుతుంది.
బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.
మొదట వాళ్ళు తరుగులోడిని కలుస్తారు. వాడు ఎటూ చిక్కకుండా సమాధానాలు చెపుతాడు. పైగా ' ఏవమ్మా, జయరాముడు పైకంతో మంచి గొడ్డుని పట్టుకున్నాడా...జల్సా చేస్తా వున్నాడా ' అని అడుగుతాడు కూడా! జయరాముడు బొల్లిగిత్తను సంత దాకా తీసుకెళ్లకుండానే, దార్లోనే అమ్ముడైపోయిందని చెప్తాడు. సంత చీటీ తమ దగ్గరున్న సంగతి చెప్పకుండా , వాడిచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగుతారు. ఒక పూట కూళ్ళ ఇంట్లో వారికి మరింత విలువైన సమాచారం లభిస్తుంది.
సంతలో మరికొంత మంది చెప్పిన విషయాల ఆధారంగా పశువైద్యుడి ఇంటికి వెళతారు. కాని అప్పటికే అతడు మరణ శయ్య మీద ఉంటాడు. వైద్యం చేస్తుంటే ఆవు కుమ్మిందని ఇంట్లో వాళ్ళు చెపుతారు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అన్నట్లున్న అతడు, మునెమ్మ చేతిమీద బొల్లి గిత్త పచ్చ బొట్టు చూడగానే, వెర్రికేక పెట్టి ప్రాణం వదిలేస్తాడు.
జయరాముడి హత్యలో తరుగులోడికి, పశువద్యుడుకి భాగం ఉందని గ్రహిస్తుంది మునెమ్మ! అప్పుడు వెళుతుంది పోలీస్ స్టషన్ కి...ఏదైనా అనాధ శవం దొరికిందా అని తెల్సుకోవడానికి. ఒక రోజు ముందే జయరాముడి శవ దహనం జరిగిందని తెల్సుకుంటుంది.ఒక వెంట్రుకల తాడుతో జయరాముడి గొంతు బిగించి చంపారని తెలిసి వణికి పోతుంది. ఆ తాడుని జయరాముడే స్వయంగా మునెమ్మ తల దువ్వుకునేటపుడు రాలిన వెంట్రుకలతో పేనాడు.
మునెమ్మ బొల్లి గిత్తను తోలుకు రమ్మని మరిదిని పంపుతుంది. బొల్లిగిత్తతో పాటు తరుగులోడి ఇంటికి వెళుతుంది. తరుగులోడిని నిలదీసి, వాడు తనకేమీ తెలీయదని బుకాయిస్తుండగా , బొల్లి గిత్తను వదులుతుంది. అది ఉగ్రరూపం దాల్చి తరుగులోడి పేగులు తీసి కొమ్ములకు చుట్టుకోవడంతో కథ ముగుస్తుంది.
ఇక్కడ మీకు ఆసక్తికరంగా అనిపించిందో లేదో కాని, చదవడం మొదలెట్టాక ఆపకుండా చదివించే నవల ఇది. కేశవ రెడ్డి గారి శైలి అదే! అద్భుతమైన కథనం ఊపిరి తిప్పుకోనివ్వదు.
మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొసుంది.ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడె ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రయాన్ని గుర్తు చేస్తుంది.
'వదినా, జయరామన్న అంత్యక్రియలు ఎక్కడ చెయ్యా ల? " అని మరిది అడిగితే ' ఇప్పుడు నేనేం జేస్తున్నాను? ఆయన అంత్యక్రియలేగా! జయరాముడిని పడగొట్టిన వాళ్ళ నోట్లో రూకలు పడాల! ఆయన అంత్యక్రియలు పూర్తైనట్టే " అని మునెమ్మ చెప్పే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి.
లైబ్రరీలో తప్పక ఉండవలసిన పుస్తకం ఇది. ప్రస్తుతానికి బయట దొరికే అవకాశం లేదు కాబట్టి, కావలసిన వారు చతుర సర్క్యులేషన్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేయాల్సిందే! దొరికితే మాత్రం తప్పక చదవండి!
April 10, 2008
తెలుగు వాళ్ళు మాత్రమే కనుక్కో గలిగే పజిల్!
