May 21, 2010

మనమీదేనర్రోయ్!


The Times of India నుంచి తీసుకున్న కొన్ని కార్టూన్లు ఇవి! అజిత్ నయనన్ వి! సగటు మనిషి జీవితంలో ని లొసుగుల్ని చెంప ఛెళ్ళుమనిపించి గీసి చూపే ఆర్కే లక్ష్మణ్ గీతలకు ఏ మాత్రం తీసి పోకుండా ఉన్నాయి చూడండి!


The Times of India నుంచి కొన్ని చురుక్కులు- కిసుక్కుమనిపించే చమక్కులు ఇవిగో!మినిమమ్ కాదు మాగ్జిమమ్ నవ్వులు గ్యారంటీ!























May 19, 2010

ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే!

భయం భయం! అనుక్షణం భయంతో బతకడం ఏం బావుంటుంది? తిండి నీళ్ళు లేకపోయినా బతకొచ్చు గాని మనశ్శాంతి లేకుండా ఎలా?

షాపింగ్ మాల్స్ లో మల్టీ ప్లెక్సుల్లో లోపలికి వెళ్లగానే నిలేసి ఒళ్ళంతా తడిమి రక్షణ పరీక్షలు చేయడం మొదలైన రోజుల్లో నేను చాలా అవమాన పడేదాన్ని!"నాకా? నాకా ఈ పరీక్షలు!ఈ దేశ పౌరురాలిని, నన్నా, మీరు అనుమానిస్తున్నది?"అని కుమిలేదాన్ని!తర్వాత కన్వీనియెంట్ గా అలవాటు పడిపోయాను.




లోపల అడుగు పెడుతుండగానే మనల్ని ఎక్స్ రే కళ్ళతో అనుమానంగా చూస్తూ

"నువ్వు తీవ్రవాదివా? ఏదీ నీ బాగ్ లో ఏముందో చూపించు! ఆయుధాలేమీ తేలేదు కదా! కొంపదీసి నీ తోటి పౌరుల్ని చంపే ప్లానేదీ లేదు కదా!నీ మొహం చూస్తే అలాగే ఉంది గానీ కాస్త పక్కకి రా! నీ సంగతేంటో చూడాలి"  "అని షాపింగ్ మాల్స్ వద్దా, సరదాగా సినిమా చూద్దామని వెళితే అక్కడా,చివరికి బియ్యం, కందిపప్పు కొందామని వెళితే కూడా నిలువెల్లా పరీక్షలు చేసే పరిస్థితికి హైదరాబాదీయులు (మిగతా నగరాల్లో ఉన్నా, ఇంత తీవ్రంగా భయోత్పాత వాతావరణం ఉండదని నా విశ్వాసం)బాగా అలవాటు పడిపోయారు.



పోనీ అవేమన్నా సక్రమంగా జరుగుతాయా అంటే అదీ లేదు. జీవీకే వన్ వంటి మాల్ వద్ద కూడా మహిళలని చెక్ చేసే మహిళా సెక్యూరిటీ గార్డులు చాలా అలసత్వంతో ఉంటారు. ఇద్దరు ఉంటారు కాబట్టి సమకాలీన రాజకీయాల గురించో,వాళ్ల వీధిలో మంజీరా నీళ్ళెప్పుడొస్తాయో మాట్లాడుకుంటూ బాగ్ తెరిచి చూపిస్తున్నా, "సర్లే పదండి"అని పంపేస్తారు. రద్దీగా ఉంటే కొందరు చెకింగ్ లేకుండానే లోపలికి వెళ్ళిపోతుంటారు.

కొన్ని చోట్ల ఈ మాత్రం కూడా పట్టించుకోరు. బంజారా హిల్స్ లోని సినీమాక్స్ లోకి నాలుగైదు సార్లు నన్ను చెక్ చేయకుండానే పంపేశారు. కోకొల్లలు గా ఉన్న ఫలానా ఫలానా బ్రదర్స్ అయితే అసలు పట్టించుకోరు.వాళ్ళ సెక్యూరిటీ అంతా మాల్ లో సరుకు బయటికి పోకుండా ఉండేందుకే తప్ప, లోపలికి ఏం వెళుతున్నాయో అనే దాని మీద కాదు. అది ఈ మధ్యనే ఒక మాల్ లోకి పోలీసులు విజయవంతంగా లోపలికి పేలుడు పదార్థోలో ఆయుధాలో పంపడంతో రుజువైంది.

