పుస్తకాల సంతలో వారాంతం ......కాసిన్నికబుర్లు!  

Posted by సుజాత in




వారాంతం రెండు రోజులూ పుస్తకాల సంతకి వెళ్ళాలని ముందే అనుకున్నాను కాబట్టి, శనాదివారాలు రెండురోజులూ సాయంత్రాలూ అక్కడే గడిపాను.ఇవాళైతే మధ్యాహమే వెళ్ళాను. ఎందుకంటే నిన్న పుస్తకాల స్టాళ్లన్నీ చూడ్డం కుదరలేదు.పైగా నిన్న నాతో సంకీర్తన ఉంది. ఆవిడను తీసుకెళితే కనపడ్డ యాక్టివిటీ పుస్తకాలన్నీ కొనమంటుంది. మరో పక్క భయపెడుతూ "ఛోటా భీమ్" వాళ్ళ స్టాలు! అందుకే నిన్న కొన్ని పుస్తకాలు మాత్రమే కొన్నాను. నిజానికి నా పుస్తకాల కొనుగోలు ఎప్పటికప్పుడు నవోదయలోనో, విశాలాంధ్రలోనో అప్ డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తెలుగు పుస్తకాలు అంతగా కొనాల్సినవి కనపడలేదనే చెప్పాలి.

ఇవాళ తీరిగ్గా తిరిగి, కొన్ని పుస్తకాలు కొన్నాను. నేను స్టాళ్ల పేర్లు పట్టింపు లేకుండా(అంటే నిజానికి పట్టించుకోకుండా) అన్నీ తిరిగి చూశాను."కన్ను దిష్టి గణపతి" స్టాల్ తో సహా! (ధర చాలా ఎక్కువ ఉండటంతో కొనలేదు)తల్లి అవతారమెత్తాక పుస్తకాలనే కాదు, ఎక్కడికెళ్ళినా పిల్లలకు పనికొచ్చేవి ఏమున్నాయో చూడ్డం ఒక దైనందిన చర్యగా మారిపోతుందిగా! అందుకే స్పైడర్ బుక్స్ స్టాల్లో మంచి యాక్టివిటీ పుస్తకాలు,క్రాస్ వర్డ్ పజిల్సు పుస్తకాలు కొన్నాను. ఈ స్టాల్లో మంచి కలెక్షన్ ఉంది. అలా వెళ్తోంటే నవోదయ వాళ్లు 'ఏవండోయ్, ఇల్లా చూడకుండా పోతున్నారేం?" అని కేకేశారు. కొమ్మూరి వేణుగోపాలరావు గారి పుస్తకాలన్నీ వచ్చాయి, చూస్తారా అన్నారు. చూశాను గానీ వాటిలో నాకు కావలసిన 'ఈ దేశంలో ఒక భాగమిది" నవల లేదు. ఈ నవల చాలా అద్భుతంగా ఉంటుంది.



అందరితో పాటే నేనూ నా 'నా ఇష్టం" కొన్నాను.పిలకా గణపతి శాస్త్రి గారి "విశాలనేత్రాలు" చినవీర భద్రుడి 'సత్యాన్వేషణ" తీస్కున్నా! ఈ సారి మంచిపుస్తకం, జనవిజ్ఞానవేదిక వాళ్ళు కల్సి నిర్వహిస్తున్నారు స్టాల్. వాళ్ళ దగ్గర గిజుభాయి పుస్తకాలు తీసుకున్నాను.

నన్ను బాగా ఆకర్షించిన మరో స్టాలు 'సేతు సాఫ్ట్ వేర్ సిస్టమ్" వాళ్ళది. My drona పేరుతో ఒక వీడియో డివైస్ ని అందిస్తున్నారు. ఫెయిర్ కి వెళ్ళినవాళ్లు తప్పక చూడండి.బాగా ఉపయోగంగా కనిపించిన మరో స్టాలు "కినిగె"!.స్నేహితులందరికీ ఈ స్టాలు గురించి మెయిల్ పంపాను చూడమని!

మరికొన్ని పుస్తకాలు తీసుకుని , ఛోటా భీమ్ స్టాల్లో ఒక టీ షర్టూ(పిల్లదానికి), ఒక కప్పూ,కీ చైనూ తీసుకుని బయటపడ్డాను.

