యమహా నగరి కలకత్తా పురి..!  

Posted by సుజాత in

ఇవాళ వేటూరి పుట్టినరోజు ట

వేటూరి సినీ సాహిత్యంలో ఒక లక్షణం ఉంటుంది.(అనిపిస్తుంది నా వరకూ)! మొదటి సారి విన్నపుడు "బాగుంది"
అనిపించి, ఆ తర్వాత అదొక వ్యామోహం లాగా పట్టుకుని వదలదు. తరచి చూసే కొద్దీ అద్భుత సౌందర్యాలు రత్న మాణిక్యాల్లా దొరుకుతూనే ఉంటాయి.

అలాటి పాటల్లో ఈ మధ్య వచ్చిన వాటిలో ఒకటి యమహా నగరి అయితే మరోటి అర్జున్ సినిమాలో "మధుర మధుర తర మీనాక్షీ "కంచి పట్టు" న కామాక్షి!

వింటున్న కొద్దీ మరిన్ని సౌందర్యాలు తోచి,శోభిల్లే పాటలు ఇవి.

యమహా నగరి కలకత్తా పురి___________కలకత్తా నగరాన్ని ఏ బెంగాలీ కవి అయినా కూడా ఇంత అందంగా, అలతి   పదాలతో సమ్మోహనం గా వర్ణించలేడని బల్ల గుద్ది, వీలైతే విరక్కొట్టి మరీ చెప్పేస్తా నేను. :-)



యమనా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో

ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాటే సాగనా
పరుగులో పరుగు తీసింది పట్నం
బ్రతుకు తో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుకులలో


బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల
మానినీ సరోజినీ
రోజంతా సూర్యుడి కింద రాంత్రంతా రజనీ గంథ సాగనీ
పద  గురూ ,ప్రేమలే లేని లోకం  దేవదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిథుల గొడవట
కలకట నగరపు కిట కిటలో


వందే మాతరమే అన్న వంగ భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయా చౌరంఘీ రంగుల దునియా నీదిరా
విను గురూ, సత్య జిత్ రే సితారా, ఎస్ డి బర్మన్ కి థారా
థెరిసా కీ కుమారా కదలి రారా
జనగణమనముల స్వర పద రవముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ శుక పిక ముఖ  సుఖ  రవళులలో

ఎంత గొప్పసాహిత్యం!!

బెంగాల్ తో ప్రతి భారతీయుడికి ఉండే అనుబంధమంతా ఈ పాటలో ప్రతిఫలిస్తుంది. ఆ వాతావరణమంతా కళ్ళ ముందు కదలాడుతుంది ఈ పాట వింటున్నపుడు

బెంగాలీ కోకిల తెలుగింటి కోడలని గుర్తు చేయడం,వందేమాతరం అక్కడ పుట్టింది కాబట్టి వంగ దేశం జాతికే గీతి అనడం, "జనగణమన" ముల  అనడం  జనగణమన కూడా అక్కడే పుట్టిందని తల్చుకోడం..

ఎంత సౌందర్య భరితం!!

శరన్నవలాభిషేకం__________అనే మాట ఎక్కడైనా విన్నామా అసలు ఇంతకు ముందు? గుండె ఝల్లుమనే ప్రయోగం కదా!
 దేవదా మార్కు మైకం, చౌరంగీ రంగుల దునియా, ఎస్.డి బర్మన్ కి ధారా...థెరిసా కీ కుమారా...!

ఈ పాట ఇంకెవరూ రాయలేరు! అంతే ! ఇది శిలా శాసనం!

చిరంజీవి కూడా ఈ పాటలో ఒక  క్లాసిక్ లుక్ తో ఎంత హాండ్సమ్ గా ఉంటాడో చూడండి(పాట తాలూకు మైకంలో మనకలా కనిపిస్తాడా?)


హరి హరన్ పాటలో(అది రాక్ అయినా,సినిమా పాట అయినా , ఘజల్ అయినా) "సోల్" ఉంటుంది. అది మనకు వినిపిస్తుంది.ఈ పాటకు హరి హరన్ ని ఎంచుకోవడం గొప్ప ఎన్నిక!