పరిస్థితి ఇంతగా విషమించి, పక్కన పోయే ప్రతి వాడినీ  "ఎవరు నువ్వు?కొంపదీసి తీవ్రవాదివా" అని అనుమానిస్తూ తొలగిపోయే రోజులొచ్చాయి!
అసలు ........
విపరీతమైన వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, జన సమ్మర్థం ఉన్న చోట గ్రోసరీ సామాన్లు సైతం అమ్మే షాపింగ్ మాల్స్ కి అనుమతి ఇవ్వ కూడదు.

ఇక్కడ పార్కింగ్ దొరకదు,
వాలెట్ పార్కింగ్ ఉండదు,
పార్కింగ్ లో సరైన పర్యవేక్షణ గానీ, ఒక గార్డు కానీ ఉండడు.
చుట్టూ బోల్డన్ని షాపులు.
పైగా వీళ్ళు నెలకోసారి "సబ్ సే సస్తా వీక్" లాంటి స్కీములు, డిసెంబర్ నెలాఖరులో  "క్లియరెన్స్ సేలు"వగైరాలు ప్రకటిస్తుంటారు.

దానితో జనం విరగబడి వస్తారు.అలాంటపుడు ఏ బాంబైనా పేలితే? పోయిన ప్రాణాలకు ఎవరు జవాబుదారీ?

అంతా జరిగాక, ఆ భవనానికి అసలు అనుమతే లేదనీ,పార్కింగ్ తగినంతగా లేదనీ, ఏవేవో తవ్వి తీస్తారు, చేతులు కాలాక!

లేటెస్ట్ గా శ్రీమాన్ వికారుద్దీన్ గారి చొరవతో జరిగిందని భావిస్తున్న కానిస్టేబుల్ హత్య తర్వాత ఇక పోలీసుల హడావుడి చెప్పనలవి కాదు.

ఇందులో ముఖ్య బాధితులు టూ వీలర్స్, అందునా యువకులు!ఆ బండి నడిపేవాడి వద్ద ఒక బాక్ పాక్ ఉందంటే దాదాపుగా పక్కకి ఈడ్చుకెళ్ళినంత పని చేయడమే! లైసెన్సులూ వగైరాలన్నీ చెక్ చేసి అన్నీ సక్రమంగా ఉంటే పంపిస్తారా అంటే అదీ లేదు! ట్రాఫిక్ వాళ్ళ లాగా డబ్బు వసూలు చేయడం! నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడ్డం,ఏకవచనంలో సంబోధించడం,విసురుగా బాగులు లాక్కుని చెక్ చేయడం ఇవన్నీ నిన్న ఒక కూడలిలో రెడ్ సిగ్నల్ వద్ద కారాగినపుడు తీరిగ్గా గమనించాను.


ఇదంతా ఎన్నాళ్ళంటే మరో నాల్రోజులు! ఈ లోపు అందరూ నెమ్మదిగా ఈ విషయాన్ని మర్చిపోతారుగా!మళ్ళీ మామూలే! మళ్ళీ ఏదన్నా హత్యో,బాంబు బెదిరింపులో రాగానే కథ మళ్ళీ మొదలు!
అంత "కాజువల్" గా మొక్కుబడిగా అయిపోయింది వ్యవహారం!

తీవ్రవాదుల  బెదిరింపులు నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయినట్టు భయంతో  బతకడం మామూలైపోయింది.
ఎవరన్నా అదేపనిగా మనకేసి చూస్తుంటే భయం, రోడ్డు మీద ఏదన్నా ప్లాస్టిక్ సంచి చూస్తే భయం, నలుగురు ఉన్న చోట నిలబడాలంటే భయం!


