July 8, 2010

లెక్కలొచ్చా మీకు?



లెక్కలంటే మీలో చాలామంది లాగే నాక్కూడా చచ్చేంత భయంగా ఉండేది చిన్నప్పుడు. పదో క్లాసు ఎప్పుడైపోతుందా లెక్కల బెడద వదిలించుకోవచ్చని ఎదురు చూసిన క్షణాలు బోల్డు.ఆల్ జీబ్రా కల్లో దెయ్యమల్లే వెంటబడి పీడకలలు తెప్పించిన రోజులు అసంఖ్యాకం! రైల్వే ప్లాట్ ఫాముల పొడవులు, వెడల్పులూ మనమెందుకు కొలవాలో,రైలెక్కేది మనం కానపుడు వాటి వేగాలు మనమెందుకు తెలుసుకోవాలో తెలీక బుర్ర వేడెక్కిపోయేది.అందుకే శేఖర్ పెద్దగోపు లెక్కల టపా .రాసినపుడు సంఘీభావం తెలుపుదామని వెళ్తే అక్కడ నాలాంటోళ్ళు బోల్డుమంది ఉన్నారని తెలిసి సంతోషపడ్డాను.



చాలా ఏళ్ళ క్రితం బాలజ్యోతి అని ఒక పిల్లల  మాస పత్రిక(ఆంధ్ర జ్యోతివాళ్లది)వచ్చేది. బోల్డన్ని మంచి కథలూ(అందులో రెంటాల గోపాల కృష్ణ గారు రాసిన బొమ్మలు చెప్పిన కథలు నా ఫేవరెట్ గా ఉండేది)అవీ ఉండేవి.అన్నింట్లోనూ అందరి హాట్ ఫేవరెట్ గా ఉండే శీర్షిక,అప్రతిహతంగా పాతికేళ్ళు సాగిన శీర్షిక ఒకటుండేది. అదే "మేథ మే ట్రిక్స్"! అవసరాల రామకృష్ణా రావుగారు నిర్వహించే పజిలింగ్ శీర్షిక!చక్కని చిక్కని చిక్కు లెక్కల్తో బుర్ర వేడెక్కిపోయే శీర్షిక! లెక్కలంటే భయం ఉన్నా,ప్రతి నెలా ఆ శీర్షికలో ఇచ్చే పజిల్స్ మాత్రం జుట్టు పీక్కుని అయినా సాధించే వాళ్లం!


శ్రీ రామకృష్ణా రావుగారు మెదడుకి మేతలాంటి అద్భుతమైన లెక్కల పజిల్స్ తో పాటు చక్కని జానపద కథని కలిపి మల్లెలు,మరువం కలిపిన దండలా ఒక నవల రాశారు.ఆ నవల గురించే నాలుగు మాటలు రాద్దామని!

ఇందులో మామూలుగా ఒక రాజకుమారి,ఆవిడని రాక్షసుడో మాంత్రికుడో ఎత్తుకుపోడం,వాడెవడో రాజకుమారుడొచ్చి కాపాడ్డం..ఇవేవీ ఉండవు. యండమూరి నవలల్లో హీరోయిన్ లాంటి ఒక తెలివైన రాకుమారి,అద్భుత శాస్త్రజ్ఞుడైన రాకుమారుడు ఉంటారు.

కథ కొద్దిగా అయినా చెప్పకుండా పరిచయాలు రాయడం నాకంతగా రాదు.చెప్తాను!:-(


ఒక రాజుగారికి పెళ్ళయి ఎన్నాళ్ళయినా పిల్లలు కలగరు.రాణీగారికి ఒక పిల్లి తల్లి(లేదా తల్లిపిల్లి) ఇచ్చిన శాపం కారణంగా! తర్వాత ఆ పిల్లి,  రాణిగారికి పిల్లలు కలుగుతారని శాపం సడలిస్తుంది కానీ కొన్ని కండిషన్స్ పెడుతుంది.

 రాణిగారికి ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్లకు లెక్కలంటే ఎంతో ప్రాణం.అందుకే పేరు శారద అయినా అందరూ గణిత విశారద అని పిలుస్తుంటారు.పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేసుకోమంటే లెక్కల్లో తనని ఓడించిన వాడినే పెళ్ళాడతానని చెప్పేస్తుంది.ఆమెకో ఇద్దరు చెలికత్తెలు. గిలిగింతా,చికిలింతానూ!వాళ్ళూ గణితంలో ఉద్దండులే!