ఈ పాటలో తళుక్కున మెరిసే గిటార్,సాక్సో ఫోన్, వయొలిన్ లో ఎంత అందమో!


తబలాతో కల్సి ఆడుకునే Rythm pads లో ఎంత మాధుర్యమో


రఘు వంశ సుధాంబుధి కీర్తనలో స్వరాలు పడాల్సిన చోట్లో రాసిన పదాలో...!

"చిరు" త్యాగరాజు నీ కృతినె పలికెను మది...!

వేటురి పాటల్లో అసంఖ్యాకమైన పాటలు ఇష్టమైనవే అయినా ఈ పాట సాహిత్యం మాత్రం అనితర సాధ్యం,అద్భుత సౌందర్యం,అనన్య సామాన్యం!



ఎన్ని సార్లు విన్నా, అప్పుడే మొదటి సారి వింటున్నంత సంతోషం, సంభ్రమం ఈ పాటలో నాకు!

మీకో?










హైద్రాబాదు లో పూరీ జగన్నాధ్!  

Posted by సుజాత in

(బిజినెస్ మాన్ సినిమా గురించి అనుకుని వస్తే సారీ...)





నేను ఆఫీసుకు రోజూ ఇదే రూట్లో వెళ్తూ చూసుంటా ఈ గుడిని! విశాలంగా, శుభ్రంగా, ఎక్కువ జన సమ్మర్థం లేకుండా (ఇది ముఖ్యం) ప్రశాంతంగా హాయిగా కనిపించే ఈ ఆలయాన్ని ఒకరోజు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే నిన్న సెలవు రోజు కుదిరింది.

సెలవు రోజైనా తోసుకు చచ్చేంత రష్ లేదు. సావకాశంగా గుడి అంతా తిరిగి ఫొటోలు తీసుకున్నాను. ఫొటో గ్రఫీ నిషిద్ధం అని బోర్డు ఉంది కదాని తటపటాయిస్తోంటే పూజారే స్వయంగా తీసుకోమని అనుమతి ఇచ్చాడు. గర్భాలయంలో తప్ప ఏవైనా తీసుకోమన్నాడు.


గుడి ప్రాంగణమంతా చాలా శుభ్రంగా ఉంది. గోడల మీద మంచి శిల్పాలున్నాయి. రాతి శిల్పాలు కావు,. సిమెంట్ తో మలిచినవే అయినా అందంగా ఉన్నాయి. దశావతారాలు,రామాయణ ఘట్టాలు,ఇంకా కృష్ణ లీలలు వగైరాలు గోడల మీద మలిచారు. వాటిలోంచి కొన్ని నచ్చిన ఫొటోలు ___________
గోపురం మీద వాలిన పావురాలు ఒక్కసారిగా ఎగిరినపుడు  ____________
గీత 
 మరో కోణం 
                                        



                                     
 నీ వలపే బృందావనం
                                   
  నీ పిలుపే మురళీ రవం 




సింహా 










                                                    




                                                           సీతాపహరణం 







వరాహం 












                                                                  



                                                                        కల్కి 









బయటి నుంచి 









        ఇంకా..బయటి నుంచి (ఆ వెనకాల కనపడే తెల్ల       గోపురం, యాంటెన్నాలూ గుడివి కావు. తెరాస ఆఫీసువి) 









అన్నట్టు ఈ గుడి బజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, 12 కలిసే చోట ఎమ్మెల్యేస్ కాలనీ లో ( (TRS ఆఫీసు  పక్కనే)  ఉంది.  