వరసగా దాడులు జరుగుతున్నా, ప్రాణాలు గాలి బుడగల్లా పేలిపోతున్నా,  రక్షణ విషయాన్ని ఎందుకు ఎవరూ సీరియస్ గా తీసుకోరంటారు? కానిస్టేబుల్ హత్య తర్వాత అందుబాటులొ ఉన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

అయితే ఇహ ఎవరి ప్రాణాల్ని వారు రక్షించుకోవలసిందేనా?
ఎన్ని సంఘటనలు వరసగా జరిగినా మనం వాటినుంచి ఏమీ నేర్చుకోలేమా? 9/11 దుర్ఘటన తర్వాత అమెరికా లొ ఒక్క తీవ్రవాద చర్యా జరిగినట్లు నాకు తెలీదు!

మనకెందుకు ఈ అలసత్వం? వరుసగా ఎన్ని దుర్ఘటనలు జరిగినా(అవి చేసింది తీవ్రవాదులా, మావోయిస్టులా అనేదిపక్కన పెట్టండి! ఏ రాయి అయితేనేం జనం పళ్ళు రాలగొట్టుకోడానికి?)ఎంత రక్తం పారినా,మన కేంద్ర,రాష్ట్ర హోమ్ మంత్రులకేం పట్టదు.

ఎంతటి దుర్ఘటన జరిగిందని తెల్సినా ఏ మాత్రం గాభరా పడకుండా,షాక్ తినకుండా ఏ భావమూ ప్రకటించకుండా,అతి నెమ్మదిగా స్పందించగలిగే హోమ్ మంత్రిని మీరెక్కడైనా చూశారా?..ఇక్కడ తప్ప!

కొన్నేళ్ళ క్రితం వరకూ యుద్ధ వాతారణం ఉన్న హాలీవుడ్ సినిమాల్లో మిడిల్ ఈస్టు దేశాల్లో వాతావరణం చూసి "అబ్బ,ఇలాంటి దేశాల్లో జనం ఎలా బతుకుతారో!అక్కడినుంచి వేరే చోటికి పోవచ్చుగా"అనుకునేదాన్ని!

ఈ మధ్య హర్ట్ లాకర్ సినిమా చూసినపుడు ఒకవ్యక్తిని బాంబులతో కట్టిపడేసి పేల్చేసిన దృశ్యం చూసినా పెద్దగా భయం వేయకపోగా ఇలాంటివి మనదేశంలోకూడా మొదలవుతాయేమో అని సందేహం కూడా కల్గింది.


 ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే! ప్రభుత్వం ఉందో లేదో తెలీని చోట వేరే ఛాయిస్ లేదు.

May 13, 2010

లెనిన్ సెంటర్లో ఉక్రేనియన్ జానపద గాథలు.... పట్టేశా!


మాస్కో "రాదుగ" ప్రచురణాలయం వాళ్ళ పుస్తకాలు భలే ఆకర్షణీయమైన తెలుగు ఫాంట్ తో, మంచు కురిసే రష్యా అందాల్ని ఆవిష్కరిస్తూ, బోలెడంత ముద్దొస్తూ ఉంటాయి. రాదుగ ప్రచురణాలయం మూత పడిందని తెలిసినపుడు వాళ్ళ పుస్తకాలన్నీ చదువుతూ పెరిగిన మేము(నేను, నా కజిన్సూ) "రాదిక నీ కోసం చెలీ..."రాదుగ" వసంత మాసం! ఇక రాదుగా"అని విషాద గీతాలు పాడేసుకుని సరిపెట్టుకున్నాం!అప్పటివరకూ వచ్చిన పుస్తకాలేవీ జాగ్రత్త కూడా పెట్టుకోలేదు. అలా పోగొట్టుకున్నదే ఉక్రేనియన్ జానపద గాథలు పుస్తకం.




పోగొట్టుకున్నది వెదుక్కోడానికేగా! అందుకే అప్పటినుంచి పట్టు వదలని విక్రమార్కుడి చెల్లెల్లా విశాలాంధ్ర బ్రాంచీలన్నీ వెదికాను.

వాళ్ళకు నా కంటే నిర్లక్ష్యం!

"మా దగ్గర లేదు. ఎక్కడ దొరుకుతుందో మాకు తెలీదు పొండెహె"అని భలే మర్యాదగా చెప్పారు.