చెలికత్తెలిద్దరి ప్రశ్నల్నీ దాటుకుని రాకుమారి వద్దకెళ్ళాలి.అక్కడ ఓడిపోతే సరాసరి విషమందిరంలోకి పంపి మరణ దండన విధిస్తారు!ఇవీ షరతులు! అలా చాలామంది వచ్చి కొన్ని లెక్కల్ని విప్పి,మరికొన్ని చిక్కుల్ని విప్పలేక విషమందిరంలోకి పోతారు,.


మరోచోట పెరుగుతున్న కథానాయకుడు (ఇతడి తల్లి రాకుమారి తల్లికి స్నేహితురాలే!వీరిద్దరి జననానికీ ఒక లింక్ ఉంటుంది కూడా)విజ్ఞానవర్మ జీవశాస్త్రంలో ఆసక్తి కొద్దీ ప్రయోగాలు చేసి మరణాన్ని జయించే సంజీవని కనిపెడతాడు.ఇతడి పక్కన చిన చిలిపిశ్రీ,పెను వెకిలిశ్రీ అనే బావామరుదులు శిష్యులు!

రాకుమారి చేతిలో చస్తున్నవారి సంఖ్య రాజుగారిని కలవరపెడుతుంది.ఇంతలో శారద చేతిలో హతుడైన పొరుగుదేశ యువరాజు తండ్రి ఆగ్రహించి వీరి రాజ్యం పైకి దండెత్తే  సన్నాహాలు చేస్తాడు.ఈ లోపు విజ్ఞానవర్మ రాజ్యప్రవేశం చేసి ఎవరికీ తెలీకుండా విషమందిరం నుంచి పొరుగు దేశ యువరాజునేకాక అందరినీ బతికిస్తాడు. దానితో శారద అతడిని ఎలాగైనా ఓడించి చంపాలనుకుంటుంది(మరోపక్క అతడి పట్ల ఆకర్షితురాలవుతూనే...)

చివరికి శారద,వర్మల మధ్య లెక్కల చిక్కులతో పోటీ జరుగుతుంది.వర్మ గెలుస్తాడు.ఇంతలో వర్మ అకాలమరణం చెంది కథ అనుకోని మలుపు తిరుగుతుంది.మలుపేమిటో,కథ సుఖాంతం అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పక చదవాల్సిందే!

నాకు వారం పట్టింది పూర్తిచేయడానికి!ఎందుకంటే వీలైనన్ని పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ చదివాను.కొన్ని నా వల్ల కాక వదిలేసి,రాకుమారి జవాబు కోసం వెదుక్కున్నాను.



కొన్ని పజిల్స్ సరదాగా!

1."ఒక మార్గశిర మాసంలో చెట్టుకు రెండు వందల చొప్పున మల్లె మొగ్గలుంటే ఐదు చెట్లకెన్ని మొగ్గలుంటాయి?"



2.అందమైన సరోవరంలో కొన్ని పద్మాలు కొన్నితుమ్మెదలూ ఉన్నాయి.రెండేసి తుమ్మెద లు ఒక్కొక్క పద్మం మీద వాలితే ఒక  పద్మం మిగిలిపోతుంది.అలా కాక ఒకే తుమ్మెద రెండేసి పద్మాల మీద వాలితే ఒక తుమ్మెద మిగిలిపోతుంది.పద్మాలెన్ని? తుమ్మెదలెన్ని?



3.ఎనిమిది నాలుగులు ఉపయోగించి ఎలాగైనా 500 తెప్పించాలి!



4.రెండు కుంచాల సెనగలు నానవేస్తే నాలుగు కుంచాలు అవుతాయి.రెండు నానేస్తే ఎన్ని అవుతాయి?:-))



5.పదిమంది గల కుటుంబంలో ఇద్దరు తాతలు,ఒక అమ్మమ్మ,ముగ్గురు తండ్రులు,ముగ్గురు కొడుకులు,ముగ్గురు కూతుళ్ళు,ఇద్దరు అత్తగార్లూ,ఇద్దరు మామగార్లూ,ఒక అల్లుడు,ఒక కోడలు,ఇద్దరు అన్నదమ్ములు,ఇద్దరు అక్కచెల్లెళ్ళూ ఉన్నారు!ఎలాగ?