"కళ్ళు తెరిచిన సీత" _______రంగనాయకమ్మ కొత్త నవల  

Posted by సుజాత in






"కళ్ళు తెరిచిన సీత"

రంగనాయకమ్మ గారు చాలా రోజుల తరవాత రాసిన నవల. నవ్య వార పత్రికలో ధారావాహిక గా అనేక వారాలు వెలువడి విశేషంగా పాఠకులను ఆకట్టుకుని, అనేక చర్చలకు, వాదోపవాదాలకు దారి తీసిన నవల. అంతే కాక పాఠకుల ప్రశ్నలకు రంగనాయకమ్మ గారు ఈ నవల ప్రచురిస్తున్నపుడు జవాబులు కూడా ఇచ్చారు.

ఇది ఒక సాధారణమైన కథ! (నిజానికి ఇది కథ కాదు. నిజజీవిత గాధ) మీ ఎదురింట్లోనూ, మా పక్కింట్లోనూ, మా పై ఇంటివాళ్ల పై ఇంట్లోనూ కనపడే కథే! ఇందులోని సబ్జెక్ట్ తో ఒక డాక్యుమెంటరీ తీయొచ్చు. అయితే దీన్ని రంగనాయకమ్మ గారు అద్భుతంగా మలిచి చక్కని నవలా రూపాన్నిచ్చారు. యదార్థ గాథకు కల్పనను జోడించి కథలు రాసే ట్రెండ్ ఈ మధ్య అక్కడక్కడా చూస్తున్నాం! అయితే ఈ నవల మొత్తం యదార్థమే! ఇందులో సాక్షాత్తూ రంగనాయకమ్మ గారు, ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు,పాఠకులు, పిల్లలు,వాళ్ళ పనమ్మాయి కూడా మనకు పరిచయం అవుతారు.

కథ విషయానికొస్తే చక్కగా చదువుకుని మైసూరు లో మంచి ఉద్యోగం చేస్తున్న హైద్రాబాదు సీత కి (మారు పేరు)కు అమెరికాలో ఉజ్జోగం చేస్తున్న నాగరాజుతో పెళ్ళి కుదురుతుంది. సీతవి అభ్యుదయ భావాలూ, నాగ రాజువి అట్టడుగు ఆలోచనలూ! ఈ ఆలోచనా ధోరణీ, భావాలూ ఇవన్నీ సీతకు పెళ్ళికి ముందే అర్థం అయ్యే అవకాశాలు అనేకం వస్తాయి. అయినా సీత ఒక పక్క కన్ఫ్యూజ్  అవుతూనే, నాగరాజునే పెళ్ళి చేసుకుంటుంది.(కట్నం వద్దన్నాడు గామరి!)

 పైగా నాగరాజు తీయని కబుర్లు చెప్తాడు. తనకు మూఢ నమ్మకాలు లేవనీ, ఇంట్లో తన పని తనే చేసుకుంటాననీ, ఇద్దరం కలిసి వంట చేసుకోవచ్చనీ... ఇలా! ఇవన్నీ మన సీత నమ్మి "ఇతనికి సాహిత్యం చదివే అలవాటు లేకపోతే ఏం? ప్రేమించే హృదయం ఉంది. అది చాలదూ" అని  తనని తనే మభ్య పెట్టుకుని పెళ్ళికి సిద్ధమవుతుంది.

 ముందు స్వీట్ హోమ్ బాబుతో పోల్చుకుని, తర్వాత ఇంట్లో   "సత్యం (జానకి విముక్తి లో జానకి అన్న) లాంటివాడు. అందుకే ఒప్పుకున్నా"  అని పొంతన లేకుండా మాట్లాడుతుంది.

సరే,.. పెళ్ళయి సీత చికాగో చేరుతుంది. వెళ్ళక ముందే అత్తవారింట్లో సంప్రదాయాలకీ, సీత భావాలకీ సరిపడకపోయినా సీత ప్రతి చోటా లొంగి ఉండి సర్దుకుంటుంది. అక్కడికి వెళ్ళాక సీత జీవితం దుర్భరమవుతుంది. అద్దె కలిసి వస్తుందని నాగరాజు అక్క ఇంట్లో ఉంటాడు. ఇంటిపనంతా సీత మీద పడుతుంది. నాగరాజు అతడి అక్క ఏ మాత్రం సంస్కారమూ, కన్ సర్నూ లేకుండా ప్రవర్తిస్తారు.

