January 19, 2010

వాహ్ ఉస్తాద్! వాహ్!


జాకీర్ హుస్సేన్ అనేవాడు లేకపోతే భారతీయ సంగీతంలో తబలా అనేది కేవలం పక్క వాయిద్యంగానే మిగిలిపోయేదేమో!




ఢిల్లీ దూరదర్శన్ లేకపోతే ఇటువంటి కళాకారులు సామాన్య కళారాధకులకు ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోయేవారేమో!



రెండు దశాబ్దాల క్రితం దూర దర్శన్ ప్రభ వెలుగుతున్న రోజుల్లో తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో కలిసి జాకీర్ హుస్సేన్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కార్యక్రమాలనెవరు మర్చిపోగలరు? అలల్లాగ అతని జుట్టు నుదుటిమీద పడుతుంటే అది దూరదర్శన్ కెమెరా స్లో మోషన్లో చూపి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన క్షణాలు ఎవరికి మరుపుకొస్తాయి?



తబలా అనేది కేవలం పక్క వాయిద్యం కాదనీ,దానితో అద్భుతాలు సృషించవచ్చనీ జాకీర్ నిర్ధారణ చేశాక,
అతని అభిమానిగా మారకుండా ఉండటం అసాధ్యమే అయింది.అందుబాటులో అతని కచేరీలు ఉంటే వెళ్ళకుండా ఉండటమూ అసాధ్యమే అయింది.





మొన్న జనవరి 16 శనివారం సాయంత్రం హైదరాబాదు ప్రేక్షకులు అతడి వేళ్ళు చేసే మాజిక్ కి కట్టుబడి బందీలై పోయేందుకు హోటల్ నొవోటెల్ ప్రాంగణంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కి పరుగు పరుగున వచ్చారు. వారిలో మేమూ!



ఈ కచేరీలో జాకీర్ తో పాటు ఆయన సోదరుడు తాఫిక్ ఖురేషి(Drums),సితార్ మేస్ట్రో నీలాద్రి కుమార్,సారంగి కళాకారుడు సాబిర్ ఖాన్ కూడా పాల్గొన్నారు.



తాఫిక్ మొదటగా వచ్చి కేవలం నోటితో చేసే "హ" అనే శబ్దంతోనే ఒక పెద్ద కంపోజిషన్ దాదాపు ఇరవై నిమిషాల సేపు ఉచ్ఛ మంద్ర స్థాయిల్లో వినిపించి, అందులోంచి తేరుకునేలోపుగా ఉచ్ఛస్థాయిలో ఉంది భార్య గొంతనీ, మంద్రస్థాయిలో మొహమాటపడుతోంది భర్త గొంతనీ తేల్చి నవ్వించాడు. (మగవాళ్ళను నవ్వించడానికి ఇంతకంటే మంచి జోకు ఉంటుందా? ) 



రెండు మూడు జోకుల తర్వాత అతి సామాన్యంగా వచ్చి సారంగి తో రాగాలాపన మొదలుపెట్టిన సాబిర్ ఖాన్ మరి కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులను తనతో పాటు మరోలోకానికి తీసుకెళ్ళిపోయాడు.

అక్కడ, ఆ రసలోకపు తీరాల్లో అతని సారంగి తరంగాలు తప్ప మరేమీ లేవు. అసలు సారంగి వాద్యమే ఒక గొప్ప విషాదంలా, మనల్ని చుట్టేస్తూ ఏవేవో గతజన్మ స్మృతుల్ని శృతిచేస్తూ ఆనందమూ, దుఃఖమూ కలగలిసిన తీరాలకు తోడ్కుపోయేలా ఉంటుంది.

 సాబిర్ ఖాన్ కుటుంబంలో సారంగి వాద్యం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాగా ఇతడు ఏడో తరం కళాకారుడట. పట్టుమని పాతికేళ్ళు లేని ఆ యువకుడి అసమాన ప్రతిభ చూసి నిజంగా కొద్దిగా ఈర్ష్య వేసింది.అతడి వాద్యంలో ప్రేక్షకులు ఎంతగా లీనమైపోయారంటే మధ్యలో నిశ్శబ్దంగా వచ్చి కూచుని తబలాతో శృతి కలిపేదాకా ఎవరూ జాకీర్ ని గమనించనే లేదు.






ఆ తర్వాత జాకీర్ చేసిన అద్భుతాలు ఎన్నని? సారంగికి పక్క వాయిద్యంలా ఉన్న తబలాకి కాసేపటికే సారంగి పక్క వాయిద్యంగా మరిపోయింది!అద్భుతమైన అతడి వేళ్ల కదలికలు సృష్టించిన మాయాజాలానికి అంతే లేకుండా పోయింది.