ఇవి గిలిగింతా,చికిలింతా అడిగే ప్రాథమిక ప్రశ్నలు మాత్రమే! ఇంకా రాకుమారి అడిగే ప్రశ్నలు ఇవ్వలేదు.

ఇలాంటి మరెన్నో లెక్కలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.అందుకే ఈ పుస్తకం పిల్లల నవల మాత్రమే కాదు,పెద్దలు చదివాక పిల్లలకు విడమర్చి చెప్పాల్సిన నవల.


ఈ నవల మొదట ముద్రణ పడింది 1973లో! కొన్నాళ్ళకి ఆ నవలని అందరూ మర్చిపోయారు! అయితే ఆ నవలను చదివి అప్పట్లో తెగ సంబరపడిన యల్లంరాజు శ్యామసుందర్ అనే ఎన్నారై గారు దాని మీద అభిమానంతో మళ్ళీ ముద్రించడానికి ముందుకొస్తే రచన శాయిగారు దాన్ని  సంపాదించి ముద్రించేశారు.

నూటపాతిక పేజీల ఈ మంచి నవల ధర కేవలం..కేవలం నలభై రూపాయలు!

నేను మాత్రం ఈ పుస్తకాన్ని కొనలేదు. దాసరి సుబ్రహ్మణ్యం గారి "ప్రత్యేక రచన"లో ఇచ్చిన ప్రత్యేక చందమామ పజిల్ సాల్వ్ చేసి బహుమతి గా సంపాయించుకున్నా!


పెద్దల్ని పిల్లల్ని కూడా అలరించే ఈ పుస్తకం

వాహినీ బుక్ ట్రస్ట్,


1-9-286/3,విద్యానగర్,హైద్రాబాదు వద్ద దొరుకుతుంది.వాహినీ బుక్ ట్రస్ట్ వారు పుస్తక ప్రియుల కోసం ఈ నవలను 30 రూపాయలకే అందిస్తున్నారు...పది రూపాయల ప్రత్యేక తగ్గింపుతో! కాపీలు అయిపోతే మళ్ళీ వేస్తారో లేదో,త్వర పడండి!

ప్రముఖ పుస్తక కేంద్రాలన్నింటిలోనూ కూడా లభ్యం!

July 2, 2010

నీ నగలను నువ్వే రక్షించుకో! !



నీ కొండకు నీవే రప్పించుకోమని ఏడుకొండల వాడిని అడిగే ఆనవాయితీ పోయి "స్వామీ , నీ నగలను నువ్వే కాపాడుకోవాలి , లే, లే !ఇహ నువ్వే రంగంలోకి దిగి ఒక్కొక్కళ్ళకీ నీ ఉగ్ర నరసింహావతారం కనీసం కల్లో అయినా చూపించి ఏదో ఒకటి చెయ్యి"అని వేడుకోవాల్సిన పరిస్థితి దాపరించింది.




అవి మామూలు నగలా? ఐదు వందల ఏళ్ళనాడు రాయలు దేవస్థానానికిచ్చిన నగలు! వాటికి బంగారం పరంగా పక్కన పెడితే పురావస్తు సంపదగా విలువ ఎంత ఉంటుందో టీటీడీ వాళ్ళు అంచనా వేయలేరా?



అసలు చివరి క్షణం వరకూ అవి లేవనే విషయమే దేవస్థానంలోవారికి సరిగ్గా తెలీదంటే ఎంత అలసత్వంతో కొట్టుమిట్టాడుతున్నట్లు వీళ్ళు? రాయలిచ్చిన నగలేవో, ఇతరులిచ్చిన నగలేవో అసలులెక్కలే లేవు.

అన్నింటితో పాటు రాయలవారిచ్చిన నవరత్న కిరీటాలు, వెండి పళ్ళాలూ మొత్తం కరిగించి పోశారట! ఏవి కరిగించారో తెలీదు. ఎంత కరిగించారో తెలీదు!


 అసలేమీ తెలీదు! ఎవ్వరికీ తెలీదు.


నలభై ఏళ్ళక్రితమే కరిగించినా ఫొటోలు తీసే చివరిక్షణం వరకూ, ఎవ్వరి వద్దా ఏ సమాచారమూ లేదు.సెబాసో!

నేనేం చెప్పేది? అని ఒకడు, నాకేటి తెలుసు ?అని ఒకడు !ఎంత బాధ్యతా రాహిత్యం!