 ప్రతి చేష్టలోనూ, మాటలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తారు. సీత తమ ఇంట్లో పడి ఉండాల్సిందే అన్న భావం కల్గిస్తారు.ప్రతి సంఘటనలోనూ సీత మనసు ఘోరంగా గాయపడుతుంది. అక్కడి నుంచి బయట పడి తీరాలన్నంత విరక్తి కలుగుతుంది. ఎలా పడాలొ తెలీదు.అందుకే పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని తనకు సలహా ఇచ్చి కాపాడమని, అక్కడి నుంచి బయట పడేయమని రంగనాయకమ్మ గారిని కోరుతుంది.

అమెరికాలో రంగనాయకమ్మ గారి చెల్లెలి కొడుకు రవీ, పాఠకుడు, కుటుంబ సన్నిహితుడు ప్రసాదు,మరో పరిచయస్తురాలు శ్యామలా వీళ్ళంతా ఉంటారు. రంగనాయకమ్మ గారి నుంచి మెయిల్ అందుకున్న వీళ్ళంతా సీత అమెరికా నుంచి ఇండియా వచ్చేయడానికి అనేక రకాలు గా సహాయం చేస్తారు.

సీత ఇండియా వచ్చేస్తుంది. వచ్చేశాక, అక్కడ తను పడిన మానసిక హింసను అంతా కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. నాగ రాజు మీద కేసు పెట్టాలా వద్దా అన్న దాని మీద అందరి మధ్యా చాలా చర్చలు జరిగాక,  చివరికి అతడికి విడాకుల కాయితాలు పంపడంతో (నాగరాజు మరో సీతను వెదుక్కునే మార్గం సుగమం చేయడం ) కథ ముగుస్తుంది

ఈ పుస్తకాన్ని  ‘నవల’ అనటానికి లేదు.  ఎందుకంటే వాస్తవానికి కల్పన ఏమీ జోడించలేదు కాబట్టి. ఇది, ఒక అమ్మాయి జీవితంలో  కొంత భాగం.

‘పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్టూ , ఈ నిజ జీవితంలో  కల్పనలూ, ఊహా గానాలూ, కట్టు కథలూ , కలపలేదు’ అంటారు రచయిత్రి.

కథలో  ఉప కథగా శ్యామల విఫల ప్రేమ గాథ  వస్తుంది.  అసలు శ్యామలే మొదటి సీత అంటారు రచయిత్రి.  ఆమెకూ,  రచయిత్రికీ  జరిగే  ఫోను సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉంటాయి.
శ్యామల కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో విభేదాలు వచ్చి, అతడితో కలిసే దాదాపు ఒంటరి గా పిల్లాడి కోసం బతుకుతూ ఉంటుంది.

సీత ఇక్కడికి వచ్చాక అమెరికాలో తనకు ఎదురైన చేదు అనుభవాలు వివరించే క్రమంలో అనేకమంది మనకు పరిచయమవుతారు. సందర్భానికి తగ్గట్టు రంగనాయకమ్మ గారి పదేళ్ళ మనవరాలూ, రెండేళ్ళ బుల్లి మనవడు స్పార్టకస్, పనమ్మాయి సువర్ణ, ఇంకా కోటయ్య చౌదరి..ఇలా అన్నీ నిజజీవిత పాత్రలే!

యదార్థ గాథ అయినప్పటికీ,   సీత ఐదునెల్ల  కాపురానికి సంబంధించిన  సూక్ష్మమైన  వివరాలు సైతం  విరివిగా  ప్రస్తావించినప్పటికీ  డాక్యుమెంటరీ లక్షణాలేమీ  లేకుండా ఆసక్తికరమైన నవలగా  ఇది  రూపుదిద్దుకుంది.

సీత  అమెరికాలో  భర్త ఇంటి నుంచి తప్పించుకు వచ్చిన  ఘట్టం ఉత్కంఠభరితంగా ఉంటుంది.

