October 31, 2011

మేథ మేట్రిక్సూ- లెక్కల మేష్టారూ-నేనూ




దాసరి సుబ్రహ్మణ్యం గారి సభలో నేను మొదటి సారి శ్రీ అవసరాల రామకృష్ణా రావుగారిని చూశాను. లోపుగా నేను గణితవిశారద మీద రాసిన బుల్లి రివ్యూ రచన శాయి గారు అవసరాల గారికి చూపించడం జరిగింది.
" అమ్మయిని కలుసుకోడానికి అవుతుందా?" అని లెక్కల మేష్టారు అడిగారని తెలిసి నిజంగా తెల్లబోయాను.

అవసరాల గారు నన్ను కలుసుకోవాలన్నారా? అమ్మో, అవకాశం వదులుకోకూడదని హైద్రాబాదులో వారి అడ్రస్ తీసుకుని మర్నాడు మధ్యాహ్నం ఒకటిన్నరకు ఒక ఫ్రెండ్ తో కలిసి వెళ్ళాను. ఆయన సమయానికే రమ్మన్నారు. మేము వెళ్ళేసరికి ఆయన ఇంట్లో లేరు. వారి బంధువు (కోడలా?) "వచ్చేస్తారు "కూచోమన్నారు.
మరో పది నిమిషాలకే చక చకా నడుస్తూ హుషారుగా లెక్కల మేష్టారొచ్చారు.

మమ్మల్ని చూస్తూనే టైము చూసుకుని " లైక్ యూ! టైము పాటించారు మీరు, నేనే పది నిమిషాలు లేటు" అన్నారు. తర్వాత మాతో బోల్డు కబుర్లు చెప్పారు. ఎనభై రెండేళ్ళ వయసులో ఉత్సాహం, శక్తి,హాస్య స్ఫూర్తి, ఇవన్నీ చెప్పలేనంత ఆశ్చర్యం కల్గించాయి. చందమామలో తాను కథలు రాసినప్పటి జ్ఞాపకాల నుంచి, బాల జ్యోతిలో మేథ మే ట్రిక్స్, రచనలో కథలు, విశాఖ పట్నం కబుర్లు, భరాగో ఛలోక్తులు, ఇలా అనేక విషయాలు! "మీరింకా భోజనం చేసినట్టు లేదు మేష్టారూ! మేము కూచుంటాం లెండి, మీరు తినండి" అని మేమంటే
"ఇద్దరు మనుషులు ఇల్లా దిష్టి పెడుతూ ఎదురుగా కూచుంటే ఎలా తినను! నాలుగు కబుర్లు చెప్పి మిమ్మల్ని పంపించి సుష్టుగా తింటానులెండి" అన్నారు.

గణిత విశారద తో పాటు, బ్లాగాడిస్తా రవి గారు పుస్తకం .నెట్ లో రాసిన మేథ మే ట్రిక్స్ పరిచయం కూడా ప్రింట్స్ తీసి పట్టుకెళ్ళాను. అవి చూసి సంతోషించారు. " పుస్తకం, (మేథ మే ట్రిక్స్), పజిల్స్,జ్ఞాపకాలు ఇంకా గుర్తు పెట్టుకునే వారున్నారన్నమాట" అన్నారు.

కబుర్లవీ అయ్యాక "మీరు నాకో ఇంటర్వ్యూ ఇవ్వాలి. నేనొక స్పెషల్ స్టోరీ రాసుకుంటాను" అని అడిగాను. దానికాయన "అబ్బ, ఇంటర్వ్యూలవీ వద్దు, నేనే అంతా రాసి పంపిస్తాను. దాంట్లో మీరు ప్రశ్నలు ఇరికించుకోండి" అన్నారు.మేథమేట్రిక్స్ బాల జ్యోతిలో వచ్చే రోజుల్లో వాటిని సాల్వ్ చేయడానికి మేము పడిన కష్టాలు చెప్తే హాయిగా నవ్వారు.

ఆయననాకు పజిల్స్ తోనే పరిచయం!


మేము వచ్చేస్తోంటే సీతామహాలక్ష్మి అనే ఆమె సంకలనం చేసిన "మరణించినా జీవించండి" అనే పుస్తకం నాకు ఇచ్చి "తప్పక చదవాలి మీరు" అని ఇచ్చారు.అందులో ఆయన ఒక కథా సంకలనానికి రాసిన ముందు మాట నుంచి కొంత భాగాన్ని ఇక్కడ చదవండి.
నా కథకు ముగింపు నాదే!

ఎన్ని కథలు రాసి ఎంతగా చెబితేనేం, కార్యాచరణ కాకపోయాక? అనే వేదన నన్ను బాధిస్తోంది. దాన్నుంచి విముక్తి పొందడానికే ఈ మధ్య ఓ ప్రయత్నం మొదలెట్టాను. ఎంతగా ఆరోగ్యంగా ఉన్నా, దెబ్భై ఐదేళ్ళు తెగ వాడేసిన నా శరీర భాగాలు, ఎప్పుడో అప్పుడు నన్ను గుటుక్కుమనిపించక మానవు. నా శవానికి పిండ ప్రదానాల తంతు కాదని,వైద్య కళాశాలకు దానం చేసే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. బతికున్న వాళ్ళనే చంపేసే ఏ వైద్య కళాశాలకు పరిశోధన నిమిత్తం దానం చేస్తారా?" అనే సందేహం లేకపోలేదు. శవాలను తరలించే ఈ ఉద్యమానికి మృత దేహ దాన సమితి అనే పేరు గల సంస్థగా రూపు దిద్దే సదుద్దేశంతో ఉన్నాను. "బ్రాహ్మణుడిగా పుట్టావు. ఇదేం దుర్బుద్ధి? పుట్టగతులు లేకుండా పోతావ్" అనే ఆప్తుల అభిప్రాయానికి నేను తలవంచను. ఏ కులానికి తగిన అపర కర్మ ప్రక్రియలు దానికి ఉండనే ఉంటాయి. చచ్చాకయినా మనిషిగా గుర్తించబడితే అంతే చాలు. ఈ నా కథకు ముగింపు ఇలాగే ఉండాలి.

కర్మ సిద్ధాంతం మీద ఇదే నా "చావు" దెబ్బ!


ఏదైనా సరే ఒక వాదాన్ని సమర్థిస్తున్నపుడు, దాన్ని ఆచరించడం కంటే గొప్ప నిబద్ధత ఉంటుందా? "మేం నాస్తికులం" అంటూ తమని తాము నలుగురినుంచీ వేరు చేసుకుంటూ, గ్రహణం రోజు బిర్యానీలు తింటూ,అసలు ఫలానా బాబా ఒట్టి ఫకీరే తప్ప యోగి కాదు అంటూ పటాటోపాలు ప్రదర్శించే వారు గుర్తొస్తే క్షణం ఎంత చీదర వేస్తోందో!

అన్నట్టుగానే ఆయన మరణానంతరం తన దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు ఇచ్చేశారు.

గేటులోంచి బయటికి వస్తూ కూడా నేను "రాసి పంపడం కాదు, మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే" అంటే "సరే అలాగే ఇస్తాను కదలవమ్మా మహాలక్ష్మీ, నాకు ఇక్కడ కడుపు కాలుతోంది" అని గట్టిగా నవ్వేశారు.

నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండానే లెక్కల మాష్టారు వెళ్ళిపోయారు.