" రాజీవ్ ని మా మీద రుద్దొద్దు" ..అనే వాళ్ళు ఇక్కడ సంతకాలు పెట్టండి!  

Posted by సుజాత in

                                                          శ్రీధర్ వేసిన చురక! 

 తెలుగు లలిత కళా తోరణం పేరును అకస్మాత్తుగా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారి చలవతో 'రాజీవ్ లలిత కళాతోరణం' గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జార విడిస్తే రాజకీయ పార్టీలు దాన్ని అంతగా పట్టించుకోలేదు గానీ మనలాంటి సామాన్య జనాలకు కోపం బాగానే వచ్చింది! ప్రజల నుంచి నిరసన ఎదురవగానే "రాజీవ్ తెలుగు లలితకళా తోరణం" గానూ మారుస్తూ సవరణ!

ఇక్కడ తెలుగు ప్రజల అభ్యంతరం "తెలుగు" అనే మాట తీసేసినందుకు మాత్రమే కాదు తెలుగు కి కానీ, లలిత కళలకు గానీ ఏ మాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ పేరుని దానికెందుకు తగిలించాలని ?(ఇందిరమ్మ ఇళ్ళలో ఇందిర ఉంటుందా లాంటి ప్రశ్నలు వేయకండి మరి)

 "రాజీవ్ తెలుగు" ఏమిటసలు? తెలుగు.... తెలుగు ప్రజలదా?  రాజీవ్ దా?

లలిత కళా తోరణాన్ని రూపు దిద్దిన ఎన్ టీ రామారావు గారి పేరు పెట్టినా, ఏకైక తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు పేరు తగిలించినా (తెలుగు కు ముందు)  నా వరకు అభ్యంతరం లేదు.

తెలుగు బ్లాగర్లలో అనేకమంది ఎంతో బాధ్యతతో తీవ్రంగా ఈ విషయం పై స్పందించారు.  ప్రధాన ప్రతి పక్షం మొదటి రోజు కొద్దిగా పౌరుషం చూపించి తర్వాత బజ్జుంది. గాలి ముద్దు కృష్ణం నాయుడు ఘాటుగా రెండు ప్రశ్నలడిగి వెళ్ళిపోయాడు. అంతే! ఇంకెవరూ దీని గురించి అంతగా పట్టించుకున్నట్లు లేదు.


అంతగా తన్నుకు చచ్చి, బూతులు తిట్టుకునే, (వీలైతే కాలర్లు కూడా పట్టుకునే)  అవకాశం లేని సబ్జెక్టు కాబట్టి టీవీ చానెళ్ళు కూడా దీనిమీద చర్చా కార్యక్రమం ఏమీ పెట్టినట్లు లేదు(పెట్టారా? )ఎవర్ని చర్చకు పిలిచినా అందరూ ఏకీభవించే ప్రమాదం కనపడింది.  ఒక విషయం మీద చర్చకు వచ్చిన అందరూ ఏకీభవించడమంటే ఆ ఛానెల్ కి అది ఆత్మ హత్యా సదృశమే! హెంత అవమానం?

నా బజ్ లో పెట్టిన ఒక చిన్న మెసేజ్ కి చాలా అనూహ్య స్పందన వచ్చింది. ఎంతో మంది తెలుగు లలిత కళా తోర ణానికి రాజీవ్ పేరు పెట్టడాన్ని అందరూ వ్యంగ్యోక్తులతో ముక్త కంఠంతో ఖండించారు.వారిలో వరూధిని గారు ఏదో ఒకటి చేసి మన అసమ్మతిని తెలియజెప్పాల్సిందే అన్నారు. సౌమ్య సంతకాల ఐడియా ఇచ్చింది. శశి కిరణ్ అనే ప్రవాసాంధ్రుడు దాన్ని ఆచరణలో పెట్టారు.


తన సొంత వెబ్ సైట్ అయిన www. myfrenz.net  లో ఒక ఫోరమ్ లో ఈ సమస్యను ఉంచారు. అక్కడ ఎంతమంది పేర్లు(సంతకాలు) కలిపితే అంత ఎక్కువమంది "రాజీవ్" చేరికను వ్యతిరేకిస్తున్నట్లే!

ఈ కింది  లింకులో ఒక్ ఎక్సెల్  షీట్ డౌన్ లోడ్ అవుతుంది.  దాంట్లో మీవి, మీతో ఏకీభవిస్తున్న వాళ్ళవి, పేర్లు మెయిల్ ఐడీలు ఊరు రాసి ఆ ఫైల్ ని శశికిరణ్ మెయిలైడీకి పంపితే ఆ ఫోరమ్ మొత్తం సారాంశాన్ని పేర్లతో సహా ఆయన హైకోర్టుకు,మీడియాకు పంపుతారు.