సీత ఆడపడుచు కస్తూరి ని  రచయిత్రి  కళ్ళకు కట్టిస్తారు.  ఆమెలోని  కపటత్వం,  మాటల్లో లౌక్యం,  చేతల్లో జిత్తులు  సహజంగా చిత్రిస్తారు.
సీరియస్ గా  కథ నడుస్తూ ఉంటే  చటుక్కున   రంగనాయకమ్మ గారి సహజసిద్ధమైన  హాస్యం , వ్యంగ్యం తళుక్కుమని మెరుస్తూ  పాఠకులను గిలిగింతలు పెడుతుంది.

సీత తండ్రి గురించి ఏమంటారో చూడండి-

‘సీత కథను సినిమాగా తీస్తే సీత మామ గారి పాత్రని పెట్టక్కరలేదు. ఆ పాత్రకి డైలాగులే  వుండవు. ఒక పాత్ర అక్కర్లేనందుకు ప్రొడ్యూసర్ కి చాలా లాభం! ’    

సీత చెప్పేది ఇంకా వినడానికి  విసుగెత్తిపోయానని చెపుతూ అంటారిలా-
ఈ చచ్చు పుచ్చు సీత కథని సినిమా తీస్తే , ప్రొడ్యూసరు మట్టికొట్టుకుపోతాడు.’ 

‘ఇంటి చుట్టూ గుడిసెల్లోనూ, బైటా, మొగాళ్ళందరి చేతలకీ రాఖీలే!  పాపాయి, తమ్ముడికి ఆ గుడ్డముక్క రాఖీ కట్టింది!  ఈ రెండేళ్ళ పురుషుడు , ఆ పదేళ్ళ స్త్రీని , రక్షిస్తూ ఉండాలని! ’

పుస్తకం చదువుతున్నంత సేపూ నవ్వొస్తూనే ఉంది నాకు చాలా చాలా చోట్ల!

కొన్ని ఘట్టాల్లో  సందర్భానుసారంగా  రచయిత్రి చేసే  ఆణిముత్యాల్లాంటి వ్యాఖ్యలు అర్థవంతంగా ఉంటాయి.  ఆలోచనలు రేపుతాయి.


‘చాలామందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందులోనూ పెళ్ళీడు ఆడపిల్లలకి, ‘ప్రేమ’ కావాలి. కానీ, నిజంగా కావలసింది ప్రేమ కాదు; ప్రేమ మాటలు! ప్రేమను ప్రదర్శించే మాటలు!  ప్రేమను కురిపించే మాటలు! పైగా ఇంగ్లీష్ లో  చెప్పే ప్రేమ మాటలు!  ‘ఐ లవ్ యూ’ అంటే చాలు!  అది ప్రేమే!’

‘పూల మొక్క, భూసారంతో , సూర్యరశ్మితో, నీటి జల్లుతో , బతుకుతుంది. ఎదుగుతుంది, పుష్ఫిస్తుంది.
ప్రేమ లత, ఇరువైపులా హృదయ సౌందర్యాలతో, భావ సంస్కారాలతో, నిస్వార్థ అర్పణలతో, బతుకుతుంది, ఎదుగుతుంది, ఆనందాల్ని పుష్పిస్తుంది. ’

"ఆడవాళ్ళు భలే లాంటి వాళ్లు. వీళ్ళకు ఉత్తములైన భర్తలు కావాలి. అలాంటి భర్తల్ని పొందడానికి తాము అర్హులమేనా అన్న ప్రశ్న రాదు వాళ్ళకి. సీత సరిగ్గా అలాంటిదే! ఆమెకు కలలే తెల్సు! ఊహలే తెలుసు! పంజరంలో ఒదగడమే తెలుసు!"


ఇవన్నీ పాఠకుల్ని ఆలోచనలో పడేస్తాయి.