బుర్రకి పదును పెట్టే, తెలుగు వాళ్ళు మాత్రమే విప్ప గలిగిన పజిల్ ఇది. నేను చెప్ప బోయే కథలోనే, పజిల్ దాగి ఉంది. చాలా ఈజీ! ముందే చెప్పేస్తున్నా, ఇది నా సొంతం కాదు. చిన్నప్పుడు బాలజ్యోతి పిల్లల మాస పత్రికలో, శ్రీ అవసరాల రామ క్రిష్ణారావు గారు 'మేథ మే ట్రిక్స్ ' అనే శీర్షిక నిర్వహించే వారు. ఈ మధ్య స్నేహితుల ఇంట్లో, పాత బాల జ్యోతిలో ఈ పజిల్ చూసాను. అప్పట్లో ఈ పజిల్ ఎంతో కష్టపడి, కనుక్కుని నేనూ పంపాను. కాని, మన బుర్రకి కొంచెం పదును తక్కువ కదా, నేను పంపేసరికి, గడువు టైం కాస్తా అయిపోయింది. సరదాగా అందరితో పంచుకుంటే బాగుంటుందనిపించి ఇక్కడ ఇస్తున్నాను. ముందే చెప్పాను...ఇది తెలుగు వాళ్ళు మాత్రమే కనుక్కో గలిగే పజిల్. ఇక కథలోకి పదండి.
రామా రావు, సుబ్బారావు చిన్ననాటి నుంచి స్నేహితులు. కాలేజీ చదువయ్యాక రామారావు ముంబాయి వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టి సెటిల్ అయ్యాడు. సుబ్బా రావు ఉన్న వూళ్ళోనే మంచి ఉగ్యోగంలో స్థిరపడ్డాడు. దూరంగా ఉన్నా ఇద్దరూ ఉత్తరాల ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సుబ్బారావు కొడుకు అవినాష్ చదువయ్యాక, వ్యాపారం చేస్తానంటే, సుబ్బారావు వద్దన్నాడు. ఇంకా పై చదువులు చదివి ఉద్యోగంలో చేరమన్నా డు. దానితో ఇద్దరికీ మాటా మాట పెరిగి అవినాష్ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.సుబ్బారావు ఎక్కడా వెతికినా ప్రయోజనం లేక పోయింది. స్నేహితుడు రామా రావుకి ఉత్తరం రాస్తూ(అప్పట్లో ఇన్ని ఫోన్లు లేవు), కొడుకు గురించి చెప్పుకుని బాధ పడ్డాడు.
ఇలా ఉండగా, రామా రావు దగ్గరికి ఒక కుర్రాడు కష్టాల్లో ఉన్నాననీ, ఉద్యోగం కావాలని వచ్చాడు. ఏం చదివావంటే, పెద్ద చదువే గానీ, సర్టిఫికెట్లు ఇప్పుడు లేవన్నాడు ఆ కుర్రాడు. పేరేమో అవినాష్ అన్నాడు. ఏ వూరంటే, బీహార్ నుంచి వచ్చాను, మాత్రుభాష హింది అన్నాడు . సరే,ఏవో పరీక్షలు పెట్టి, ప్రస్తుతానికి తన పర్సనల్ స్టెనోగా ఉండమన్నా డు.
మరో వారం గడిచాక, సుబ్బారావు రామారావుకి మరో ఉత్తరం రాస్తూ, " మా అవినాష్ నీ దగ్గరకు గానీ వస్తాడేమో, ఒక వేళ వస్తే వాడిని ఏమీ ప్రశ్నించకురా! వాడికి ఆత్మాభిమానం ఎక్కువ. వాడు అక్కడ ఉన్నట్టు నాకు రాయి. నేనొచ్చి నచ్చ జెప్పుకుంటాను" అని రాసాడు.