 రాధాకృష్ణుల చిలిపి తగాదా,అడవిలో లేడిపిల్ల గంతులు,రుద్ర తాండవం,ట్రాఫిక్ జామ్ వంటి అనేకాంశాలను, సంఘటనలను, సంభాషణలను తబలా కంపోజిషన్ లో మలిచి వినిపించారు(ఇది ఆయన దాదాపు ప్రతి కచేరిలోనూ చేస్తారు)

రుద్రతాండవం లో తబలా మీద శంఖ ధ్వనిని సృష్టించి అబ్బురపరిచాడు.ప్రేక్షకులెవరూ ఇది ఊహించనిది కావడంతో ఆ శంఖ ధ్వనికి ఆడిటోరియమంతా "హా" అన్న శబ్దంతో ఒక్కసారిగా అబ్బురపడిపోయింది.



తరవాత వచ్చి కలిసిన నీలాద్రి కుమార్ సితారతో ప్రతి ఒక్కరి గుండెనూ మీటి మంత్ర ముగ్ధుల్ని చేశాడు.కొన్ని కొన్ని తారాస్థాయిల్లో... రసానుభూతి అంటే ఇదీ అని నిర్వచించిన అనుభూతి! రస సిద్ధి అంటే ఇదే అని నిశ్చయించిన అపురూప క్షణాలు. అతని ప్రతిభకు జాకీర్ సైతం తలవంచి అభివాదం చేశాడు.నీలాద్రి కుమార్ కూడా వారి కుటుంబంలో అయిదో తరం సితార ప్రవీణుడట.





చివర్లో నలుగురూ కలిసి సృష్టించిన ఫ్యూజన్ ఒక మధురానుభూతి. దాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం సాహసమే! విన్నవారికి అనుభవైకవేద్యం కావలసిందే తప్ప ఇంత బావుందని చెప్పడం పేలవంగా ఉంటుంది.



అద్భుతమై, రస ప్రవాహంలో తేలియాడించి ఉర్రూతలూగించిన ఆ సాయంత్రాన్ని పదిలంగా మదిలో దాచుకుని భారంగా తిరిగి రాక తప్పింది కాదు.... కళ్ళముందే మూడుగంటల కాలం మంచులా కరిగిపోగా!



కొసమెరుపు: "ఆ తబలా అంకుల్ జుట్టు "అపరిచితుడి" జుట్టులా ఉంది" అంటూ మా పాప కితాబిచ్చింది వస్తూ వస్తూ!

Note: ఫ్లాష్ ఉపయోగించకుండా ఫొటో తీయవలసి రావడంతో ఫొటోలు ఇలా చీకట్లో కాంతులీనుతున్నాయి.

January 16, 2010

ఈనాడులో తెలుగోడు.... అబ్రకదబ్ర!



బ్లాగ్లోకంలో తెలుగోడంటే అబ్రకదబ్రే! పరిచయం అవసరం లేదు.



బ్లాగర్ నుంచి కథా రచయిత ప్రమోషన్ తెచ్చుకున్న  ఈ అసలు సిసలు తెలుగోడిని బ్లాగ్లోకంలోనే కాక తెలుగు పాఠక ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంగా.... బుల్లి సమీక్ష ఈనాటి....ఈనాడులో!


ఇంత మంచి రచయితను తెలుగు పత్రికలు నిజంగా మిస్ అవుతున్నాయని నా అభిప్రాయం. ఈ మాట ఇక్కడెందుకు రాశానంటే ఈ లైను ఈనాడు రివ్యూలో ఎడిట్ అయిపోయింది మరి!



అనిల్...ది అబ్రకదబ్ర........!



మీ బ్లాగును ప్రపంచం నలుమూలలా అసంఖ్యాక పాఠకులు చదవాలనీ,మీరు ఈ వూపుని కొనసాగిస్తూ ఎన్నెన్నో మంచి టపాలు రాసి అందర్నీ అలరింపజేయాలని,త్వరలో మీ బ్లాగు లక్ష హిట్ల మైలు రాయిని దాటాలనీ...ఎన్నెన్నో మంచి కథలు సృష్టించి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయాలనీ(అబ్బ, మరీ పొయెటిక్ గా రాసేస్తున్నా కదూ)కోరుతున్నా!

