మురికి ఓడుతూ, జనంతో క్రిక్కిరిసిపోయి,చెమటతో నిండిపోయిన బస్సు( (సిటీ బస్సు కాకుండా) మీరెప్పుడైనా ఎక్కారా? రకరకాల మనుషుల్ని ఇలా ఒకేసారి పరిశీలించే అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి బస్సు మీరు నిజంగా ఎక్కకపోయినా ఆ బస్సులో కూచునో, ఒంటికాలి మీద నిల్చునో చుట్టూ ఉన్న జనాల మనస్థత్వాలను పరిశీలించడానికి ఇక్కడో అవకాశం ఉంది. అదే "స్వర్ణసీమకు స్వాగతం" నవల చదవడం.
కొన్ని పుస్తకాలు చదివితే అంత త్వరగా మర్చిపోలేకపోవడం అటుంచి అవి మనల్ని కనీసం కొన్నాళ్ల పాటు వెంటాడతాయి. అలాంటి పుస్తకాల కోవలోకి వస్తుంది మధురాంతకం మహేంద్ర(శ్రీ మధురాంతకం రాజా రామ్ గారి కుమారుడు)రాసిన "స్వర్ణసీమకు స్వాగతం"! ఈ నవలిక నేను పదో క్లాసో, పన్నెండో క్లాసో చదూతూండగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహిక గా వచ్చింది. 1996 లో నవలగా వెలువడింది.
ఈ ప్రపంచం ఒక ప్రయాణం. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరి దారి వారిది, ఎవరి గమ్యం వారిది. అందరూ ఒకేదారిలో వెళుతున్నా ఒక్కోసారి గమ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్రయాణంలో ఒకరి సంక్షేమం, ఇంకొకరికక్కర్లేదు. ఒకరి బాగోగులు మరొకరికి పట్టవు.
ఈ ధోరణిలో ఈ సమాజమే పెద్ద పర్తిగుంట బస్సుగా అవతరిస్తుందీ నవల్లో!చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ లో కథ మొదలవుతుంది. కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. రచయిత చెప్పినట్లు యాంత్రిక నాగరికతా ప్రస్థానంలో మానవత్వం అనుభవిస్తున్న సంక్షోభాన్ని కుప్పం నుంచి పెద్దపర్తి గుంట చేరేలోగా కళ్లకు కట్టినట్లు వివిధ పాత్రల ద్వారా చూపించడమే ఈ నవల్లో మహేంద్ర చేసిన పని.
చిగుర్ల గుంట లో ఉన్న బంగారు గనుల మైనింగ్ కాంప్ లో వివరాలు సేకరించేందుకు వచ్చిన విలేకరి రమణమూర్తీ, జ్వరంతో ఉన్న బిడ్డను ఆస్పత్రిలో చూపించి తిరుగుప్రయాణంకోసం సుభద్ర, సుభద్ర వాలుచూపులకోసం పడిగాపులు గాసే వెంకటపతీ, తాగుబోతులు అత్తినీరాలు,సంపంగిగౌడు, చితికిపోయిన జమీందారు వసంతనాయని వారు,లీడరు అతని అనుచరులు, భాగ్యమ్మ, ఆమె ప్రియుడు వెంకటసామి...వీళ్లందరి గమ్యం పెద్దపర్తి గుంటే! మధ్యాహ్నం నుంచి ఎదురు చూసిన బస్సు సాయంత్రానికి గానీ రాదు. అది రాకముందు, వచ్చిన తర్వాత, బస్సెక్కాక, ప్రయాణంలో అందులోని ప్రయాణీకులు మానవ సమాజానికి ప్రతీకలుగా ఎలా ప్రవర్తిస్తారో రచయిత వర్ణించిన తీరు మహాద్భుతంగా ఉంటుంది.
నవలకు ముందు మాట రాసిన ఆర్. ఎస్. సుదర్శనం ఇలా అంటారు."ప్రగతి అంటే మిథ్య కాదు. అది పెద్దపర్తి గుంట బస్సు. అందరూ దాని కోసమే ఎదురు చూస్తారు. తొక్కిసలాటలో కండబలం కలవాళ్ళు సీట్లు సంపాదిస్తారు.కొందరు కిక్కిరిసి నిల్చుంటారు. మరికొందరు టాపు మీదైనా చోటు సంపాదిస్తారు.ఎక్కడ దిగవలసిన వాళ్ళు అక్కడ దిగిపోగా బస్సు గమ్యం చేరుతుందా లేదా ఎవరికీ పట్టదు".