Maa_Telugu_Thalliki_Paadhaabhivandanam.xls

ఆయన మెయిలైడీ shashi@myfrenz.net


ఈ డౌన్ లోడ్లూ అవీ వీలుపడని వారు సరాసరి హైకోర్టుకే ఉత్తరం రాయొచ్చు..
aphc@ap.nic.in అనే చిరునామాకి!


ఒక ఆన్ లైన్ విజ్ఞాపన వల్ల వెంటనే రోశయ్య గారు "హమ్మో, తెలుగు బ్లాగర్లు" అని జడుసుకుని పేరు మార్చేస్తారని ఇక్కడ ఎవరికీ ఆశలు, భ్రమలు లేవు గానీ, ఈ ప్రయత్నం ఒక వ్యతిరేకాభిప్రాయంతో ఇంతమంది ఉన్నారని తెలియజేయడానికే!

ఇలా బయటికి రాకపోతే  అసలు ఎవరికీ వ్యతిరేకతే లేదనుకునే అవకాశం ఉంది.

ధర్నాలు చేసేంత అవకాశమూ, సమయమూ ప్రతి ఒక్కరికీ ఉండవు.అందుకే ఒక చిన్న ప్రయత్నం!

సహజీవనం పై "సుప్రీమ్" నిర్వచనం  

Posted by సుజాత in



పెళ్ళి లేకుండా స్త్రీ పురుషులు కలిసి జీవించే సహజీవనానికి చట్టబద్ధత ఉందా  లేదా? ఏమో మరి, కోర్టులు కూడా అస్పష్టంగానే ఉన్నాయి ఈ విషయంలో!


 నిజమే, భారతీయ శిక్షా స్మృతిలోని ఏ సెక్షనూ సహజీవనం గురించి ఏమీ చెప్పలేదు,. అందువల్ల సహజీవనం అనేది సాంఘికంగా ఆమోదం పొందకపోయినా, చట్టం నుంచి నిరాకరణ మాత్రం పొందలేదు. పెళ్ళి లేకుండా సహజీవనం చేస్తున్న జంటలో స్త్రీకి అన్యాయం జరిగినపుడు వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే ఇంతవరకూ కోర్టు వాళ్ళది గృహ సంబంధమైన సంబంధం కాబట్టి (domestic relation ship), గృహ హింస చట్టం 2005 ప్రకారం స్త్రీల ప్రయోజనాలను కాపాడే తీర్పులు ఇచ్చింది.

మొన్నే ఒక కేసు మీద తీర్పు ఇచ్చింది. భర్త పోయిన తర్వాత మరిదితో గత పదిహేళ్ళుగా కలిసి సహజీవనం చేస్తున్న ఒక స్త్రీ విషయంలో! ఇద్దరూ విడిపోయాక ఆమెకు భరణం(maintenance)ఇవ్వక్కర్లేదని అతడు వాదిస్తే కోర్టు దీన్ని domestic violence act 2005 కింద తీసుకుని "ఆమె సేవల్ని ఇన్నాళ్ళు వినియోగించుకుని ఆమెకు భరణం ఇవ్వకపోవడాన్ని" economic abuse కింద భావించి భరణం మంజూరు చేసింది. వారిద్దరూ ఏళ్ళ తరబడి కల్సి జీవిస్తున్నారు కాబట్టి వారి బంధం గృహ సంబంధమైంది గానే కోర్టు భావించింది. అలాగే సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు కూడా illegetimate (చట్టబద్ధత లేనివారు) కారని పిల్లల హక్కుల్ని పరి రక్షించే ఉద్దేశంతో ఇంతకు ముందు సుప్రీమ్ కోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది.

ఇలాంటివే మరికొన్ని కేసులు. అంతిమంగా స్త్రీకి అన్యాయం జరకకూడదని, ఆమె హక్కుల్ని కోర్టు కాపాడాలనే ఉద్దేశంతో హిందూ మారేజ్ ఆక్ట్ లో లేని అంశాల్ని వేరే చట్టాల్లో వెదికి పట్టుకుని వాటికి అనుగుణంగా తీర్పులు ఇచ్చింది. సంతోషించాల్సిన విషయమే!

