August 10, 2011

కృష్ణ వేణీ..తెలుగింటి విరిబోణీ




నిన్న సౌమ్య బజ్ లో  కృష్ణ వేణి సినిమా ప్రసక్తి వచ్చింది. ఈ సినిమా నాకు తెల్సి ఆన్ లైన్ లో ఎక్కడా లేదు. కోఠీలోని నవభారత్ వీడియోస్ లో అడిగాను(వాళ్ల దగ్గర మూకీ సినిమాలు కూడా దొరుకుతాయి, మీకు కావాలంటే).వాళ్ళూ అది డీవీడీగా రాలేదన్నారు. కానీ ఆ సినిమాని నేను దాదాపు పదేళ్ళ కిదట దూరదర్శన్ లోనో ఈ టీవీ లోనో చూసిన గుర్తు! సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు మూడు రోజులు నిద్ర రాలేదు. ఎక్కడికి వెళ్ళినా వాణిశ్రీ వెంటాడుతూ ఉండేది.ఈ సినిమా కోసం నా అన్వేషణ ఇంకా కొన సాగుతూనే ఉందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను!

కృష్ణం రాజు సొంత బానర్ గోపీ కృష్ణా మోవీస్ తీసిన అత్యుత్తమ సినిమా అది! మూలం కన్నడ సినిమా శర పంజర!(వికీ లో వెదకండి) అందులో కావేరి నది మీదుగా కథ నడిస్తే తెలుగులో కృష్ణా నది బేస్ గా కథ నడుస్తుంది.

ప్రసవానంతరం కొందరు స్త్రీలకు బలహీనత వల్ల, ప్రసవంలో పడిన కష్టం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయనే విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలీదు గానీ అలాంటి కేసులు నేను స్వయంగా చూశాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి అలా జరిగి పిల్లాడిని పట్టించుకోకుండా "నన్ను చంపేశారు, నన్ను చంపేశారు" అని ఏడుస్తూ జుట్టు పీక్కునేది. అప్పుడు మేము మరీ చిన్న పిల్లలం కావడం వల్ల వింతగా భయంగా చూసి పరిగెత్తుకొచ్చేసేవాళ్ళం!  అయితే ఆమె తల్లి దండ్రులు ఆమెకు సరైన చికిత్స చేయించకుండా "పురిట్లో దెయ్యం పట్టింది! పైగా హత్యకు గురైన ఆడమనిషి దెయ్యం(నన్ను చంపేశారు అంటోందిగా మరి) అని ఏవేవో పిచ్చి వైద్యాలు చేయించి తిండి పెట్టకండా ఆమె మరణించే దాకా అసామాన్య కృషి చేశారు.

"నన్ను చంపేశారు"అన్న మాట బహుశా ఆమె పురిటి నొప్పులను ఉద్దేశించి వేరేగా బయట పెడుతుందేమో అని ఒక్కరూ ఆలోచించలేదని పెద్దయ్యాక అర్థమై చాలా బాధ వేసేది.

కృష్ణ వేణి సినిమా కూడా ఇదే దార్లో నడుస్తుంది.

రెండో కానుపులో వాణిశ్రీకి బలహీనత కలుగుంది. కృష్ణం రాజుతో కల్సి అమరావతి ట్రిప్ కి వెళ్ళినపుడు కౌమార దశలో గుర్తు తెలియని వ్యక్తీ  ఆ నదీ తీరంలో ఆమె మీద జరిపిన అత్యాచారం(ఇదే అనుకుంటాను context...(లేక ఎవరినా ప్రేమిస్తుందా?  సరిగా గుర్తు రావడం లేదు) సంగతి జ్ఞప్తికొచ్చి విహ్వల పరిస్థితిలో ఆ ఇసుక మీద పడి "ఇక్కడే పోయింది, ఇక్కడే పోయింది" అని ఏడుస్తుంది. ఏం పోయిందో కృష్ణం రాజుకి అర్థం కాక ఇంటికొచ్చ్చాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాక భార్య  పెళ్ళీ నాటికి అనాఘ్రాత పుష్పం కాదనే కఠోర వాస్తవం అతడిని దిగ్భ్రాంతి పరుస్తుంది. జీర్ణం చేసుకోలేకపోగా భార్య తనను మోసం చేసిందనే ఫీలింగ్ లో పడతాడు.