ఈ కథకు కథానాయకుడు డెబ్భై అయిదేళ్ళు పైబడ్డ తిమ్మరాయప్ప. కథ అతనితోనే ప్రారంభమై అతనితోనే ముగుస్తుంది. పంటలు పండక, నీళ్ళకోసం సొరంగం లాంటి బావి తవ్వి,దానికోసం ఉన్న డబ్బంతా పోగొట్టుకుని,భూముల్ని పాడుబెట్టి,అప్పులపాలై, అందర్నీ పోగొట్టుకుని చివరికి తాకట్టు పెడదామని కుప్పం తీసుకెళ్ళిన మనవరాలి ఒక్క నగనీ, ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటికి తిరిగొస్తూ కిక్కిరిసిన బస్సు ప్రయాణంలో పోగొట్టుకుని జీవచ్ఛవంలా విలపిస్తూ మిగులుతాడు. అతని బాధకి ప్రత్యక్ష సాక్షిగా ..నాగరిక సమాజంలో నలిగిపోతున్న రమణమూర్తి! ఇంతే... కథ!
మహేంద్ర కవిత్వం నేను చదవలేదు కానీ అతడు కవి అని చదివాను. సామాజిక స్పృహ గల అందరు కవుల్లాగానే అతడు కూడ యదార్థ జీవిత వ్యథార్థ దృశ్యానికి చలిస్తాడు, స్పందిస్తాడు. అతని స్పందనను అద్భుతమైన భావ వ్యక్తీకరణతో చిత్రిస్తూ సాక్షాత్తూ కుప్పం బస్టాండ్ లో ఒక పక్కన మనల్ని నిలబెడతాడు.
పల్లెల్లో ఉండే మురికి కూపాల్లాంటి డొక్కు బస్సులనూ,దుర్గంధపూరితాలైన బస్టాండులనూ,డ్రైవరు, కండక్టరు,ఇత్యాదులను మహేంద్ర వర్ణిస్తుంటే అవి మన కళ్లముందు నిలవాల్సిందే! ముఖ్యంగా పల్లెటూరు జనం బస్సులో చోటు సంపాదించడానికి పడే పాట్లను వీరోచిత కార్యంగా మహేంద్ర వర్ణిస్తాడు.
ఎంతోసేపు ఎదురుచూసాక వచ్చిన పెద్దపర్తిగుంట బస్సులో మనల్ని కూడా ఎక్కిస్తాడు రచయిత.కష్టపడి సీట్లు సంపాదించిన వెంకటసామి,సంపంగగౌడు, రమణమూర్తి మొదలైనా వారితో పాటు వృద్ధాప్యం వల్ల సీటు గాదు కదా రెండుకాళ్ల మీద నిలబడే చోటు గూడా సంపాదించడం కష్టమై ఊతకర్ర సాయంతో ఒంటికాలిమీద నిలబడ్డ తిమ్మరాయప్ప,లింగయ్య అనబడే అనుచరుడి సాయంతో నిలబడ్డ మాజీ జమీందారు కూడా ఎలాగో బస్సెక్కుతారు.
క్రిక్కిరిసిన బస్సు కుప్పం ఇరుకురోడ్ల గుండా ఊగిపోతూ ప్రయాణం ప్రారంభించడం నుంచి, పెద్దపర్తి గుంట చేరకుండానే ఆగిపోవడం దాకా జరిగిన ప్రస్థానాన్ని రచయిత చిత్రించిన తీరు అద్భుతంగా ఉంటుంది.