అసలు నగలు కరిగించిన విషయం రికార్డుల్లో ఉందో లేదో స్పష్టత లేదు. పైగా పాత రికార్డులన్నీ కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయనీ వాటిలో వివరాలన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అంటే అందులో రాయలు సమర్పించిన నగల వివరాలుండే ఉంటాయిగా!



దీనికి వ్యతిరేకంగా డాలర్ శేషాద్రి వారేమో "రాయలు ఇచ్చిన నగల ఆనవాళ్ళే లేవు.వాటిని గుర్తు పట్టలేం! 500 ఏళ్ళ నాటి నగలు కద, పాడైపోతాయి"అని సెలవిస్తున్నారు. వీరి "అనుభవం" దృష్ట్యా ఆ మాటలకు విలువ కట్టాలి!



నగలు కరిగిస్తే విలువైన వజ్రాలు, మణులూ,మాణిక్యాలూ ఏమయ్యాయి?



పైగా "కరిగించి ఉండొచ్చు"


"తాపడానికి వాడారేమో"


"రికార్డుల్లో లేకపోవచ్చు" అని అన్నీ అనుకోళ్ళే!

ఈనాడు లో శ్రీధర్ కార్టూన్ భలే వేశాడు,చూడండి





ఒకపక్క తొమ్మిదో టీవీ వాళ్ళు తిరుమల ను కాపాడుకోడానికి "సోనియా గాంధీ" గారికి ఈ మెయిల్స్ పంపాలని చెప్తూ కామెడీ చేస్తున్నారు.:-))

మరోపక్క టీటీడీ వాళ్ళు ఈ ట్రాజెడీ ని నిన్ననే బయట పెట్టారు.


ఇందులో ఎవరి బాధ్యతెంతో ఎప్పటికి తేలేను?

రెండు రోజుల్లో అందరం ఎవరి గొడవల్లో వాళ్ళుపడి పోతాం! దీనికి ఫాలో అప్ ఎప్పుడు?


టీటీడీ లో ఉన్నత స్థాయి నుంచి చిరుద్యోగుల వరకూ ఎవరికీ ఆ కొండమీద దేవుడనే వాడొకడున్నాడని నమ్మకమే లేనట్టుంది.

ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్వామి నగల్ని కాపాడుకోకపోతే కొన్నాళ్ళకి ఇదిగో, పైన ఫొటోలో ఉన్నట్లు శ్రీవారిని చూపించి, "ఏమో, ఆ సర్వాంతర్యామే నగలన్నీ ఎవరికో ఇచ్చాడేమో, ఆయన లీలలు తెలియతరమా" అని చెవిలో పూలు పెట్టేగల్రు!


కనీసం నిజాం నగలను అప్పుడప్పుడూ ఏ తాజ్ కృష్ణలోనో ప్రదర్శనకు పెట్టినపుడన్నా చూస్తాం!


రాయలవారు సమర్పించిన అపార సంపద మాయం! కనీసం ఫొటోల్లో అయినా చూడలేం!


గోవిందా గోవిందా!

June 21, 2010

ఇందిర ఒక సాహసం! ఇందిర ఒక అద్భుతం!

ఇందిర గురించి తల్చుకుంటే భయమేస్తుంది. ధైర్యం వస్తుంది. ఇందిర ను అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. మధ్య మధ్యలో గుండె నిండా ఊపిరి తీసుకుంటూ ఉండాలి.


ఇందిర ఒక అగ్ని శిఖ! ఒక అపురూప వ్యక్తిత్వమున్న యువతి ఇందిర!ఎలాటి దాపరికాలూ లేకుండా జీవితాన్ని ఉతికి ఆరేసేస్తుంది. నిండా ఇరవయ్యేళ్ళు లేకుండానే జీవితాన్ని కాచి వడబోసిన ఇందిర గుండెలు ఆగిపోయే జీవిత సత్యాలను నిర్మొహమాటంగా మొహం పగలగొట్టి మరీ చెప్తుంది.

కాలాతీత వ్యక్తులు నవల యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంత పటిష్టంగా నిలబడి ఉందంటే అందుకు కారణం కేవలం ఇందిరే! ఇందిర వ్యక్తిత్వమే ఇన్నాళ్ళు ఆ నవలను నిత్యనూతనంగా కాలాతీతంగా  నిలబెట్టింది.