ఈ live in relation ship అనేది ఇవాళ ఈజీ అయిపోయిందో, ఎటువంటి లీగల్ బాదరబందీలూ లేని ఒక సులభ సాధనంగా ఎలా మారిపోయిందో ఒక్కసారి మెట్రో నగరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఒక కమిట్ మెంట్ తో  సుదీర్ఘ కాలం పాటు  కల్సి ఉండాలనే నిర్ణయంతో దీన్ని మొదలు పెట్టిన వారెలాగూ దానికి కట్టుబడే ఉంటారని భావిద్దాం! దానికి "గృహ సంబంధం"(Domestic relationship)స్వభావం   ఉంటుందని కోర్టు కూడా  అంటోంది ! మరి ఆషామాషీగా కేవలం ''సరదాలు తీర్చుకోడానికి" ఇటువంటి బంధం మొదలు పెట్టిన వారి విషయంలో ఏం చేయాలి?


బంధం బెడిసి కొట్టగానే తమకు పెళ్ళే కాలేదు కాబట్టి తనకు ఏ విధమైన బాధ్యతలూ లేవని తప్పించుకోవాలని చూసే పురుషులూ, హిందూ వివాహ చట్టం ప్రకారం కాకపోయినా ఇతర చట్టాల ప్రకారమైనా తమకు కోర్టులు న్యాయం చేస్తాయి కాబట్టి చివరికు section 498 a. ప్రకారం కేసు పెట్టడానికి కూడా వెనుకాడని స్త్రీలు!

ఎంత చులకన వీళ్లకి ప్రేమ బంధమంటే! ఈ బంధంలో దానిలో ప్రేమా, బాధ్య్తతలూ, బంధువులూ వీటన్నింటికంటే నీ డబ్బూ నా లెక్కలూ, నీ భరణమూ నా వాటా, నీ సోఫా, నా టేబులూ, నీ క్రెడిట్ కార్డూ, నా బాంక్ స్టేట్ మెంటూ  ! ఇంతింత పంపకాలు....వీటికే ప్రాముఖ్యం

 కమిట్ మెంట్ లేని చోట బంధాలకు విలువేముంటుంది? ఈ లొసుగు సహజీవనంలోనే కాక, పెళ్ళిళ్ళలోనూ మొదలైంది. ఎప్పుడైనా జీ తెలుగు లో  బతుకు జట్కాబండి అనే కార్యక్రమంచూస్తే తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకూ చూడకపోతే మాత్రం ఇకపై చూసే ధైర్యం చేయకండి! కౌన్సెలింగ్ చేసే వాళ్ళకు కూడా కాస్త కూడా కామన్ సెన్స్ లేకుండా సాగే ప్రోగ్రామ్ అది!

ఈ నేపథ్యంలో మొన్నటి రోజున సుప్రీమ్ కోర్టు సహజీవనాన్ని నిర్వచించిన తీరు, ఆమోద యోగ్యమైన సహజీవనానికి ఉండాల్సిన అర్హతలు నాకు చక్కగా నచ్చాయి, కేవలం శృంగారం కోసమే కలిసి ఉంటే అది సహ జీవనం కానే కాదని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది! కోర్టు మాటల్లోనే చూడండి.....

“Merely spending weekends, or one night relation would not make domestic relationship between the two! “ అదీ సంగతి!

అంతే కాదు

"‘relationship in the nature of marriage' [for women] to get the benefit of the Act. A ‘relationship in the nature of marriage' is akin to a common law marriage.


 Common law marriages require that the couple, although not formally married, must hold themselves out to society as being akin to spouses. 


They must be of legal age to marry.


 They must be otherwise qualified to enter into a legal marriage, including being unmarried. They must have voluntarily cohabited and held themselves out to the world as being akin to spouses for a significant period of time.” (The Hindu) 

ఇదీ కోర్టు చెప్పింది.

ఈ బంధంలో నాకు అర్థం కాని (అర్థం చేసుకోలేకపోతున్న) విషయం ఒకటుంది. ఎంతో కాలం కల్సి జీవిస్తున్నాం కాబట్టి తమ బంధంలో "వివాహ స్వభావం" ఉందని , చట్ట బద్ధత కల్గించాలని కోర్టుకెక్కడానికి వ్యక్తులు ఇంత తలనొప్పి(కోర్టుల చుట్టూ తిరగడాలు,తమ ప్రైవేట్ బంధం తాలూకు రుజువులను నలుగురిలోపెట్టడం) పడే బదులు చట్ట బద్ధమైన వివాహ బంధాన్ని ఎందుకు స్వాగతించరు?