సుబ్బారావు కొడుకు పేరు అవినాష్ అని గురుతు రానందుకు తిట్టుకున్నాడు రామారావు. కాకపోతే, ఇప్పుడు తన ఆఫీస్ లో ఉన్న అవినాష్ సుబ్బారావు కొడుకా కాదా ఎలా కనుక్కోవాలి? నువ్వు సుబ్బారావు కొడుకువా అని అడగడానికి లేదు. బీహార్ నుంచి వచ్చానన్నాడు. చక్కగా హిందీ మాట్లాడుతున్నాడు.తన ఆఫీస్ లో ఉన్న తెలుగు వాళ్ళతో కూడా తెలుగు మాట్లాడుతున్నట్టు వినలేదు. ఒక రోజంతా ఆలోచించాడు. చివరకో ఆలోచన తట్టింది. అవినాష్ ని పిలిచి ఒక లెటర్ టైప్ చెయ్యమన్నాడు. తమ ఆఫీస్ బ్రాంచ్ లు ఆంధ్రాలోని కడప, రాజమండ్రి లలో ఉన్నాయనీ, ఏవో స్టేట్మెంట్లు పంపమని ఆ బ్రాంచ్ ల చిరునామాలు చెప్పి లెటర్లు డిక్టేట్ చేసాడు.
పది నిమిషాల్లో, అవినాష్ లెటర్లు టైప్ చేసి తెచ్చాడు. వాటిని చూసిన రామారావు, అవినాష్ వెళ్ళగానే, నవ్వుకుంటూ ' నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు. నువ్వు వెంటనే బయలుదేరు" అని సుబ్బారావు కి ఉత్తరం రాసాడు.
అవినాషే సుబ్బారావు కొడుకని, రామారావు ఎలా కనుక్కున్నాడో ఊహించండి. గడువేమీ లేదు. రెండు మూడు రోజుల్లో కనుక్కోగలరనుకుంటాను.
శ్రీ అవసరాల రామ క్రిష్ణారావు గారికి క్రు క్ష త మా జ్ఞ ప త ణ ల తో!
రామా రావు, సుబ్బారావు చిన్ననాటి నుంచి స్నేహితులు. కాలేజీ చదువయ్యాక రామారావు ముంబాయి వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టి సెటిల్ అయ్యాడు. సుబ్బా రావు ఉన్న వూళ్ళోనే మంచి ఉగ్యోగంలో స్థిరపడ్డాడు. దూరంగా ఉన్నా ఇద్దరూ ఉత్తరాల ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సుబ్బారావు కొడుకు అవినాష్ చదువయ్యాక, వ్యాపారం చేస్తానంటే, సుబ్బారావు వద్దన్నాడు. ఇంకా పై చదువులు చదివి ఉద్యోగంలో చేరమన్నా డు. దానితో ఇద్దరికీ మాటా మాట పెరిగి అవినాష్ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.సుబ్బారావు ఎక్కడా వెతికినా ప్రయోజనం లేక పోయింది. స్నేహితుడు రామా రావుకి ఉత్తరం రాస్తూ(అప్పట్లో ఇన్ని ఫోన్లు లేవు), కొడుకు గురించి చెప్పుకుని బాధ పడ్డాడు.
ఇలా ఉండగా, రామా రావు దగ్గరికి ఒక కుర్రాడు కష్టాల్లో ఉన్నాననీ, ఉద్యోగం కావాలని వచ్చాడు. ఏం చదివావంటే, పెద్ద చదువే గానీ, సర్టిఫికెట్లు ఇప్పుడు లేవన్నాడు ఆ కుర్రాడు. పేరేమో అవినాష్ అన్నాడు. ఏ వూరంటే, బీహార్ నుంచి వచ్చాను, మాత్రుభాష హింది అన్నాడు . సరే,ఏవో పరీక్షలు పెట్టి, ప్రస్తుతానికి తన పర్సనల్ స్టెనోగా ఉండమన్నా డు.
మరో వారం గడిచాక, సుబ్బారావు రామారావుకి మరో ఉత్తరం రాస్తూ, " మా అవినాష్ నీ దగ్గరకు గానీ వస్తాడేమో, ఒక వేళ వస్తే వాడిని ఏమీ ప్రశ్నించకురా! వాడికి ఆత్మాభిమానం ఎక్కువ. వాడు అక్కడ ఉన్నట్టు నాకు రాయి. నేనొచ్చి నచ్చ జెప్పుకుంటాను" అని రాసాడు.