కండక్టరు చూడండి..."ఈ జనసంక్షోభంలో అతడు కొమ్మలమీదినుంచి దూకే కోతిలా, బొరియల్లో దూరే సర్పంలా,గాలిలో వలయాలు తిరిగే తూనీగలా ప్రయాణీకుల్లోకి ప్రవేశించాడు..ఆ సమయంలో సాగర మథనంలో హాలాహలంలా పుట్టుకొచ్చాడు.అతడు మనుషుల శరీరాల మధ్య పాతిపెట్టినట్టుగా ఇరుక్కుపోయి కండరాల మధ్య రక్తనాళంలా కదులుతున్నాడు.అత్యుష్ణ పూరితమైన పరిశ్రమలో పని చేస్తున్నట్లు అతడి శరీరం చెమటతో దొప్పదోగుతోంది.అతడు రెండు చేతుల్తోనూ జనాన్ని వెనక్కి తోసుకుంటూ జనజలధిని ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఒక చేత్తో క్రెడిల్ నుంచి టికెట్లను చింపుతున్నాడు. మరో చేత్తో నోట్లను లెక్కెడుతున్నాడు. ఒక చేత్తో టికెట్లను పంచ్ చేస్తున్నాడు. మరో చేత్తో చిల్లరడబ్బులను తోలు సంచీ లోంచి చిల్లర గలగరించి తీస్తున్నాడు. ..." పట్నం నుంచి పల్లెకు సాయంత్రం వేళ బయలుదేరిన ఎర్రబస్సులో మీరెప్పుడైనా ఎక్కి ఉంటే ఈ కండక్టరుని తప్పక మీకు తారసపడే ఉంటాడు కదూ!
బస్సు బయలుదేరాక పరిస్థితి చూడండి.
"బస్సు మెయిన్ రోడ్డు దిగి పెద్దపర్తి గుంట మట్టిబాట లోకి వెళ్ళే లంబకోణపు మలుపు తిరగడానికి నానా యాతనలూ పడుతోంది. ఈ కార్యక్రమంలో యధావిధిగా మలుపులోని పెంకుటింటి తాలూకు మరో రెండు పెంకులు రాలి పడ్డాయి.ఇంటిగల వాళ్ళు వెలుపలికి వచ్చి ఈ బస్సులకెప్పుడు పోయే కాలం వస్తుందో కానీ తమ ఇల్లు కూల్చకుండా అవి నిద్రోయేటట్లు లేవని పాపాల భైరవుడు సత్తార్ సాహెబ్(బస్సు డ్రైవరు) ని అతడి సకల స్త్రీ జనాల శీలాలను శంకిస్తూ బూతులు తిట్టసాగారు.
"ఇంతలో ఒక స్త్రీ తనకు బస్సెక్కితే వాంతులవుతాయనీ,తనకు సీటు ఇవ్వని పక్షంలో ఎవరి మీదనైనా వాంతి చేసుకోగలననీ భయపెట్టసాగింది.కేవలం సీటుకోసమే ఆమె దొంగెత్తు వేస్తోందని కొందరు ఆమె కోరికను వీటోచేయ జూసారు గానీ ఆమెకు దగ్గరగా ఉన్నవారు ఆమె ముఖకవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగారు."
ఇటువంటి అనేక విషమ పరిస్థితుల్ని దాటుతూ బస్సు ప్రయాణిస్తుంది. ఒకరి బాగు,సంక్షేమం మరొకరికి పట్టని ఈ ప్రయాణంలో చాలా మంది దిగిపోయాక పెద్దపర్తి గుంటదాకా పోని బస్సు ఒక ఇసగవాగులో దిగబడి ఆగిపోగా అందులో మిగిలిన ప్రయాణీకులు విలేకరి రమణమూర్తి, దగాపడ్డ వృద్ధుడు తిమ్మరాయప్ప.
బంగారు గనులు మైనింగ్ కాంప్ గురించి ఎటువంటి సమాచారమూ దొరకని రమణమూర్తి చివరకు ఆ బస్సులో మిగిలిన తిమ్మరాయప్ప మీదే ఆధారపడతాడు. అరిచి గీపెట్టి అధికార పక్షం తరహాలో "బంగారు గనులిక్కడ పడటం వల్ల మీ బతుకులు బాగుపడ్డాయి కదూ! మీకు జీవనోపాధి దొరుకుతోంది కదూ"అని అడుగుతాడు. దానికి తిమ్మరాయప్ప ఇచ్చిన సమాధానమే ఈ నవల ఆత్మ!