ఈ నవల దాదాపు పాతికేళ్ళ క్రితం స్కూల్లో ఉండగా అనుకుంటాను బహుమతిగా సంపాదించాను . మా అమ్మ ఈ పుస్తకం చూసి "ఇప్పుడే ఇంత బరువు పుస్తకాలెందుకులే నువ్వు క్లాసు పుస్తకాలు చదూకో, నేనిది చదూకుంటా"అని పుస్తకం తీసుకుని కానుగ చెట్టుకింద కుర్చీ వేసుకుంది.

ఆ తర్వాతెప్పుడో మూడు నాలుగేళ్ళకి చదివాననుకోండి!

గొప్ప నవలగా విమర్శకుల,పాఠకుల ప్రశంసలు దండిగా సంపాదించిన నవల గురించి రాయబూనడం సాహసమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ఇందిర గురించి రాయకుండా ఉండటం అసాధ్యమనిపించింది.

మీలో చాలామంది ఈ నవల చదివే ఉంటారు. చదవని వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకోసం కథ కొద్దిగా చెప్తాను.

1950ల్లో వాతావరణం!విశాఖపట్నంలో ఇందిర అనే పద్ధెనిమిదేళ్ళ యువతి తండ్రితో సహా ఒక ఇంటికిందిభాగంలో అద్దెకు దిగుతుంది.అదొక బ్రహ్మచారులుండే కొంప!పైభాగంలో ప్రకాశం అనే మెడికో ఉంటాడు.చలాకీ ఇందిర ప్రకాశంతో ఇట్టే స్నేహం చేస్తుంది.ప్రకాశం ఫ్రెండు కృష్ణ మూర్తితో కూడా!

అద్దె  పంచుకోడానికి వీలుగా ఉంటుందని ఒకరోజు ఇందిర కళ్యాణి అనే స్నేహితురాలిని ఆ ఇంట్లో ఒక గదిలో ప్రవేశపెడుతుంది.కళ్యాణిదో తెలుగు సినిమా దీనగాధ!

తల్లి లేదు.తండ్రి రోగిష్టి!ఇంటిమీద అప్పు!ఎవరితోనూ కలిసిపోయే స్వభావం కాదు.ఎప్పుడూ తన దీనావస్థను తల్చుకుని కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప కళ్యాణికి మరేమీ చేతకాదు.

కళ్యాణి వచ్చాక ప్రకాశం ఆమెవైపు ఆకర్షితుడవటంతో ఇందిర కల్యాణితో నిరంకుశంగా ప్రవర్తించి ఆమె వెళ్ళిపోడానికి కారణమవుతుంది.తండ్రిని పోగొట్టుకున్న కళ్యాణికి స్నేహితురాలు వసుంధర ఆశ్రయమిస్తుంది.మునసబు రామినాయుడుని ఆస్పత్రికి తీసుకువెళ్ళిన సందర్భంలో డాక్టర్ చక్రవర్తి కళ్యాణికి పరిచయమవుతాడు.

ప్రకాశం మేనమామ కు ఇందిరతో ప్రకాశం చనువుగా ఉంటున్నాడన్న సంగతి తెల్సి ఊర్నుంచి వచ్చి ఇందిరకు వార్నింగిస్తాడు. ప్రకాశాన్ని ఊరికి తీసుకుపోయి రాజమండ్రి సంబంధం ఖాయం చేస్తాడు.స్వతహాగా భీరువైన ప్రకాశం మేనమామ మాట కాదనలేక ఒప్పుకుని ఆ తర్వాత ఇందిర మీద వ్యామోహాన్ని వదులుకోలేక పారిపోయి వస్తాడు.ఇందిర అతడిని ఛీ కొట్టి పొమ్మంటుంది.తనకోసం మామయ్యను ఎదిరించి కాకుండా పారిపోయి వచ్చినందుకు తిరస్కరిస్తుంది. అనుక్షణం మామయ్య నుంచి అతన్ని రక్షించలేను వెళ్ళమంటుంది !


మరోవైపు వసుంధర కృష్ణమూర్తివైపు ఆకర్షితురాలవుతుంది.కానీ ఇందిరతో అమితంగా పెరిగిన సాన్నిహిత్యం వసుంధరను వద్దనుకునేలా చేస్తుంది కృష్ణమూర్తిని!



కథ అనేక మలుపులు తిరిగి చివరికి కృష్ణముర్తి ఇందిరనూ,చక్రవర్తి కళ్యాణినీ పెళ్ళాడటంతో ముగుస్తుంది.