ఎటూ తేలని పిల్లల విషయం ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళ హక్కుల్ని కాపాడే బాధ్యతతో కోర్టు వాళ్లకు చట్ట బద్ధత కల్గించినా social acceptance ఎంతవరకూ వాళ్ళకు లభిస్తుంది? (ఎంత సిటీ అయినా, ఎంతగా ఎవరి జీవితాలను ఎవరూపట్టించుకోకపోయినా)

కొంతమంది  సుప్రీమ్ కోర్టు తాజా నిర్వచనాల వల్ల స్త్రీలకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. అది కూడా అర్థం చేసుకోవలసిందే! ఎటువంటి ఆర్థిక వెసులుబాటూ లేని స్త్రీలు వివాహం లేకుండా రెండో భార్య స్థానంలోకో,
concubine(  (ఈ మాటకి మొన్న సుప్రీమ్ కోర్టు జడ్జీ గారు keep అనే మాట వాడటం చాలా అభ్యంతరాల్ని లేవనెత్తింది) స్థానంలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి ఏర్పడినపుడు అన్యాయమే జరుగుతుంది.  ప్రత్యేకించి ఆ స్త్రీ చదువుకోనిదో, అమాయకురాలో అయితే ఈ పరిస్థితి వస్తుంది.

అందువల్ల ఇటువంటి అనిశ్చిత బంధంలోకి దిగే పురుషులైనా స్త్రీలైనా" పర్యవసానం  " దృష్టిలో ఉంచుకుని ముందడగు వేయాలని నా అభిప్రాయం. కేవలం "ప్రేమే" పునాదిగా సహజీవనంలోకి అడుగు పెడితే ఆర్థిక హక్కులను చట్టబద్ధతను వదిలిపెట్టండి. బంధానికి, పిల్లలకు చట్ట బద్ధత, భరణం, ఆస్థిలో వాటా ఇలాంటి వాటికోసం పోరాడే దృష్టి ఉంటే చట్టబద్ధమైన బంధాన్నే ఎంచుకోవాలి.

 ఒక వివాదం వచ్చినపుడు ఎవరి న్యాయం వాళ్లకుంటుంది వారి వారి దృక్కోణాలలో! అందరికీ కోర్టు న్యాయం చేయడం జరిగే పని కాదు!

ఖుష్బూ కేసులో తీర్పుతో జనాన్ని ఒక confused status లోకినెట్టిన సుప్రీమ్ కోర్టు సహజీవనానికి కావలసిన కండిషన్లను కాస్త ఆలోచించి నిర్వచించినందుకు సంతోషిస్తున్నాను.

2008లో లోక్ సభలో కేంద్ర న్యాయశాఖా మంత్రి హెచ్. ఆర్ భరద్వాజ్ ఒక మాట అన్నాడు  . "లివిన్ రిలేషన్ షిప్ సంఘం ఆమోదం పొందితే ప్రభుత్వం వాటి చట్టబద్ధత కోసం చట్టం చేస్తుంది" అని!

 ఏ నాలుగైదు కేసుల్నో ఉదాహరణ గా తీసుకుని "సంఘామోదం పొందినట్లే"  అని భావించి చట్టం చేయడం జరిగిందంటే......  మనదేశంలో వివాహ వ్యవస్థ పూర్తిగా కూలిపోవడానికి మొదటి దెబ్బ ఆ రోజే పడినట్లు లెక్క!

సరదాగా కాసేపు...:-))  

Posted by సుజాత in

ప్రయాణాల్లో పుస్తకాలు తోడుంటే ఎంతో బావుంటుంది. కానీ రైల్లో ప్రయాణిస్తూ ఉన్నపుడు సీరియస్ పుస్తకాలు కాక, హాస్యాన్ని పంచి నవ్వులు పూయించే పుస్తకాలు చేతిలోఉంటే హాయిగా ఉంటుంది. మధ్య మధ్యలో బయటికి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ, అప్పుడప్పుడూ పుస్తకం చదువుతూ ఉండాలి. పుస్తకంలో లీనమైపోయి మన స్టేషన్ దాటి పక్క స్టేషన్లో దిగేలా చేసే పుస్తకాలు రైలు ప్రయాణాల్లో నేను అడ్వైజ్ చేయను. ఒకసారి హైద్రాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళేందుకు ఏపీ ఎక్స్ ప్రెస్సెక్కి రాంబాబు డైరీ చదివాను.  26 గంటల ప్రయాణం హాయిగా నవ్వులతో గడిచిపోయింది. (రాంబాబు పరిచయం చేసుకోదగ్గ స్నేహితుడు)  

అలాగే ఈ మధ్య ప్రముఖ కార్టూనిస్టు సరసి(సరస్వతుల రామ నరసింహం) గారి కార్టూనుల సంకలనం కొన్నాను. నాకు ఆయన కార్టూనులంటే చాలా ఇష్టం! ముఖ్యం గా ఆ గీతలో expression అధ్భుతంగా పండుతుంది. అది చాలా గొప్ప విషయం,కార్టూను ప్రాథమిక లక్షణం!