ఆ మానసిక వ్యాధి ముదిరి కృష్ణ వేణిని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. పిల్లలిద్దరినీ మేనత్త పెంచుతుంది. ఇదే అదనుగా కృష్ణం రాజు తన ఆఫీసులో పని చేసే వాంప్ మంజు భార్గవి తో సంబంధం పెట్టుకుంటాడు.(అది అతనికి తప్పనిపించదు)

పరిస్థితి అదుపులోకి వచ్చి కృష్ణవేణి ఇంటికి వస్తుంది.దర్శకుడి(వి.మధుసూదన రావు) ప్రతిభ అంతా ఇక్కడినుంచీ మొదలవుతుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ! తిరిగి వచ్చిన కృష్ణ వేణిని ఎవరూ మామూలు మనిషిగా ఆహ్వానించరు. "పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన మనిషి"గానే చూస్తారు.

పిల్లలు దగ్గరికి రారు. వాళ్ళ మేనత్త కృష్ణవేణిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. భర్త దగ్గరికి వస్తే ఆయన అటుతిరిగి పడుకుంటాడు. "ఆమెకు ప్రేమ, ఆదరణ అవసరం"అని డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తున్నా, ఆవిడ "చెడిపోయిందనే" విషయమే అతడిని గాయపరుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ, తన పనులన్నింటిలోనూ ఆమె కల్పించుకోబోతే ప్రయత్న పూర్వకంగా దూరంగా ఉంచుతాడు.

మనసులో కుములుతూనే మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది కృష్ణవేణి. చెల్లెలు పెళ్ళికి వెళ్తే "పిచ్చి తగ్గింది ఈ పిల్లకేగా"అనే చుట్టాల మాటలు వినపడతాయి. ఈమెకు పిచ్చి కి ట్రీట్ మెంట్ జరిగిందని తెల్సి పెళ్ళివాళ్ళు కాన్సిల్ చేసుకున్నంత పని చేస్తారు. "నాకు పిచ్చి లేదండీ, తగ్గిపోయింది"అని పెళ్ళి కొడుకు కుటుంబం కాళ్ళ మీద పడి ప్రార్థిస్తుంది కృష్ణవేణి. (ఆ పెళ్ళి జరగదనుకుంటాను).

భర్త తనను దూరంగా ఉంచుతున్నాడని అనుకుంటుందే కానీ అతనికి మరో స్త్రీతో సంబంధం ఉంటుందని అనుకోని కృష్ణవేణికి కొన్ని సూచనలు కనపడతాయి. ఒక పేరంటానికి వెళ్తే అక్కడ కూడా అక్కడి స్త్రీలు "ఈవిడే ఫలానా ఆయన భార్య! పిచ్చి తగ్గింది ఈవిడకే! అందుకే ఆయన ఫలానా ఆవిడతో ఉంటున్నాడు"అని మనకీ కృష్ణవేణికీ కూడా వినపడేలా గుస గుసలాడుకుంటారు.

ఆ పేరంటంలోనే "పదునాలుగేళ్ళు వనవాసమేగెను పరమ పావని సీతా"పాట పాడుతుంది.

ఆ పేరంటంలో విన్న మాటల వల్ల గాయపడిన మనసుతో ఇల్లు చేరిన కృష్ణవేణి బాల్కనీలో నిలబడి ఉండగా కాసేపట్లో మంజుభార్గవి తో సహా మొగుడు ఇంటి ముందు కారు ఆపుతాడు.