ఈ లోపల రామ్ గోపాల్ వర్మ తో ముఖాముఖి ప్రారంభమైంది. సభికులు అడిగిన కొన్ని తింగరి ప్రశ్నలకే కాక,సీరియస్ ప్రశ్నలకు కూడా రాము తింగరి,వెటకారపు సమాధానాలే చెప్పి "నా ఇష్టం" అనిపించుకున్నాడు.(పుస్తకంలో కొన్ని భాగాలు నాకు చాలా నచ్చాయి)



ఆదివారం కావడం వల్ల ఇవాళ చాలామంది బ్లాగర్లు ఈ తెలుగు స్టాల్ కి వచ్చారు. శ్రీనివాస్ రాజు దాట్ల భార్గవ్,కట్టా విజయ్,రవిచంద్ర,కత్తి మహేష్,నవతరంగం వెంకట్,అరిపిరాల సత్యప్రసాద్,బూదరాజు అశ్విన్,వికాసధాత్రి అరుణ,కస్తూరి మురళీకృష్ణ,చావా కిరణ్, వేణు, గీతాచార్య,యోగి,జాన్ హైడ్ కనుమూరి,శ్రీనివాస కుమార్,సీబీరావు,బాలు(కోతికొమ్మచ్చి)  గార్లు కాక.....

కొత్తగా వీకెండ్ పొలిటీషియన్,కొడవటిగంటి రోహిణీప్రసాద్ గార్లు ఇవాళ్టి ప్రత్యేక అతిథులు.జ్యోతిగారు వచ్చి అరంగంట ఉండివెళ్ళిపోయారు.(ఇంకెవరైనా వచ్చారా? నేను గమనించలేదు)

వీళ్ళుకాక రోజూ స్టాల్లో ఉండటానికి (గుంటూరునుంచీ )వచ్చిన కౌటిల్య,రహమానుద్దీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

అన్నట్లు వీవెన్ కూడా!:-))

స్టాలు సందర్శకులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారివాళ. రామకృష్ణమఠం వారు నడిపే శ్రీ రామకృష్ణ ప్రభ పత్రికకు   ఆన్ లైన్ లో తెలుగువ్యాసాలు ఎలా టైప్ చేసుకోవాలో  పత్రిక నిర్వాహకులు పరిజ్ఞాయేంద్ర స్వామి కి రెహమాన్ వివరించారు.

ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు "మలక్పేట్ రౌడీ హైద్రాబాదులోనే ఉన్నారా?నిజంగానే వస్తారా"అని ఆసక్తి ప్రదర్శించారు.(ఆయన ఇంతకు ముందు టపాలో "నేనూ రానా బుక్ ఫెయిర్ కి?" అని వ్యాఖ్య రాశారు)

స్టాల్లోని బ్లాగర్లకి మిర్చి బజ్జీలు సత్యప్రసాద్ గారూ, స్వీట్లు కౌటిల్యా స్పాన్సర్ చేశారు.:-))

ఇంకా కొనాల్సిన పుస్తకాలు,చూడాల్సిన స్టాళ్ళూ కొన్ని మిగిలిపోయాయి. వచ్చే వారాంతంలోపు వాటి సంగతీ చూడాలి.

హైద్రాబాదు బ్లాగర్లు తీరిక చూసుకుని ఒక రోజు బుక్ ఫెయిర్ కీ, పన్లోపనిగా స్టాలుకీ వచ్చేయండి!

తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి!  

Posted by సుజాత in

           నిన్నటి బ్లాగర్ల సమావేశానికి వచ్చిన కొందరు బ్లాగర్లు.



ఈ నెల పదహారో తారీకు నుంచి నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో పుస్తకాల సంత ప్రారంభం కానున్న సంగతి మీ అందరికీ తెలుసు! ఇది 26 వరకూ కొనసాగుతుంది.

ఎప్పటిలాగానే ఈ తెలుగు సంస్థ ఈ సంతలో  ఒక స్టాలుని నిర్వహించబోతోంది. పోయినేడాది ఈ తెలుగు స్టాల్ కి అనూహ్య స్పందన లభించింది. అనేకమంది కవులు, రచయితలు, కళా కారులు,జర్నలిస్టులు స్టాలుని సందర్శించి కంప్యూటర్లో తెలుగుని ఎలా ఉపయోగించాలో నేర్చుకుని సీడీలు పట్టుకుని వెళ్ళారు. శ్రీయుతులు తనికెళ్ల భరణి,బీ వీ పట్టాభిరామ్,జయప్రభ, భారవి, భాస్కర భట్ల రవి కుమార్,తెలకపల్లి రవి,ఇంకా అనేకులు కంప్యూటర్లో తెలుగు వికాసాన్ని తెలుసుకోవటం పట్ల అమితాసక్తిని చూపించారు.