January 11, 2010

నాకు నచ్చిన ఒక కథ "ఇరుకు"




మంచి కథ ఎలా వుండాలి? అంటే ఏం చెప్తాం? నాకైతే ఒక కథ చదివామూ అంటే అది ఎప్పటికైనా సరే బుర్రలో అలా గుర్తుండిపోవాలి, కనీసం అస్పష్టంగా అయినా సరే! ఆ కథ లాంటి పరిస్థితి ఎక్కడైనా తారసపడితే వెంటనే ఆ కథ గుర్తు రావాలి. అందులో సందేశం ఉండక్కర్లేదు, గొప్ప పదజాలమో భావజాలమో ఇజమో పాడో ఏమీ ఉండక్కర్లేదు. విమర్శకుల విమర్శలో ప్రశంసలో పొందక్కర్లేదు. జీవితంలోని ఒక పార్శ్వాన్ని స్పృశించగలిగితే చాలు అనిపిస్తుంది. దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటాను ఆంధ్ర ప్రభ వారపత్రికలో రచయిత శ్రీ సలీం రాసిన కథ "ఇరుకు" చదివాను.ఎందుకో అందులోని కథాంశం అలా గుర్తుండిపోయింది. ఈ కథలోని పాత్రల్లో ఒకరిలా తప్పక నేనూ ప్రవర్తిస్తానేమో అనిపించింది. అలా ప్రవర్తించకపోతే ఒక ముసుగులో ఉన్నట్లే అనిపించింది.



కల్పన గారి బ్లాగు. లో ప్రస్తావన వచ్చాక ఈ కథను సంపాదించగలిగాను. ఆ పైన రచయిత సలీం గారితో ఫోన్లో మాట్లాడి కథను బ్లాగులో పెట్టడానికి అనుమతి సంపాదించాను.


ఈ కథ తెలుగు విశ్వవిద్యాలయం వారి వార్షిక కథా సంకలనంలో కూడా చోటు చేసుకుంది. తర్వాత నిశ్శబ్ద సంగీతం అనే సలీం గారి కథా సంకలనంలో వచ్చింది.

కథ చదవండి.ఎలా వుందో అభిప్రాయం తెల్పండి.సలీం కూడా తెలుసుకుంటారు.








  



  చదివారా? నిజానిక్కడ ఇరుకు లిఫ్ట్ లో ఉన్నది కాదు. మనుషుల మనసుల్లో ఉన్నదే! అందుకే ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటారు, ఒక గంట సేపట్లో ఆధిపత్య ధోరణి ప్రదర్శించుకుంటారు,రేపు ఒకరి మొహం ఒకరు చూసుకోవాలన్న మొహమాటం కూడా లేకుండా తీవ్రంగా ప్రవర్తిస్తారు. మనుగడ కోసం పోరాడినంత హంగామా
చేస్తారు.




నిజానికి మనుషుల్లో ఉండే సహజ ప్రవృత్తిని ఇంత చక్కగా ఆవిష్కరించే ఇలాంటి కథ చదివి చాలా రోజులైంది. ఎంత సేపూ బోధించి, బాధించే కథలే! మనసులో ఉండే వికారాలను దాస్తూ,పాజిటివ్ కోణాలతో వేసే ముసుగుల్తో అలంకరించే కథలే అన్నీ!



అందుకే మనిషి ప్రవృత్తిని ఆవిష్కరించిన ఈ కథ నాకు బాగా నచ్చింది.

January 2, 2010

వనవాసి...పరిచయం "పుస్తకం" లో!

మంచి పుస్తకం ఒకటి నచ్చితే దాన్ని నలుగురితో పంచుకోవడం నాకిష్టం! బ్లాగులోనే కాదు, ఇతరత్రా కూడా నాలాగే పుస్తకాలంటే ఇష్టపడే మిత్రుల్ని పట్టుకుని వాళ్లతో చెప్పక మానను. అందుకే నా బ్లాగులో "పుస్తక పరిచయాలే" తప్ప సమీక్షలుండవు.




పుస్తకం.నెట్ మొదలైన ఏడాదికి ఆ వెబ్ సైట్ కి ఒక పరిచయ వ్యాసం పంపాను. ఈ ఏడాదిలో మొదటి టపా కాబట్టీ, "పుస్తకం" స్థాయినీ గుర్తు పెట్టుకుని ఒక మంచి పుస్తకం గురించి రాయాలని నిర్ణయించుకుని ఎప్పుడో దాదాపు అర్థ శతాబ్దం క్రితం అచ్చయిన భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ నవల "వనవాసి" గురించి రాశాను. ఈ మధ్యే ఈ మంచి పుస్తకాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చింది.



అందరూ చదవాల్సిన మంచి పుస్తకం. అతి మంచి పుస్తకం! మరపురాని పుస్తకం!



ఈ పుస్తకం పై "పుస్తకం" లో నేను రాసిన పరిచయం. చదివి ఎలా వుందో చెప్పండి.దయచేసి మీ అభిప్రాయాలను అక్కడే రాయండి. వ్యాసం, అభిప్రాయాలు ఒక్కచోటే ఉంటే బావుంటుంది ! 


కొత్త సంవత్సరంలో నా రాతలు ఒక మంచి పుస్తక పరిచయంతో మొదలవడానికి, అది పుస్తకం ద్వారా సాధ్యమవడానికి కారణమయిన పూర్ణిమ, సౌమ్యలకు థాంక్యూలు!