అలాగే నేను గత పదిహేనేళ్ళుగా వెదుకుతున్న మరో అద్భుతమైన పుస్తకం ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా రాసిన "ఎర్త్" కి సహవాసి గారి అత్యద్భుత అనువాదం "భూమి" నవల. అది మా వూరి లైబ్రరీలో చదివాక ఎలాగైనా సంపాదించాలనుకున్నాను.హైద్రాబాదు బుక్ ట్రస్ట్ వారు 1983లో వేశారు దాన్ని. వాళ్ళ దగ్గర అడిగితే "మా వద్ద కూడా ఒకటే కాపీ ఉంది.జిరాక్స్ కాపీ కావాలంటే ఓకే"అన్నారు.కానీ నాకు ఫొటోస్టాట్ కాపీల మీద అంతగా ఆసక్తి లేక ఊరుకున్నాను. ఒరిజినల్ నా లైబ్రరీలో ఉండాలనే స్వార్థం!



విజయవాడ లెనిన్ సెంటర్ లో కూడా రెండు మూడు సార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్కడ అరుదైన పుస్తకాలు లభించే వంశీ బుక్ స్టోర్స్ యజమాని జగన్మోహనరావు(నాగేశ్వర రావుగా అందరికీ పరిచితులు)గారు కూడా "అవెక్కడ దొరుకుతాయమ్మా! లాభం లే"దన్నారు.




ఇక్కడ రెండు ముక్కలు ఆయన గురించి చెప్పుకోవటం విధాయకం! పాత పుస్తకాలమ్మే షాపులు ఎన్నైనా ఉండొచ్చు కానీ సాహిత్యాభిరుచి ఉండి,అరుదైన పుస్తకాలు ఆసక్తి ఉన్నవాళ్ళకు అందుబాటులోకి తేవాలన్న తపన ఆయన ఒక్కరిలోనే కనిపిస్తుంది.ఏ పుస్తకం గురించి అడిగినా దాని పూర్వ చరిత్ర మొత్తం చెప్పగలరు.ఎంతోమంది వారికి కావలసిన అరుదైన పుస్తకాల గురించి అక్కడికి వస్తుండటమే కాక "మొన్న అడిగిన పుస్తకాలు వచ్చాయా"అని ఫోన్లు చేస్తూ ఉంటారు.



గ్రంథ సేకరణ చేసేవారి అనుభవాలను ఆయన గ్రంథస్థం చేసే పనిలో ఉన్నారు.





చివరికి ఆ రెండు పుస్తకాలు,...... ఏవి?....ఉక్రేనియన్ జానపద గాథలు, మరియు "భూమి" చక్కటి చెక్కుచెదరని స్థితిలో(వంశీ స్టోర్స్ లో కాకపోయినా)లెనిన్ సెంటర్లోనే నాకు దొరికాయి.



దొర్లే బఠానీ గింజ
రైతు కొడుకు ఇవాన్,
వింత చేతి గొడుగు
శ్రీమాన్ మార్జాలం,
చక్రవర్తి అయిన సింహం,
నక్కచెల్లి-తోడేలు అన్న,
లైమ్‌చెట్టూ-ఆశపోతు ముసలావిడ ఇంకా మర్చిపోయిన అనేక కథలు ఈ ఉక్రేనియన్ పుస్తకంలో ఉన్నాయి.

"ప్రపంచంలో ఉన్న కథలన్నీ చెప్పేశాను, ఇక నా వల్ల కాదు నీతో" అని మా అమ్మాయితో గొడవ పడుతున్న శుభవేళ ఈ పుస్తకం దొరకడం అదృష్టమే!



"భూమి" అయిపోతుందేమో అన్నంత అపురూపంగా రోజుకోపేజీ చదువుతున్నాను.(మళ్ళీ ఇంకో ఎడిషన్ పడకపోతే ఇక అది నాకు ఎప్పటికీ దొరకదనే నమ్మకంతో ఉన్నాగా మరి ఇప్పటివరకూ) అది ఎలాగూ ఎవరికీ దొరకదు కాబట్టి చదవడం పూర్తయ్యాక ఇక్కడే దానిగురించి రాస్తాను.



ఇంతమంచి అరుదైన విలువైన పుస్తకాలు దొరికేందుకు సహకరించిన మంచి మిత్రులకు బోల్డన్ని థాంక్యూలు!