మూడ్ ఎంత చెత్తగా ఉన్నా, ఈ సరసి కార్టూనులు చూస్తే చటుక్కున నవ్వొచ్చి మూడ్ బాగై పోయే అవకాశం ఉంది!

మచ్చుకు కొన్ని కార్టూనులు ఇక్కడ సరదాగా కాసేపు నవ్వుకోడానికి!

ఎంచక్కా కొని దగ్గర పెట్టేసుకుంటే ఎవరిమీదైనా బోల్డంత ఖోపం వచ్చినపుడు చదివి దాన్ని పోగొట్టుకోడానికి మంచి టానిక్ !









ఏ బోరు కొట్టించే సాహితీ సమావేశానికో, సన్మాన కార్యక్రమానికో మిత్రులెవరైనా పిలిచారనుకోండి, ఈ పుస్తకం చేతిలో పట్టుకుని చివరి లైన్లో కూచోవాలి. సన్మాన గ్రహీతకి శాలువా కప్పేటప్పుడో, పుస్తకావిష్కరణ టైములోనో మీరు గొల్లున నవ్వితే నా పూచీ లేదు మరి!   :-))


కొనుక్కోవాలంటే విశాలాంధ్ర, నవోదయ వంటి ప్రముఖ షాపుల్లో దొరుకుతుంది.  సరసి బొమ్మలు పంచిన వినోదంతో పోల్చుకుంటే వెల పెద్ద ఎక్కువేం కాదనిపించింది...75 రూపాయలు!  



పాతికేళ్ళ క్రితమే తెలుగులో రోబో నవల !  

Posted by సుజాత in



 మొత్తానికి ఈ వీకెండ్ రోబో చూసేశాం! సెకండాఫ్ బోరు కొట్టింది. ఏదో కార్టూను సినిమా చూస్తున్నట్లుంది.సంకీర్తన  మాత్రం బాగా ఎంజాయ్ చేసి తన ఫాన్స్ లిస్టులోరజనీ కాంత్ ని చేర్చింది  (ఫేవరిట్లకీ ఫాన్స్ కీ ఇంకా తేడా తెలీదు. అందుకే   రజనీ నా ఫేవరిట్ అనడం తెలీక రజనీ నా ఫాన్ అంటుంది). ఈ సినిమా చూస్తుంటే నా మెదడు లోని జ్ఞాపకాల పొరల తెరలు అలా అలా పుస్తకం పేజీల్లా టప టప మని తెరుచుకుంటూ వేగంగా వెనక్కి ప్రయాణిస్తూ వెళ్లి వెళ్ళి ఒక చోట చటుక్కున ఆగిపోయాయి.

అవును, 1984లో! అప్పుడు నేను స్కూల్లో  నాలుగో అయిదో శ్రద్ధగా చదువుతూ ఇంట్లో అంతకంటే శ్రద్ధగా నవలలు చదువుతుండేదాన్ని!  ఆ రోజుల్లోనే ఆంధ్ర జ్యోతి వారపత్రికలో శ్రీ మైనంపాటి భాస్కర్ గారు "బుద్ధి జీవి" అనే సీరియల్ రాశారు, ఒక రోబో ప్రధానాంశంగా!  సైన్స్ నేపథ్యంతో సూపర్ హిట్ అయిన నవల అది. నచ్చిన సీరియల్స్ ని పుస్తకాలు గా బైండ్లు చేయించే అలవాటు ఉన్న మా ఇంట్లో ఆ నవల ఆ తర్వాత చాలా రోజులు ఉంది. ఇప్పుడు రచయిత వద్ద తప్ప ఎక్కడా లేదు.

పుస్తకం మీకెలాగూ దొరకదు కాబట్టి కథంతా ఇక్కడ చదవాల్సిందే! గత్యంతరం లేదు మరి!:-))

కథా కాలం 2050 ప్రాంతం!

సంజీవ్ అనే సైంటిస్ట్ ని ఆయన తయారు చేసిన నరహరి అనే రోబో హత్య చేసి పారి పోయిందని మీడియాలో బ్రేకింగ్ న్యూసు వస్తుంది. ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేసే విషక్రిమిని తయారు చేస్తున్న జెనెటిక్ ఇంజనీర్  శోధన కూతురు అపురూప ఆ వార్తలు చూస్తూ "అమ్మో, అది ఎక్కడికి వెళ్ళుంటుంది" అని ఆశ్చర్యపోతుండగా సంజీవ్ గారి కొడుకు అజిత్ పోలీసులతో సహా వాళ్ళింటికే వచ్చి

"ఆ రోబో మీ అమ్మ ని కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానించాం. అందుకే వచ్చాం" అని అపురూపతో చెప్పి లాబ్ లోకి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ శోధన అపహరణకు గురైన ఆనవాళ్ళు కనిపిస్తాయి.