ఆ క్షణంలోనే ఆమె మనసు శత సహస్రాలుగా రక్తం చిందే ముక్కలుగా ఛిద్రమైపోతుంది. ఆ తీవ్ర మానసిక సంఘర్షణను అదిమి పెట్టే ప్రయత్నంలో,అవమానం,దుఃఖం ,నిస్సహాయత,మోసగించబడ్డ భావన,నైరాశ్యం,ఒంటరితనం ఈ భావాలన్నీ ఒక్కసారి చుట్టు ముట్టగా వాటిని బయట పడకుండా ఆపే ప్రయత్నంలో వింతగా పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ,(ఒక్క మాట కూడా బయటపడదు)చివరికి ఆమె వల్ల కాక ఒక్కసారిగా గుండె పగిలి ప్రాణాలు కోల్పోతుంది. నిట్టనిలువుగా మొదలు నరికిన చెట్టులా కుప్పకూలుతుంది__________భర్త పాదాల మీద!

ప్రాణం కోల్పోయి అతని పాదాల మీద పడటంలో కొంత నాటకీయత ఉన్నా, "నా ప్రేమ ఎప్పుడూ నీకే!నీ పట్ల ఎప్పుడూ విధేయతతోనే ఉన్నాను! కానీ..నువ్వే.....చూడు నా ప్రేమకు ఎలాంటి బహుమతి ఇచ్చావో?" అని  బహుశా అతడిని నిలదీసి అడుగుతున్నట్టు అతడికి , ప్రేక్షకులకు  చేరవేయడానికే దర్శకుడు అలా తీసి ఉంటాడనిపించింది!

ఈ సినిమా మొత్తం వాణిశ్రీదే! ద్వితీయార్థంలో  కృష్ణవేణి  అనుభవించే వేదనను ఇంకెవరైనా అంత బాగా చేయగలిగేవారా అంటే చేయలేరు అని తడుముకోనక్కర్లేకుండా జవాబు చెప్పేంత అద్భుతంగా చేసింది. పిల్లలని లాలించాలనుకున్నపుడు వాళ్ళు భయం  భయంగా తొలగిపోయినపుడు,చెల్లెలు పెళ్ళిలో పెళ్ళికొడుకు తరఫు వాళ్ళని బతిమాలేడపుడు,పేరంటంలో స్త్రీలు "ఆవిడే ఆవిడే" అని చెప్పుకుంటున్నపుడు________వాణిశ్రీ నటన పతాక స్థాయిలో ఉంటుంది.

ఇహ ముగింపు అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ వెంటాడి వేధించి తీరుతుంది. కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయే దృశ్యంలో వాణిశ్రీ నాకు వారం పాటు పదే పదే గుర్తొస్తుండేది. ఆ దృశ్యం అంత హృదయ విదారకంగా,కృష్ణ వేణి కోసం ప్రతి హృదయం ఆర్తితో కలవరించేలా ఉంటుంది.

చేయని తప్పుకు  బలైపోయిన కృష్ణవేణి కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చేలా ఉంటుంది.

 సింహాలో బాలకృష్ణకీ,అలా మొదలైందిలో నిత్యా కీ నంది అవార్డు ఇస్తే...ఈ సినిమాలో వాణిశ్రీ నటన జాతీయ అవార్డుకు ఒక మెట్టు పైనే ఉంటుంది.

 దసరా బుల్లోడు సినిమా టివీలో చూసిన రెండు రోజులకే ఈ సినిమా చూశానేమో, ఇద్దరు వాణిశ్రీలూ ఒకరే అంటే నమ్మబుద్ధేయలేదు!:-))


ఈ సినిమాలో మంచిపాటలున్నాయి కూడా!

"సంగీతం...మధుర సంగీతం"

"ఎందుకో నువ్వు నాతో ఉన్న వేళ ఇంత హాయి"

కృష్ణ వేణీ తెలుగింటి విరిబోణీ

"పదునాలుగేళ్ళు వనవాసమేగిన పరమ పావని సీతా"  
వంటివి.