సుబ్బారావు కొడుకు పేరు అవినాష్ అని గురుతు రానందుకు తిట్టుకున్నాడు రామారావు. కాకపోతే, ఇప్పుడు తన ఆఫీస్ లో ఉన్న అవినాష్ సుబ్బారావు కొడుకా కాదా ఎలా కనుక్కోవాలి? నువ్వు సుబ్బారావు కొడుకువా అని అడగడానికి లేదు. బీహార్ నుంచి వచ్చానన్నాడు. చక్కగా హిందీ మాట్లాడుతున్నాడు.తన ఆఫీస్ లో ఉన్న తెలుగు వాళ్ళతో కూడా తెలుగు మాట్లాడుతున్నట్టు వినలేదు. ఒక రోజంతా ఆలోచించాడు. చివరకో ఆలోచన తట్టింది. అవినాష్ ని పిలిచి ఒక లెటర్ టైప్ చెయ్యమన్నాడు. తమ ఆఫీస్ బ్రాంచ్ లు ఆంధ్రాలోని కడప, రాజమండ్రి లలో ఉన్నాయనీ, ఏవో స్టేట్మెంట్లు పంపమని ఆ బ్రాంచ్ ల చిరునామాలు చెప్పి లెటర్లు డిక్టేట్ చేసాడు.
పది నిమిషాల్లో, అవినాష్ లెటర్లు టైప్ చేసి తెచ్చాడు. వాటిని చూసిన రామారావు, అవినాష్ వెళ్ళగానే, నవ్వుకుంటూ ' నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు. నువ్వు వెంటనే బయలుదేరు" అని సుబ్బారావు కి ఉత్తరం రాసాడు.
అవినాషే సుబ్బారావు కొడుకని, రామారావు ఎలా కనుక్కున్నాడో ఊహించండి. గడువేమీ లేదు. రెండు మూడు రోజుల్లో కనుక్కోగలరనుకుంటాను.
శ్రీ అవసరాల రామ క్రిష్ణారావు గారికి క్రు క్ష త మా జ్ఞ ప త ణ ల తో!
April 1, 2008
వెన్నెల
ఈ మధ్య అందరూ వేసవి సెలవుల గురించి, వెన్నెల గురించి రాస్తుంటే, నాకూ రాయాలనిపించింది. వెన్నెల ఎవరికి నచ్చదూ? వెన్నెల అమ్మ లాంటిది. "అమ్మ ఎవరికైనా అమ్మే" లాగా వెన్నెల ఎవరికైనా అభిమాన విషయమే!
మామూలు రోజుల్లో వెన్నెలకీ, వేసవి సెలవుల వెన్నెలకీ తేడా ఉంటుంది. ఆరుబయట వెన్నెల్లో డిన్నర్లు , వెన్నెలా-నీడా ఆటలు( దొంగ అయిన వాళ్ళు వెన్నెల్లో ఉన్నవాళ్లని పట్టుకునే లోగా వాళ్ళు ఏ చెట్ల నీడల్లోకో తప్పుకోవాలి)ఆలిండియా రేడియో వాళ్ళ నాటకోత్సవాల తాలూకూ నాటకాలు, ఆ తర్వాత వివిధ భారతిలో ఛాయా గీత్ వినడం (నా చిన్నప్పుడు ఛాయా గీత్ కి వచ్చే అనౌన్సర్లకి మంచి టేస్ట్ ఉండేది. వెన్నెల రోజుల్లో తప్పని సరిగా వారానికి రెండు సార్లన్నా ' బహారో ఫూల్ బరసావో " పాట వేసేవాళ్ళు.), వెన్నెల్లో పెద్ద పువ్వు లాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడ ను గమనించడం, కొబ్బరాకుల టప టపలు...ఇవన్నీ చాలా మందికి అనుభవైకవేద్యాలే!
ఈ మధ్య బెంగుళూరు నుండి, సకలేష్ పూర్ లోని స్నేహితుల ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ, ఒక అడవి లాంటి (లాంటి ఏమిటి..అడవే) చోట కొద్ది సేపు ఆగాము. రోడ్డుకి కొంచెం దూరంగా ఒక ఏనుగు పిల్ల చెట్టు ఆకులు అందుకుంటుండగా, రెండు కుందేళ్ళు ఎంచక్కా ఎవరి భయమూ లేక హాయిగా ఆడుకుంటుంటే అనిపించింది....అడవి గాచిన వెన్నెల వ్రుధా కాదు....సిటీ గాచిన వెన్నెలే పరమ వేస్టు అని.నిశ్శబ్దంగా గమనించి నిష్క్రమించాము. టివి సీరియల్స్ పుణ్యమా అని టౌనుల్లో , పల్లెల్లో కూడా వెన్నెల్ని ప్రేమించే మనుషులు తగ్గిపోతున్నారు.