ఈ కథకు హీరో, హీరోయిన్,రెండూ ఇందిరే!

ఇందిర వ్యక్తిత్వం చదువుతున్నంత సేపూ అబ్బురపడేలా చేస్తుంది.

అసలు ఈ నవల్లోని పాత్రల స్వభావాలు ఈనాటికీ నిత్యనూతనంగా ఎవరో ఒకరి రూపంలో కళ్ళబడుతూనే ఉంటాయి.అందుకే రచయిత్రి ఈ నవలకు ఆ పేరుపెట్టారేమో అసలు!

"కాలాతీత వ్యక్తులు" కాదు.."వ్యక్తే"! ఆ వ్యక్తే ఇందిర అని కొందరి వాదనని 1958 లో ముందు మాట రాసిన పి.సరళా దేవి అంటారు

అడుగడుగునా మేనమామకు భయపడే ప్రకాశానికి, జీవితాన్ని అనుక్షణం విసుక్కుంటూనే మరోవైపు ప్రేమించే జీవించే ఇందిర లాంటి మనుషులు కొత్త!ఆ కొత్త ఇష్టంగానే ఉన్నా దాన్ని అందుకోడానికి భయపడే పిరికివాడు  ప్రకాశం. పోరాడి సాధించుకోవడం అనేది జీవితంలో కాదు కదా కనీసం ఊహల్లోకూడా లేనివాడు!

"నేను బలపడి ఇంకొకరికి బలాన్నివ్వాలనుకునే తత్వం నాది" అని ఆత్మవిశ్వాసంతో చెప్పే ఇందిర అంటే ఆరాధన!

 "అలా బీచ్ కీ పోదాం పద"అని లాక్కెళ్ళే ఇందిర,"...పర్లేదులే ఇంతలో నా పాతివ్రత్యానికేం భంగం రాదు.ఇద్దరమూ ఒకే రిక్షాలో పోదాం పద"అనే ఇందిర ..అతనికి అబ్బురంగానే కనిపిస్తుంది గానీ చేయి అందుకోవాలంటే భయం!


అలాగే ఇంటినుంచి వచ్చిపడే డబ్బుతో జల్సాగా స్నేహితులతో గడిపే కృష్ణమూర్తికీ ఇందిరలాంటిమనుషులు కొత్తే!


ఇందిరకు ఇటువంటి ఇన్ హిబిషన్స్ లేవు. ప్రకాశంతోనూ, కృష్ణముర్తితోనూ అరమరికలు లేకుండా స్నేహం చేస్తుంది.అలాగని ఇందిర పెద్ద ఆదర్శమూర్తేమీ కాదు.తాను కోరుకున్న ప్రకాశం కల్యాణికి దగ్గరవుతుంటే చక్రం అడ్డువేస్తుంది. స్త్రీ సహజమైనదిగా చెప్పబడే అసూయను ప్రదర్శించక మానవ సహజమైన నేర్పరితనం ప్రదర్శిస్తుంది.

అదీ ఇందిర అంటే!

 ఇందిర పాత్ర రానున్న సమాజంపై స్త్రీ చేయగల ధిక్కారానికి ప్రతీక అని ఏటుకూరి ప్రసాద్ ముందుమాటలో పేర్కొంటారు. కానీ ఇందిర ఒక మనిషిగా ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప తాను స్త్రీననీ, స్వేచ్ఛ సాధించుకోవాలనే స్పృహతోనూ మాట్లాడదు.స్త్రీవాదమంటే ఏమిటో ఇందిరకు తెలీదు.



ఎందుకంటే మరో పక్క "నేనున్నాలే,నీ సమస్యలూ,బరువులూ నా మీద పడేయ్"అనగలిగే మగాడు,అవసరమైతే నాకోసం సర్వస్వమూ వదులుకోగలిగే మగాడు కావాలి ప్రకాశం"అని కుండ పగలేస్తుంది ఇరవయ్యేళ్ళకే అరవయ్యేళ్ల కష్టానుభవాల్ని మూటకట్టుకుని విసిగిపోయిన ఇందిర .

"అందరం ఒక్కలాంటివాళ్లమే! అడుగు లేని పడవలం!ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపొతున్నాం! అలాగని గడియ గడియకీ కాళ్ళు చాపి ఏడవటం నా వల్ల కాదు"అని నిర్మొహమాటంగా కల్యాణినుద్దేశించి చెప్పేస్తుంది.