విచిత్రం ఏమిటంటే ఈ సినిమా ఆడియోలు కూడా నాకు లింకులు ఎక్కడా దొరకలేదు.

ఈ సినిమా బయట డీవీడీ గా అలభ్యం! ఎప్పుడైనా టీవీలో వేస్తే మాత్రం మిస్ కాకుండా చూడండి...కేవలం వాణిశ్రీ నటన కోసం!

ఇదొక అద్భుతమైన కథ నిజంగా !

August 8, 2011

బ్లాగా? బజ్జా?





ఒకరోజు మెయిల్ బాక్స్ లో ఉన్న ఒకటో పదహారో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండగా ఎడమ పక్కన నాలుగు రంగుల్లో ఒక అర్థ వృత్తాకారం కనపడి ఏమిటాయని దాని మీద నొక్కాను. హాచ్చెర్యం, .....ఆలిస్ ఇన్ వండర్ లాండ్ లా ఫీలైపోయాను. అక్కడ మన వాళ్ళు (అంటే బ్లాగర్లు) హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. హోరినీ ఇదేవిటా అని ఆరా తీస్తే దాన్ని బజ్ అంటారని తెల్సింది.

కొద్ది రోజులూ వాళ్లవీ వీళ్లవీ బజ్జులు చదివి నేను ఒక చిన్న కొటేషన్ బజ్జులో రాసినట్టు గుర్తు!దాన్ని నలుగురో ఎంతమందో లైక్ చేయడం, ఇద్దరో ముగ్గురో కామెంట్లు రాయడం ఇలాంటిదేదో జరిగింది. తర్వాత మరీ ఎక్కువగా కాకపోయినా అడపా దడపా బుల్లి సైజులో బజ్జులు రాశా నేను కూడా! రాస్తున్నా!

కానీ ఈ మధ్య చాలామంది బజ్జులొచ్చి బ్లాగుల్ని పడగొట్టాయని,బజ్జుల వల్ల బ్లాగుల్లో కామెంట్లే లేకుండా పోయాయని విచారం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత వరకూ కరెక్టే!

ఈ మధ్య నేను రాసిన ఒక బజ్జులో మిత్రులమంతా దూరదర్శన్ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ జ్ఞాపకాల పూలు ఆఘ్రాణిస్తూ ఉండగా తాడేపల్లి గారొచ్చి "ఇక్కడ కాలక్షేపం బాగానే అవుతుంది కానీ అక్కడ మీ బ్లాగు బజ్జుంది చూశారా?" అని చనువుతో కేకలేశారు.

మరో ఫ్రెండ్ ఈ మధ్య "ఏమిటండీ, ఈ మధ్య మీరసలు బ్లాగు రాయడం లేదు? ఫలానా బ్లాగర్ చూడండి, రోజూ ఏదో ఒక అంశం మీద టపాయిస్తారు?" అని దబాయించారు. ఇక్కడే చెప్తున్నా జవాబు.."నేను ఫలానా బ్లాగర్ని కాదు! రోజూ బ్లాగు రాసే కోరిక,ఓపిక ముఖ్యంగా తీరిక నాకు లేవు. బ్లాగు కంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి నాకు! ఇష్టమైతే, కుదిరితే రాస్తాను.మొదటినుంచీ అల్లాగే చేస్తున్నా! బిజీగా లేనపుడే నెలకు నాలుగో ఐదో మించి రాయలేదు...ఇహ రోజూ ఎక్కడ రాయమంటావు నాయనా?"

నా పనులు నేను చేసుకుంటూనే అప్పుడప్పుడు బజ్జులో ఒకటి రెండు వాక్యాలు రాయడం,లేదా నచ్చిన ఫొటోలు పెట్టడం..అంతే!