మనసుకి మాటలు లేకుండా చేసే మనోహరమైన వెన్నెల్ని ఒకసారి అమరావతిలో క్రిష్ణా నది మీద చూశాను. ఈ మాట మా శ్రీవారితో చెప్పానే అనుకోండి.." ఏమిటీ, మా పాపి కొండల దగ్గర గోదావరి మీద వెన్నెల కంటేనా..! అసలు వెన్నెల్లో గోదావరిని తప్ప ఇక ఏ నదినీ, చెరువునీ, కాలవనీ కూడా చూడ్డానికి వీల్లేదు " అని అడ్డంగా వాదిస్తారు. (వాళ్ళది వెస్ట్ గోదావరి లెండి) పైగా, "అసలు పసలపూడి కథల్లో గోదావరిని వంశీ వర్ణించినట్టు, మీ క్రిష్ణా నదిని ఎవరైనా ఎప్పుడైనా వర్ణించారా.. " అని సవాల్ చేస్తారు. "నాయనా! ఆ పని మనిద్దరం పుట్టకముందే శంకరమంచి సత్యం అనే ఒక పెద్దాయన చెశారు! చదువుడు..అమరావతి కథలు " అని తనకి డవిలాగుల్లేకుండా చేస్తాను.
ఆ మధ్య సెలవుల్లో మా వూరికి వెళ్ళినపుడు , వెన్నెల్లో కూచుందామని బయటికి వస్తే చుట్టు పక్కల డాబాల మీద గాని, వాకిళ్ళలో గాని ఒక్క పురుగు లేదు. ఎవ్వరికీ వెన్నెల అక్కర్లేదు...! ఏక్తా కపూర్ ' కళ్యాణి ' సీరియలే కావాలి.కాసేపు నాతోపాటు (బలవంతంగా అనుకుంటా) కూచున్న మా అమ్మ కూడా ఎనిమిదిన్నర కాగానే లేచి, 'రేపు కూచుందాంలే వెన్నెల్లో! చక్రవాకం చూడవూ....'అని కళ్లజోడు వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది. పైగా, ఇదివరలో లాగా వెన్నెలకి కాంబినేషన్ గా చల్లగాలి లేదు ఇప్పుడు. పీల్చి పిప్పి చేసే రాక్షస దోమలు, ఉక్క!
ఇక సిటీ సంగతి చెప్పేదేముంది! కనీసం కరెంటు పోయినప్పుడన్నా పది నిమిషాలు ఆరు బయట వెన్నెల నీడలు చూద్దామంటే, కరెంటు పోయిన ఆరున్నరో సెకనులో జెనరేటర్ చప్పుడు మొదలవుతుంది.
సో , మంచి నిఖార్సయిన, కల్తీ లేని వెన్నెల చూడాలంటే, నిజంగానే ఏదన్నా (క్రూర జంతువులు లేని)అడవికి పోవాల్సిందే!
మామూలు రోజుల్లో వెన్నెలకీ, వేసవి సెలవుల వెన్నెలకీ తేడా ఉంటుంది. ఆరుబయట వెన్నెల్లో డిన్నర్లు , వెన్నెలా-నీడా ఆటలు( దొంగ అయిన వాళ్ళు వెన్నెల్లో ఉన్నవాళ్లని పట్టుకునే లోగా వాళ్ళు ఏ చెట్ల నీడల్లోకో తప్పుకోవాలి)ఆలిండియా రేడియో వాళ్ళ నాటకోత్సవాల తాలూకూ నాటకాలు, ఆ తర్వాత వివిధ భారతిలో ఛాయా గీత్ వినడం (నా చిన్నప్పుడు ఛాయా గీత్ కి వచ్చే అనౌన్సర్లకి మంచి టేస్ట్ ఉండేది. వెన్నెల రోజుల్లో తప్పని సరిగా వారానికి రెండు సార్లన్నా ' బహారో ఫూల్ బరసావో " పాట వేసేవాళ్ళు.), వెన్నెల్లో పెద్ద పువ్వు లాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడ ను గమనించడం, కొబ్బరాకుల టప టపలు...ఇవన్నీ చాలా మందికి అనుభవైకవేద్యాలే!