సీత భావాలు మొదటి నుంచీ వేరు.  కానీ ఆమె వాటిని నాగరాజుతో వివాహం కోసం వదులుకోడానికి సిద్ధపడుతుంది. మళ్ళీ  "వీళ్ళు అలా ఎందుకు చెయ్యాలి ? నాగరాజు ఇలా ఎందుకు ప్రవర్తించాలి?" అని ఆశ్చర్య పడ్డాలూ, తెల్లబోవడాలు చేస్తుంటుంది. ఆమెకు మంత్రాల పెళ్ళి ఇష్టం లేదు. అయితే నాగరాజు బలవంతం మీద ఒప్పుకుంటుంది.  ఆ పెళ్ళికి ఒప్పుకున్న సీతకి ఆ పెళ్ళి తాలూకూ ఫాలో అప్స్ కూడా అంగీకారం కావాలి. వ్రతాలు ఒద్దనీ,సూత్రాలు తీసేస్తాననీ వాదనలు (వాదనలు కాదులే, నిజానికి  beg  చేస్తుంది ) చేస్తుంది. 
రిజిస్టర్ పెళ్ళే  వద్దన్న వాడు వీటికొప్పుకుంటాడా? 


 అయితే ఈ విషయాలన్నింటికీ సీత ను రంగనాయకమ్మ గారు బాగా తల వాచేట్లు చీవాట్లు వేస్తారు కాబట్టి ఇక మనకా శ్రమ అక్కర్లేదు.:-))


లేని పోని ఆడంబరాలు పోయే వాళ్ళ మీదా, ఒళ్ళంతా కనిపించేలా బట్టలు ధరించి "ఇది మా హక్కు," అనో "ఫాషన్" అనో వాదించే వాళ్ళమీదా రచయిత్రి నిప్పులు చెరుగుతారు.(పదేళ్ల తన మనవరాల్ని కూడా వదిలిపెట్టరు) 


నిజానికి ఎన్నారై పెళ్ళిళ్ళలో ఇంత కంటే ఘోరంగా విఫలమై, తిట్లూ తన్నులూ, హత్యా ప్రయత్నాలూ,పిచ్చిదని కేసులు పెట్టడాలూ,పిల్లల్ని లాక్కుని వీధిలోకి తరిమేయడాలూ, మంచి మాటలతో ఇండియా పంపించేసి అమెరికా కోర్టుల్లో విడాకులు తీసుకోడాలు...ఇలాంటివి కూడా కోకొల్లలు,. అయితే ఇక్కడ "ఎన్నారై" పెళ్ళి కంటే కూడా....మనసులు కలవని,ధోరణులు సరిపడని ఒక పెళ్ళిగా మాత్రమే దీన్ని చూడాలి మనం! 


కాని, అమెరికా అల్లుడు గా ఉండటం ఒక ప్రత్యేకత గా నాగరాజు, అతడి అక్క,తల్లి అందరూ భావిస్తూ ఉండటం వల్ల సీతకు పీడన మరింత అధికమయింది. తప్పించుకోలేదనే ధీమాతో ఆ పీడనకు హద్దు లేకుండా పోయింది .


ఈ సీరియల్ నవ్యలో వస్తున్నపుడు  ఓ పాఠకుడు రంగనాయకమ్మ గారిని  ఇలా అడిగారు-  ‘కొందరు మగవాళ్ళకు కూడా భార్యల వల్ల ఇబ్బందులూ, అవమానాలూ ఉండడం మీకు తెలియకపోదు. ఆ కోణంతో, ‘కళ్ళు తెరిచిన రాముడు’ రాస్తారా?’ 
రంగనాయకమ్మ గారి  జవాబిది-  ‘సీత చెప్పినట్టే  , ఆ రాముడు కూడా తను పడ్డ అవమానాలు నాకు చెప్పుకుంటే , ఎందుకు రాయను? తప్పకుండా రాస్తాను. ఇష్టంగా, శ్రద్ధగా, రాస్తాను’.


అరుణా పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ ఈ  పుస్తకం. పేజీలు 352  (హార్డ్ బైండ్) 
ధర :120  రూపాయలు!