బ్లాగు విలువ బ్లాగుకుంటే బజ్ విలువ బజ్ కుంది! ఒక చిన్న కవితో,నచ్చిన కొటేషనో, ఫొటోనో మరో జోకో పంచుకోవాలన్నా బజ్జే బాగుంటుంది.ప్రతి చిన్న విషయానికీ బ్లాగు రాయాల్సినంత ప్రాముఖ్యం లేకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతమందికి బ్లాగు రాసే సమయం లేక ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకున్నపుడు క్లుప్తంగా బజ్ లో పెట్టొచ్చు!

బజ్జులో సమయం వృధా మాత్రం బాగానే జరుగుతుంది.ఒక్కోసారి బజ్  టాపిక్ ఏమిటో,,చివరికి వ్యాఖ్యలు ఎటునుంచి ఎటు పోతాయో చెప్పడం కష్టం కూడా! ఒకసారి అప్పటికే రెండొందల వ్యాఖ్యలు వచ్చిన ఒక బజ్ లో మన రహ్మానుద్దీన్ అడుగు పెట్టి "బాబూ ప్రతి వంద వ్యాఖ్యలకోసారి బజ్ సారాంశం ఏమిటో తెలపాలని కోరుతున్నా"అని విజ్ఞప్తి చేశాడు.

అయితే ఒక్కోసారి బ్లాగు కంటే బజ్జులో మంచి విషయాల గురించి చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి సంగీతం గురించి,సాహిత్యం గురించి,భాష గురించి,కవిత్వం గురించి మంచి మంచి కబుర్లు దొర్లుతాయి అక్కడ! అందరివీ నేను కోట్ చేయలేను..నా బజ్జులోనే ఒకసారి భగవద్గీత మీద సురేష్ కొలిచాల గారు,నాగరాజు పప్పు గార్ల మధ్య ఎంతో మంచి చర్చ జరిగింది.అలాగే,వేణూశ్రీకాంత్,మాయా సౌమ్య...ఛ కాదు, ఆలమూరు సౌమ్య,రహ్మానుద్దీన్ ల బజ్జుల్లో మంచి విషయాలు పంచుకున్నాం!

ఇంకో ముఖ్యమైన సంగతి...బ్లాగుల్లో ఉన్నపుడు కేవలం పరిచయస్థులుగా ఉన్నవారు బజ్జులో అతి దగ్గరి స్నేహితులుగా మారడం నేను చూశాను.సరదా కబుర్ల మూలంగా కావొచ్చు,కలిసిన అభిరుచుల మూలంగా కావొచ్చు! ఎందుకంటే బజ్జు స్వభావం వేరు. అదొక నిరంతర సంభాషణా ప్రక్రియ వంటిది కాబట్టి!


బజ్జులో అనానిమస్ కామెంట్స్ రాసే అవకాశం కూడా లేదు.(రకరకాల ఐడీలతో రాసే అవకాశం ఉంది. కానీ బజ్జులో అసభ్యంగా ఎవరూ  కామెంట్స్ రాయగా చూళ్ళేదు ఇంతవరకూ)

బ్లాగర్లు బజ్జుల్లో గంటల తరబడి గడుపుతూ బ్లాగుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరి ఆరోపణ!బ్లాగులు రాసేవాళ్ళు బజ్జుల్లో ఉండకూడదని,బజ్జుల్లో గడిపేవాళ్ళు బ్లాగులు రాయకూడదనీ రూలేమీ లేదుగా! బజ్జులో యాక్టివ్ గా ఉంటూనే బ్లాగులు కూడా తగు మాత్రంలో రాసేవాళ్ళు బులుసు గారు,మధురవాణి,రాజ్ కుమార్,ఆ.సౌమ్య...వీళ్ళంతా కనపడుతూనే ఉన్నారు! ఇంకా చాలామంది ఉండొచ్చు కానీ నేను ఎక్కువమంది బజ్ లు అనుసరించకపోవడం వల్ల అంతగా తెలీదు. ఎవరైనా బజ్జర్లు చెప్పండి!