ఈ మధ్య బెంగుళూరు నుండి, సకలేష్ పూర్ లోని స్నేహితుల ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ, ఒక అడవి లాంటి (లాంటి ఏమిటి..అడవే) చోట కొద్ది సేపు ఆగాము. రోడ్డుకి కొంచెం దూరంగా ఒక ఏనుగు పిల్ల చెట్టు ఆకులు అందుకుంటుండగా, రెండు కుందేళ్ళు ఎంచక్కా ఎవరి భయమూ లేక హాయిగా ఆడుకుంటుంటే అనిపించింది....అడవి గాచిన వెన్నెల వ్రుధా కాదు....సిటీ గాచిన వెన్నెలే పరమ వేస్టు అని.నిశ్శబ్దంగా గమనించి నిష్క్రమించాము. టివి సీరియల్స్ పుణ్యమా అని టౌనుల్లో , పల్లెల్లో కూడా వెన్నెల్ని ప్రేమించే మనుషులు తగ్గిపోతున్నారు.
మనసుకి మాటలు లేకుండా చేసే మనోహరమైన వెన్నెల్ని ఒకసారి అమరావతిలో క్రిష్ణా నది మీద చూశాను. ఈ మాట మా శ్రీవారితో చెప్పానే అనుకోండి.." ఏమిటీ, మా పాపి కొండల దగ్గర గోదావరి మీద వెన్నెల కంటేనా..! అసలు వెన్నెల్లో గోదావరిని తప్ప ఇక ఏ నదినీ, చెరువునీ, కాలవనీ కూడా చూడ్డానికి వీల్లేదు " అని అడ్డంగా వాదిస్తారు. (వాళ్ళది వెస్ట్ గోదావరి లెండి) పైగా, "అసలు పసలపూడి కథల్లో గోదావరిని వంశీ వర్ణించినట్టు, మీ క్రిష్ణా నదిని ఎవరైనా ఎప్పుడైనా వర్ణించారా.. " అని సవాల్ చేస్తారు. "నాయనా! ఆ పని మనిద్దరం పుట్టకముందే శంకరమంచి సత్యం అనే ఒక పెద్దాయన చెశారు! చదువుడు..అమరావతి కథలు " అని తనకి డవిలాగుల్లేకుండా చేస్తాను.
ఆ మధ్య సెలవుల్లో మా వూరికి వెళ్ళినపుడు , వెన్నెల్లో కూచుందామని బయటికి వస్తే చుట్టు పక్కల డాబాల మీద గాని, వాకిళ్ళలో గాని ఒక్క పురుగు లేదు. ఎవ్వరికీ వెన్నెల అక్కర్లేదు...! ఏక్తా కపూర్ ' కళ్యాణి ' సీరియలే కావాలి.కాసేపు నాతోపాటు (బలవంతంగా అనుకుంటా) కూచున్న మా అమ్మ కూడా ఎనిమిదిన్నర కాగానే లేచి, 'రేపు కూచుందాంలే వెన్నెల్లో! చక్రవాకం చూడవూ....'అని కళ్లజోడు వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది. పైగా, ఇదివరలో లాగా వెన్నెలకి కాంబినేషన్ గా చల్లగాలి లేదు ఇప్పుడు. పీల్చి పిప్పి చేసే రాక్షస దోమలు, ఉక్క!
ఇక సిటీ సంగతి చెప్పేదేముంది! కనీసం కరెంటు పోయినప్పుడన్నా పది నిమిషాలు ఆరు బయట వెన్నెల నీడలు చూద్దామంటే, కరెంటు పోయిన ఆరున్నరో సెకనులో జెనరేటర్ చప్పుడు మొదలవుతుంది.
సో , మంచి నిఖార్సయిన, కల్తీ లేని వెన్నెల చూడాలంటే, నిజంగానే ఏదన్నా (క్రూర జంతువులు లేని)అడవికి పోవాల్సిందే!