దీనివల్ల మాకు అర్థమైందేమిటంటే ఈ మెయిల్సూ, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లూ ఉపయోగించే అనేకమంది ప్రముఖులు ఈ పనులన్నీ తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారనీ, స్టాలుని సందర్శించే దాకా అవి తెలుగులో కూడా చేయొచ్చని వారికి తెలీదనీ!

తెలుగు బ్లాగర్లను మినహాయిస్తే చాలామంది  తెలుగువారు ఆన్ లైన్లో వార్తా పత్రికలు చదువుకోవడం తప్ప ఇంటర్నెట్ లో తెలుగు వికాసానికీ, తెలుగు విజ్ఞాన సర్వస్వం వికీ పీడియా, బ్లాగులు మొదలైన వాటికి చాలా దూరంలో ఉన్నారు.

స్టాల్ కి లభించిన ఆదరణకు మరో నిదర్శనం...ఆ తర్వాత ఈ తెలుగు నిర్వహించిన రచయితల అవగాహనా సదస్సుకు తెలుగు రచయితలు  వెల్లువెత్తినట్లు రావడం. ఏర్పాటు చేసిన హాలు చాలక మరో రెండు గదుల్లో విడివిడిగా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది.

ఈ ఏడాది కూడా పుస్తకాల సంతలో ఈ తెలుగు నిర్వహించబోతున్న స్టాలుకు కొంతమంది వలంటీర్లు కావాలి. ఈ తెలుగు సభ్యులే కాక ఔత్సాహిక తెలుగు బ్లాగర్లు కూడా ఇందులో పాలు పంచుకుంటే బాగుంటుందని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే కొంతమంది తెలుగు బ్లాగర్లు ప్రతి రోజూ సాయంత్రం వేళ వచ్చి స్టాలు లో ఉండటానికి సంసిద్ధతను తెలియజేశారు. అక్కడ చేయాల్సిన పనల్లా..సందర్శకులకు కంప్యూటర్లో తెలుగుని ఎలా ఉపయోగించవచ్చో సంక్షిప్తంగా వివరించడం!సీడీలు ఎలాగూ ఉంటాయి!

ఈ తెలుగు సభ్యులు ప్రతి రోజూ అక్కడ ఉంటారు. సంత ఎలాగూ సాయంత్రం నాలుగు తరవాతే ఊపందుకుంటుంది కాబట్టి ఆ సమయానికి ఆసక్తి గల తెలుగు బ్లాగర్లు స్టాలులో ఉంటే బాగుంటుంది. రెండు వారాంతాలూ నేను రాగలను. వీలు చూసుకుని ఈ మధ్యలో కూడా!

అక్కడికి వచ్చే రచయితలు, కవులు, కళా కారుల్ని కలుసుకుని వారికి సాంకేతికాల్ని వివరించే అవకాశం ఉంటుంది. పన్లో పనిగా పుస్తకాలూ కొనుక్కోవచ్చు! అంతే కాదు..అక్కడ పోయినేడాది లాగానే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన వారు తమ బ్లాగు పేరుని అక్కడ స్వయంగా రాసి ప్రదర్శించుకోవచ్చు!

ఇంకోటి..సరదాగా అందరమూ కల్సి కాసిన్ని మంచి కబుర్లు చెప్పుకోవచ్చు:-))

ఏమంటారు? హైద్రాబాదు బ్లాగర్లకే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే తెలుగు బ్లాగర్లకు కూడా ఆహ్వానం! (ఫణిబాబు బాబాయి గారు చదువుతూ ఉండాలి ఈ టపా)

ఎవరెవరొస్తున్నారో చేతెలెత్తండి! అంతటితో సరిపెట్టక ఇక్కడ వ్యాఖ్య రాయండి!