టీవీల్లో ప్రకటనలు..ఆ తప్పించుకు పోయిన రోబోట్ కి తనలాంటి వాటినే అసంఖ్యాక రోబోలను తయారు చేసి వినాశనానికి ఊపయోగించగల శక్తి కూడా ఉంది కాబట్టి వెంటనే దాని ఆచూకీ తెల్సిన వారు తెలియజేయాలని!

దానితో అజిత్, అపురూప శోధనను, నరహరిని వెదకడానికి రెక్కలున్న ఫ్లయింగ్ కారులో బయలుదేరతారు. దార్లో వాళ్ళకు ఫ్లయింగ్ సాసర్ కనిపిస్తుంది. దాని వెంటబడి పట్టుకునే ప్రయత్నంలో దారి   తప్పి మెకానికా దేశం సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మనుషులంతా ఒకే రకంగా ఉంటారు.పేర్లకు బదులు నంబర్లుంటాయి. ఒకటో నంబర్ వాడు మిగతా వాళ్ళందరినీ క్లోనింగ్ ద్వారా వృద్ధి చేసి వాళ్ళకు సొంత ఆలోచనలేవీ లేకుండా చూస్తూ తన బానిసలుగా వాడుకుంటూ ఉంటాడు. అక్కడ వీళ్ళు చావు తప్పి ఎలాగో తప్పించుకుని పారిపోతారు.

 ఇలా మరొక రెండు దేశాలు తప్పించుకుని వెళుతుండగా ఒక చోట,.... తప్పించుకు పారిపోయిన నరహరి వికృతాకారంతో ఎదురవుతుంది. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా అది తప్పించుకుని కొండల్లోకి పారిపోతుంది.  ఆ కొండ ఎక్కి ఇద్దరూ అటు దిగే సరికి వాళ్ళు ఎన్నడూ చూడని, ఊహించని దృశ్యం ఎదురవుతుంది. కొండల మధ్యలో నాగరికత వాసనలు అంటని ఒక బుల్లి అచ్చ తెలుగు పల్లెటూరు. వీళ్ళిద్దరినీ అంతా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.

అక్కడ అందరికీ తల్లో నాలుకలా మెసలుతూ నరహరి! నరహరిని చంపబోతుండగా అందరూ అడ్డం పడి అజిత్ ని చీవాట్లు పెడతారు.

అప్పుడు నరహరి చెప్తాడు .."నేను మనిషినే! రోబో ని కాదు" అని!

ఒకసారి సైన్సు కాంఫరెన్స్  జరుగుతున్న హోటల్లో  దానికి హాజరైన ఆరుగురు  సైంటిస్టులు  హోటల్ యజమాని మోహన్ కి స్నేహితులవుతారు. వాళ్ళు ఇద్దరు ప్లాస్టిక్ సర్జెన్లూ,ఒక హార్ట్ స్పెషలిస్టూ,ఒక జనరల్ ఫిజిషియనూ,ఒక రాబొటిక్స్ స్పెషలిస్టూ! ఆ రోజు రాత్రి హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మోహన్ ఎంతో శ్రమించి ఆ ఆరుగుర్నీ కాపాడి తను మరణిస్తాడు. అంత చక్కని ఆతిథ్యం ఇచ్చిన మోహన్ చావడాన్ని ఆ ఆరుగురూ జీర్ణించుకోలేక, అతడు బ్రెయిన్ డెడ్ కాలేదని నిశ్చయించి వెంటనే ఆర్టిఫిషియల్ గుండెతో పని మొదలు పెడతారు. ఎవరెవరివో అవయవాలు అమర్చి,ఫైబర్ గ్లాస్ చుట్టూ, దెబ్బ తిన్న మెడుల్లా ఆబ్లాంగేటా స్థానే ఒక చిన్న మైక్రో కంప్యూటరూ..ఇలా  తిరిగి మోహన్ బతుకుతాడు.