"నువ్వెక్కడికిపోతావు ప్రకాశం, నువ్వు నా వాడివి"అని భరోసా ఇచ్చిన ఇందిరే అతడు పిరికివాడిలా పారిపోయి వచ్చినపుడు మండిపడుతుంది.

"బతుకులో నాకు కావలసినదొకటి,నాకు దొరుకుతున్నదొకటి !
అంచేత కసికొద్దీ లోకాన్ని ధిక్కరిస్తున్నాను.నాకూ ఓ ఇల్లూ,సంసారం,భర్తా ఇవేవీ అక్కర్లేదనుకోకు.కానీ లాటరీలో నాకు దొరికింది ఫైళ్ళూ,ఆఫీసూ,నా మీద ఒరిగిపోయి బతికేసే నాన్నా"అని నిస్పృహ వ్యక్తం చేస్తుంది.

కృష్ణ మూర్తి ఇందిరను పెళ్ళి చేసుకుంటున్నపుడు కూడా"జీవితంలో దేనివిలువ దానికివ్వాలి. పెళ్ళి నా జీవితంలో ఒక భాగం మాత్రమే! నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను.నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పీల్చుకోనిస్తావా ("నా పర్సనల్ స్పేస్ నాకుండనివ్వు"అని 50ల్లోనే ఇందిర అడగటం ఎంత ఆశ్చర్యం!)అంటుంది.

"నీ ఆయుర్దాయం ఎంతో అన్ని రోజులూ నిండుగా బతుకు!నిర్భయంగా బతుకు!రోజుకు పదిసార్లు చావకు.ఈ ప్రపంచంలోని వికృతాన్నీ,వికారాన్నీ అసహ్యించుకో!ఆశలూ,స్వప్నాలు అనురాగాలు అన్నీ పెంచుకో!కానీ వాటికి శస్త్ర చికిత్స అవసరమైనపుడు నిర్దాక్షిణ్యంగా కత్తిరించి అవతల పారెయ్"అనే ఇందిర జీవితం నుంచి ఎంత నేర్చుకుందా అని ఆశ్చర్యం వేస్తుంది

నవల కొత్త ముద్రణ(2005)లో డాక్టర్ చంద్రశేఖర్ రావు రాసిన విశ్లేషణలో అంటారు"పాతివ్రత్యం, ప్రేమ,అంకితమవటాలు,అర్పించుకోడాలు ఈ నాన్సెన్స్ నీ ట్రాష్ నీ కాలితో ఫెడీమని తన్నే ఇందిరను మీరెరుగరు,గుర్తు పట్టడానికీ గుర్తుంచుకోడానికీ ఇష్టపడరు! ఇందిరను ఇష్టపడే రోజులు మనకింకా సమీపం కాలేదు" అని!

ఇందిర స్త్రీలాగా ప్రవర్తించదు. సగటు మనిషిలాగా ప్రవర్తిస్తుంది.  ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం,ఆవేశం, లౌక్యం,దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ జీవితం ప్రసాదించినవే! 

కల్యాణిలాగా ప్రద్దానికీ భోరుమంటూ ఏడవదు. అయితే ఏమిటి? అని పరిస్థితులకు ధైర్యంగా ఎదురు తిరుగుతుంది. కనీసం బింకంగా కనిపిస్తుంది. "ఈ వెధవ లోకం నాకెందు లొంగిరాదో చూస్తాను"అనుకుంటుంది.

ఇందులో నాకు నచ్చనిపాత్రేదైనా ఉంటే అది కల్యాణే! ఈమె ఒంటినిండా సెల్ఫ్ పిటీ నిండిపోయి ఉంటుంది.ఆమె ఒంటరితనానికీ,నిస్సహాయ స్థితికీ ఒక పక్క కొంత సానుభూతి కలుగుతున్నా, ప్రతి క్షణం తన స్వాభిమానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏడుపుని ఆశ్రయించి పాఠకుడికి సానుభూతిని బదులు చిరాకుని కల్గిస్తుంది.