యదార్థ వాది -లోక విరోధి!(జేపీ)  

Posted by సుజాత in



చాలా రోజుల తర్వాత ఇవాళ జేపీ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి!ఎందుకంటే ఈ మధ్య జేపీ అసలేమీ మాట్లాడకుండా, తెలంగాణా మీద ఏ వైఖరీ తేల్చకుండా ఉండటం నాకు నచ్చడం లేదు.

"రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాల పేరుతో బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నాయని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. చట్టాలకు లోబడి మాత్రమే కేసులు ఎత్తివేయాలన్న ఆయన  హింసాత్మక బలవంతపు వసూళ్ళకు పాల్పడిన వాళ్లకు మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు." (ఈనాడు.నెట్ ) 


ఉద్యమాల సమయంలో హింస, విధ్వంసాలకు పాల్పడినవారిపై కేసులు ఎత్తివేయాలనటం సమంజసం కాదని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. ప్రభుత్వం ఉన్నది ఇలాంటి చర్యలను ప్రోత్సహించేందుకు కాదన్నారు. ఉద్యమాల సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి చిదంబరం ప్రకటన సరికాదన్నారు. 


ఉద్యమాల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇటువంటివి జరుగుతున్నా ప్రభుత్వం నిస్తేజంగా ఉందని ఆయన విమర్శించారు. భయంతోనే వసూళ్ల బాధితులు  ఫిర్యాదు చేయటం లేదన్నారు --సాక్షి

ఈ మాటల్లో తప్పుందో లేదో పార్టీలకతీతంగా ఆలోచిస్తే  ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి ఆయన ఏ పార్టీ పేరూ ఎత్తలేదు. కానీ  ఆయన వ్యాఖ్యలు తగిలిన వారు మాత్రం వీరంగాలు వేసి "సో కాల్డ్ మేధావి గారు" అంటూ ఎద్దేవా చేస్తూ వసూళ్ళకి సాక్ష్యాలు చూపించమని సవాళ్ళు విసిరారు. అప్పుడే లోక్ సత్తా ఆఫీసుల్లో విధ్వంసానికి కూడా దిగారు.

ఇలాంటి వసూళ్ళు ఎవరైనా ఆడియో, వీడియో సాక్ష్యాలు పెట్టుకుని చేస్తారా? పోనీ సినిమా నిర్మాతలో,వ్యాపార సంస్థలో ముందుకొచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉందా?

ఉద్యమం సరైన దారిలో నడవటం లేదనీ, అక్రమ వసూళ్ళ వంటివి ఎక్కువై సరైన నాయకత్వమే లేకుండా పోతోందనీ తెలంగాణా వాదులే నిస్పృహ చెందిన సందర్భాలున్నాయి.

"Do question, when some thing is wrong అని చెప్పే జేపీ ఇవాళ దాన్ని చేసి చూపించారు.


దోపిడీ, అత్యాచారం వంటి సంఘటనల పట్ల కూడా ఇవాళ రాజకీయ నాయకులు "పార్టీ దృక్పథంతో" ఆలోచించి లాభ నష్టాలు బేరీజు వేసుకుని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ స్పృహ లేకుండా ఒక మామూలు మనిషిగా మాట్లాడాడు జేపీ! ఒకే ఒక్కడనిపించాడు  !

వీడియో చూడండి, జేపీ ఏ ఒక్క ప్రాంతాన్నీ, ఉద్యమాన్నీ ఉద్దేశించలేదు. పైగా "ప్రాంతాలకతీతంగా" హింసను ప్రేరేపించే వ్యక్తుల మీద చర్య తీసుకోవాలన్నారు.

ఒక సామాన్య పౌరులుగా ఆలోచించి చెప్పండి, జేపీ మాటల్లో తప్పుందా?

 "సో కాల్డ్ మేధావి గారి అడ్డగోలు మాటలు"గా వాటిని వీళ్ళు నిర్ణయించేశారు !


ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే హైద్రాబాదులో తిరగనివ్వరట.
ఏమిటీ బెదిరింపులు? ఎంతవరకు ఇలా?

ఇది నేను లోక్ సత్తా మెంబర్ గానో, జేపీ అభిమానిగానో రాయడం లేదు. నేనసలు ఈ మధ్య   పార్టీ పద్ధతులు కొన్ని నచ్చక  లోక్ సత్తాలో యాక్టివ్ గా లేను  :-))