"నా కాళ్ళు నబూకా అనే నీగ్రోవి! నా గుండె రజియా అనే స్త్రీది. నా చేతులు హారిసన్ అనే వ్యక్తివి. నా శరీరంలోని కొన్ని గ్రంథులు రింకూ అనే చింపాంజీవి.ఈ నలుగురి పేర్లలోని మొదటక్షరాలు కలిపి నాకు "నరహరి" అని నామకరణం చేశారు డాక్టర్ సంజీవ్" అని చెప్తాడు నరహరి. ఇలా ఘోరంగా మారిపోయిన నరహరిని తమ కుటుంబ సభ్యుడి గా అంగీకరించక అతడి భార్యా బిడ్డలు వెళ్ళగొడతారు. ఎక్కడా దిక్కులేక వికారమైన స్వరూపంతో బతకలేక ఆ మారు మూల ఊరికి వచ్చి వాళ్ళలో  ఒకడిగా పని చేసుకుంటూ బతుకుతున్నాడు నరహరి. అతడు మనిషని తెలిసిన అపురూప "మరి సంజీవ్ తయారు చేసిన మరమనిషి మీరేనని, ఆయన్ని చంపి మీరు పారిపోయారనీ గగ్గోలుగా ఉంది"అని చెప్తుంది. అసలు సంజీవ్ మరణించిన సంగతే తెలీదు నరహరికి.

మరి సంజీవి ని ఎవరు చంపారు? తన తల్లి శోధన ఏమైంది? ఆమె సృష్టించిన విషక్రిమి ఎక్కడుంది? అపురూపకన్నీ ప్రశ్నలే! నరహరిని అక్కడే వదిలి తిరిగి బయలు దేరతారు.

 ఈ కొద్ది రోజుల సాహచర్యంలో అజిత్ అపురూపల మధ్య ప్రేమ భావం అంకురిస్తుంది. నిజానికి అపురూపకి ప్రేమ, పెళ్ళి... ఇవంటే ఏమిటో తెలీదు. ఆమె తల్లి శోధన కూడా ఒక స్పెర్మ్ బాంక్, ఒక టెస్ట్ ట్యూబ్, ఒక ఇంకుబేటర్--ఈ మూడిటి సాయంతోనే అపురూపను తన కూతురిగా సృష్టించుకుంది తప్ప పెళ్ళి చేసుకుని కనలేదు. ఇప్పుడీ కొత్త భావం ఆమెకు ఎంతో తీయగా అనిపిస్తుంది.

దార్లో అజిత్ టైమ్ మెషీన్ ఎక్కితే ఎలా ఉంటుందో అపురూపకు ఒక సిములేషన్ మెషీన్ ద్వారా చూపిస్తాడు. కొన్ని శతాబ్దాల తరవాత మనిషి ఒక మాంసం ముద్దలా తయారైపోతాడు అంటూ ఆ దృశ్యాన్ని చూపిస్తాడు. కాసేపట్లో అలాంటి మాసం ముద్ద లాంటి జీవి ఒకటి ఫ్లయింగ్ సాసర్లో వచ్చి నిజంగానే వాళ్ల ఎదురుగా నిల్చుంటుంది. ఎవరు ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకోగలిగే ఆ గ్రహాంతర వాసి స్నేహ సందేశాన్ని మోసుకొస్తుంది!

"మీ భూమి కంటే కోట్ల సంవత్సారల ముందే మా గ్రహం పుట్టింది. సైన్సులో విపరీతమైన అభివృద్ధిని సాధించాం! రోబొట్స్,సాటిలైట్స్,జెనెటిక్ ఇంజనీరింగ్, అణుశక్తి ఇలా ఒకటేమిటి అన్నింటినీ  వినాశనానికే వాడాం! చివరికి ఇలా రూపం లేని జీవులుగా మిగిలాం! భూమి ని నాశనం చేసే విషక్రిమి ఏదో తయారవుతోందని అంతా భయపడుతున్నారు. అసలు మనిషి కంటే విషక్రిమి ఎవరు? మనిషి కంటే మారణాయుధం ఎవరు? ఇంత స్వార్థం ఎవరికుంది?సైన్సు మనిషికి మంచి చెయ్యాలే కానీ ముంచెయ్య కూడదు" 

ఇలా చెప్పి ఆ బుద్ధి జీవి "అన్నట్లు అజిత్, ఆ విషక్రిమి ని ఎక్కడ దాచావు? బయటికి తీయ్, చూస్తాను" అని అడుగటంతో అజిత్ నిశ్చేష్టుడైపోతాడు.

ఇక చేసే ది లేక తన ముంజేతిని ఒక స్క్రూ లా తిప్పి ఊడదీసి, మణికట్టు లోపల దాచిన చిన్న కాప్స్యూలు తీసి ఇస్తాడు.