నిన్న ఒక బజ్ లో ఒక వ్యాఖ్యను చూసి అక్కడి నుంచి శరత్ గారి బ్లాగుకెళ్ళి చూశా!   బజ్జుల వల్ల బ్లాగులకు లాభమా నష్టమా అనే పోస్టు కనపడింది.అందులో శరత్ గారు  " చెత్తంతా బజ్జుల్లో కొట్టుకుపోయిన్దనుకోవాలా లేక మేరునగ దీరులందరూ బ్లాగులని నిర్లక్ష్యమ్ చేస్తున్నారు అనుకోవాలా? అనే చఖ్ఖని ప్రశ్న వేసుకున్నారు.

అలా ఏమీ బేరీజులు వేయక్కర్లేదండీ!ఎవరి ఆసక్తి వాళ్ళది అనేసుకోండి చాలు! ఎవరు చెత్తో ,ఏది చెత్తో నిర్ణయించుకునే అవకాశం చదివే వాళ్ళకిచ్చేద్దాం!! ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే అందులో ఉంటారు! చెత్త రెండు చోట్లా ఉండొచ్చు,మంచి విషయాలూ రెండు చోట్లా ఉండొచ్చు! ఏవంటారు?

కాకపోతే బజ్జులో కెవ్వులూ కేకలూ మాత్రం ఎక్కువే!:-))

కామెంట్ల విషయానికొస్తే ఇప్పటికీ చాలా మంది కామెంట్ల సంఖ్యను బట్టే బ్లాగు పోస్టు విలువను నిర్థారించడం విచారం! అద్భుతంగా ఉంది అనిపించిన పోస్టుకి  మూడే కామెంట్లొస్తాయి. అంతగా ప్రాముఖ్యం లేని విషయం మీద చర్చను మొదలుపెట్టిన మొదటి కామెంట్ కి కొనసాగింపుగా  ఒక్కో బ్లాగుకి వంద కామెంట్లూ రావొచ్చు!

కానీ బ్లాగు పోస్టు లింకు ని బజ్ లో ఇస్తే మాత్రం ఆన్ లైన్లో ఉన్నవారు రాసే వ్యాఖ్య కాస్తా బజ్ లోనే రాసేస్తున్నారు. అందువల్ల బజ్ లో బ్లాగ్ పోస్టు లింక్ ఇచ్చేవాళ్ళు అక్కడ వ్యాఖ్యలను అచేతనం (commentsని disable చేయమని అర్థం) చేస్తే వ్యాఖ్యలు బ్లాగుల్లోనే పడతాయి.బ్లాగు నచ్చినపుడో, నచ్చనపుడో అభిప్రాయం మాత్రం తప్పక రాయాల్సిందే!

బజ్జులు మాత్రమే రాస్తూ బ్లాగుని నిర్లక్ష్యం చేస్తున్న మిత్రులు (అబ్బ, వేణూ శ్రీకాంత్ కి ఎంత కోపం వస్తోందో)మాత్రం బ్లాగు ని కూడా ఒక కంట కనిపెట్టి ఉంటూ పోస్టులు రాస్తూ ఉండాలి(నేనూ భుజాలు తడుముకుంటూ...)శంకర్ గారూ, మీరు కూడా! (అంచేత మీరు చెప్పొచ్చేదేమైనా ఉందా ఈ సందర్భంలో?)

ఎంతైనా బ్లాగులో రాసినవి భద్రంగా ఉంటాయి,వాటికో రిఫరెన్స్ గా చూసుకోనూ వచ్చు! అంశాల వారీగా విలువా ఉంది!
నేను  బజ్జు లో సమయం దాదాపుగా తగ్గించేశాను.

బ్లాగు మిత్రులు,బజ్జు మిత్రులు ఏవంటారు?