"ఈ నేల్లోనే మేము పుట్నాము. మా తాతల కాలం నుండీ ఈ నేలనే నమ్ముకోని బతకతా ఉండాము! కొందరు మనుషులు నేల్లోనే బంగారం దీస్తామని మా దగ్గర కూలిపన్లు సేయించుకుంటా ఉండారు. వాళ్ళు వచ్చిన కాణ్ణించి మా సేద్దాలు మూలపడిపోయినాయి. గెనిలో పని అంటే మిత్తవతో పోరినట్టే ఉండాది. ఆ గెన్లో పండే కష్టం బూమ్మీదనే పడితే రాజనాలు పండు.అయినా బంగారం మీద జనాలకెందుకింత బ్రెమో తెలవటం లేదు. అదేమన్నా కూట్లోకి వస్తాదా,కూర్లోకి వస్తాదా? సేతుల కష్టంతో వడ్లు పండించు, టెంకాయ చెట్లు బెట్టు,మామిడితోపులు పెట్టు, ఊరు నాడంతా పచ్చగ కళ కళ లాడతాది. గురిగింజంత బంగారం కొసం ఎకరాలు ఎకరాలుగా బీడుపెట్టేసినారు. ఈడకొచ్చిన ప్రతి మనిషీ ఈడ బంగారం దొరకతాదా అని అడగతాడే గానీ ఈడ తాగేదానికి నీళ్ళు దొరకతా ఉండాయా అని ఒక్కడైనా అడగతా ఉండాడా?భూమండలానికి సొరంగాలు యోజనాలుగా తవ్వి కేజీ ఎఫ్(kolar gold fields) కి దీసుకోని బోతా ఉండారే గానీ మంచినీళ్ళు తాగను సేదబావులు తవ్వాలని ఎవరైనా అనుకుంటా ఉన్నారా? నీటికరవు లేని కాలాల్లో పైర్లు పండే కాలంలో మా ఆడోళ్లంతా బంగారం నగలు దిగేసుకోనుండ్రి. " ఈ రకంగా సాగుతుంది తిమ్మరాయప్ప ఆవేదన.
ఇంతలో బస్సు ఒక ఊరింకా రెండుమైళ్ళ దూరంలో ఉండగానే ఇసకవాగులో దిగబడి ఆగిపోతుంది. దిగి నడవక తప్పని ఆ చిమ్మ చీకటిలో కూడా ఆ వృద్ధుడు తన సర్వస్వాన్నీ దిగమింగి రాకాసిలా నోరుతెరుచుకుని చూస్తున్న బావిని రమణమూర్తికి చూపిస్తాడు. సంభాషణ ముగిసిన మరుక్షణంలో అతడు తన వద్ద మిగిలిన ఒక్క నగా బస్సులో పోగొట్టుకున్నానని గ్రహించి నెత్తీ నోరూ బాదుకుంటాడు.
రమణమూర్తి పరిస్థితి వర్ణనాతీతం! ఒకపక్క మట్టిలోనుంచి బంగారాన్ని వెలికి తీసి జనుల భవితవ్యాన్ని సుసంపన్నం చెయ్యాలన్న తపనతో వేలాది మంది కార్మికులు పని చేస్తున్న ఆ భూమిలోనే ఒక నిర్భాగ్యుడైన ముసలివాడు విగతజీవిగా మారిపోతున్న దృశ్యం అతన్ని దిగ్బ్రాంతి పరుస్తుంది.
ఆదిమ శిలా యుగం నుంచీ అంతరిక్షం దాకా విస్తరిల్లిన మానవ నాగరికతా ప్రస్థానానికి గమ్యం ఏమిటి?
ఈ నిరంతర స్పర్థాయుత క్షణ క్షణ సంఘర్షణామయ సతత అనిషిత అపాయకర సుదీర్ఘ పథంలో చివరకు దొరికేదేమిటి? అది మిగిలేదెవరికి? అన్న అంతుచిక్కని ప్రశ్నలతో నవల ముగుస్తుంది.
మహేంద్ర చిన్న వయసులోనే కాన్సర్ బారిన పడి మరణించకుండా ఉండి ఉంటే మరెన్నో ఆణిముత్యాలవంటి రచనలను అందించి ఉండేవాడు. తెలుగు పాఠకుల దురదృష్టం!
అభిరుచి గల పాఠకులు తప్పక చదవి తీరాల్సిన నవల. కానీ ఇది ఇప్పుడు విశాలాంధ్రలో దొరుకుతుందన్న నమ్మకం లేదు.రెండో ముద్రణ పడినట్లు లేదు.
"స్వర్ణసీమకు స్వాగతం"(నవల)
రచయిత: మధురాంతకం మహేంద్ర
ప్రచురణ "కథా కోకిల"
దామల్ చెరువు
చిత్తూరు జిల్లా