అవును, అజిత్, మనిషి కాదు! సంజీవ్ తయారు చేసిన రోబో అజితే! 

మనిషిలా కనపడేదీ, మానవ స్వభావాన్నీ, భావోద్వేగాల్నీ అనుభవించగలిగే ఒక రోబోట్ అజిత్! ఇంతలో ఆ కాప్యూలును మింగేస్తుంది ఆ బుద్ధి జీవి. "మరేం పర్లేదు ,ఇలాంటి వాటిని హరాయించుకునే దశలో ఉన్నాం మేము" అంటుంది.
అపురూప కు మతి పోతుంది.

ఆ తర్వాత అపురూపకు స్పృహ వచ్చాక .......
"సంజీవ్ గారి కొడుకు ఆధ్యాత్మికత లో పడి ఎటో వెళ్ళిపోతే అతడి లాగే కనపడేలా నన్ను తయారు చేసి అతడి పేరే నాకు పెట్టారు సంజీవ్. లోకానికంతటికీ నేనే అతడి కొడుకుగా తెల్సు. కానీ దురదృష్ట వశాత్తూ ఆయన కంటే నా మేథస్సు ఎక్కువని రెండు మూడు సందర్భాల్లో రుజువైంది. ఒక మేజర్ సమస్యను ఆయన సాల్వ్ చేయలేక సతమవుతుంటే నేను నేను పరిష్కరించాను. అది ఆయన అహాన్ని దెబ్బ తీసింది. 


నన్ను నాశనం చేయాలని సంకల్పించారు. అంతకు  ముందే ఈ విషక్రిమి తయారీలో మీ అమ్మగారున్నారని సంజీవ్ నాతో చెప్పడం వల్ల ఆ విషక్రిమిని ఎలాగైనా నాశనం చేయాలని నేననుకుని మీ అమ్మను కిడ్నాప్ చేశాను. విషక్రిమిని నా స్వాధీనం చేసుకున్నాను!  ఈ లోపు తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నారు" అని చెప్తాడు అజిత్!

తమ కళ్యాణమెలాగూ సాధ్యం కాదని తెలుసుకున్న ఆ మనిషీ, మెషినూ కలిసి చేతులు కలిపి  సైన్సును మానవ కళ్యాణానికే తప్ప  వినాశనానికి ఉపయోగించరాదనే సందేశాన్ని ప్రచారం చేసేందుకు  బయలు దేరతారు.

ఈ నవలకు ఆంధ్రజ్యోతి నిర్వహించిన సైన్స్ ఫిక్షన్ నవలలపోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇందులోని చాలా విషయాలు ఇప్పుడు ఒక మౌస్ క్లిక్ దూరంలోనే దొరకొచ్చు కానీ 1984లో ఇంత చక్కని నవల రాయడం ఎంత గొప్ప విషయమో అనిపిస్తుంది.  రోబో సినిమాలోని సందేశమే ఇక్కడానూ! సైన్సును పెడదోవలు పట్టించి వినాశనానికి ఉపయోగించొద్దని!

భవిష్యత్తులో ఈ విశ్వం ఎలా ఉండబోయేదీ రచయిత ఊహించిన తీరు అద్భుతంగా తోస్తుంది. అడుగడుగునా కనపడే ఫ్లయింగ్ ఆబ్జెక్టులూ, అజిత్ తో పాటే తిరుగుతుండే కేటూ (k2) అనే బుల్లి రొబొట్, అకస్మాత్తుగా కొండల మధ్య పల్లెటూరూ, నవలంతా చాలా ఆహ్లాదంగా నడుస్తుంది. సీరియల్ కావడంతో వారం వారం పత్రిక కోసం ఎదురు చేసేలా ఉండేది.

ఇంగ్లీషులో ఇలాంటి సైన్స్ ఫిక్షన్స్, అందునా రోబొట్ కథాంశంగా ఎన్నో నవలలు వచ్చి ఉండొచ్చు, కానీ అంతకు ముందు గానీ ఆ తర్వాత కానీ ఈ అంశంతో కథ వచ్చినట్లు నాకైతే తెలీదు మరి! అచ్చు మనిషిలాగే ఉండే రోబోట్, మనిషి లాగే ఆలోచించగలిగే రోబోట్ ఈ నవల్లో ప్రత్యేకం! ఇన్నేళ్ళ తర్వాత రోబో సినిమాలోనూ అదే ప్రత్యేకం!

నవసాహితి పబ్లిషర్స్ వేసిన ఈ నవల మార్కెట్లో అందుబాటులో లేదు! దొరికితే మాత్రం తప్పక చదవండి.