వసుంధర ఇంట్లో మునసబు రామినాయుడికి అనారోగ్యం చేయగానే"చూశావా, వసుంధరా,నా వంటి దానికి ఆశ్రయమిస్తే నీకెలాంటి ఫలితం దక్కిందో"అంటుంది. చివరికి పెళ్ళాడ్డానికి వెళ్తున్నపుడు కారుకి యాక్సిడెంట్ కాగానే "నావంటి దరిద్రాన్ని వరిస్తే ఇంతే!"అని చక్రవర్తిని బెదరగొడుతుంది. ఇలాంటివాళ్ళు జీవితంలో ఒకరుంటే నరకం ఆట్టే దూరంలో లేదనిపించడం ఖాయం!

కానీ ఇందిర అన్నట్లు "ఈ లోకంలో కల్యాణి లాంటి వాళ్లకే ఎక్కడ లేని జాలీ దొరుకుతుంది"

ఈ నవలకు జరిగిన అన్యాయమేదైనా ఉంటే అది "చదువుకున్న అమ్మాయిలు"సినిమాగా దీన్ని తీయడమే అనిపిస్తుంది నాకు! సినిమా టైటిల్స్ కార్డ్స్  లో కథ -డాక్టర్ పి.శ్రీదేవి అని చూడకపోతే అప్పటికి పదిసార్లు ఈ నవల చదివి ఉన్నా, అది ఈ సినిమాయేనని గుర్తు పట్టం!

ఆ సినిమాలో కల్యాణిపాత్ర కృష్ణకుమారికిచ్చి ఆమెను హీరోయిన్ను చేసి, ఆమె ఫ్రెండ్ వసుంధరగా సావిత్రిని పెట్టి వీళ్ళిద్దరికీ మధ్య అక్కినేని ని పెట్టి ఏదేదో చేశారు! ఇందిరను ఒక వాంప్ గా (ఈవీ సరోజ)చిత్రీకరించారు.

అలాంటి స్త్రీని అంగీకరించే పరిస్థితులు ఆరోజు లేవు కనుకా..అని జవాబిస్తారేమో ఇదేమని అడిగితే!

కానీ 1950 ల్లోనే ఇద్దరు మగ స్నేహితులతో కల్సి ధైర్యంగా బీచ్ లకూ సినిమాలకూ వెళ్లగలిగే ఇందిర పాత్ర ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆ రోజుల్లో ఇలాంటి స్వేచ్ఛను ఇరుగుపొరుగులెవరూ నిరసించరా?అనే సందేహం కలుగుతుంది.ఇందిర అంత స్వేచ్ఛగా మసలడానికి ఏమీ ఇబ్బంది పడకపోవడం కూడా కొద్దిగా ఆశ్చర్యమే!

నవలా రచయిత్రి ముప్ఫయి ఏళ్ల వయసులోనే మృత్యువాత పడకపోయి ఉంటే ఇంకా ఎన్నెన్ని మంచి రచనలు అందించేవారో అన్న ఆలోచన ఈ నవల పూర్తి చేసిన ప్రతి సారీ కల్గుతుంది.

పాత్రల చిత్రణ,వాటి వ్యక్తిత్వాల వర్ణన గుక్క తిప్పుకోనివ్వదు పాఠకులను!

ఇందిర అసహనాన్నీ,వెంటనే తేరుకుని ప్రదర్శించే ధిక్కారాన్నీ ఎలా చిత్రీకరిస్తారంటే ఇందిర వెంట పరుగు తీయడం తప్ప ఇంకేం చేయలేం!

ఇంత రాసినా ఇంకా ఏదో రాయకుండా వదిలేశామనే ఫీలింగ్...అదే కాలాతీత వ్యక్తులు నవల చేసే మాజిక్!
ఒక అశాంతిని, కొన్ని లక్షల ఆలోచనలనూ,కొంత హాయినీ ఒకేసారి కల్గించే నవల!

1957 లో తెలుగు స్వతంత్ర పత్రికలో ధారావాహిక గా వచ్చిన ఈ నవల తరవాత చాలా ముద్రణలు పడింది.1981లో ఎమెస్కో వారు వేసిన ముద్రణ కాపీ నా వద్ద ఉంది.అందులో చివరి పేజీలు పోయాయని కొత్తది విశాలాంధ్ర వాళ్ళు వేసిన కొత్త కాపీ కొన్నాను.

ఇంత మంచి నవల ముద్రణకు విశాలాంధ్ర వాళ్ళుకొంత నాణ్యత ఉన్న పేపర్ వాడి ఉంటే బావుండేది. !:-(


విశాలాంధ్ర ప్రచురణ
వెల -అరవై రూపాయలు