June 7, 2011

మేమూ పేరంటానికెళ్ళాం!




మేమూ బాపూ బొమ్మల కొలువు పేరంటానికెళ్ళి వాయినం పుచ్చుకుని వచ్చాం! పైగా నిన్న ఎస్పీ బాలూ, ఏవీయెస్ ,శేఖర్ కమ్ముల,జనార్దన మహర్షి వంటి వాళ్ళతో కల్సి కూచుని కాసేపు బాపూ నామస్మరణ చేసుకున్నాం! కీర్తి కండూతి అస్సలు లేనందుకు బాపూని, ఆయనకు కీర్తి కావాల్సిందేనని దెబ్బలాడని తెలుగు వాళ్ళనీ(అంటే మనల్నే) కాసేపు తిట్టుకుని నిష్టూర పడ్డాం!
"అసలేమిటీ మనిషి"అని అని విస్తుపోయాం!





శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ లో ఏవీయెస్ గారు బాపూని "దీని తర్వాత మీ ప్రాజెక్ట్ ఏమిటి సార్" అనడిగితే "ఇహ నేను చేయలేమోనయ్యా, నా వల్ల కాదేమో" అన్నారట!

"ఎందుకు సార్, ఓపిక లేదా?"

"రమణ లేడుగా!"అన్నారట డస్సిపోయి!

ఏవీయెస్ చెప్తుంటూనే అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు బరువెక్కిపోయాయి ఈ మాటకి.



జనార్దన మహర్షి ఒక మంచి మాట చెప్పారు. "మీడియా ఛానెళ్ళ వాళ్ళు,అయిన దానికీ కానిదానికీ ఎస్సెమ్మెస్ లు పంపించమంటుంటారు. అలాగే ఇన్ని కోట్ల ఆంధ్రులం ఉన్నాం, "మా బాపూకి గౌరవం,గుర్తింపు కావాల్సిందే" అని తెలుగు వాళ్ళంతా కల్సి ఒక ఉద్యయం లేవదీయాలి. లేవ తీద్దాం కూడా! ఎందుకు సాధ్యం కాదో నేనూ చూస్తాను"అన్నారు ఉద్వేగంగా!

ఏవీయెస్ ఒక చిన్న ఊహాత్మక సంఘటన చెప్పారు.ఒకరోజు ఆయన అర్థ రాత్రి టాంక్ బండ్ మీదుగా వస్తుంటే ఒక స్త్రీ తెలుగు తల్లి విగ్రహం దగ్గర కూచుని భోరున ఏడుస్తోందిట. ఈయన జాలిపడి ఎవరమ్మా నువ్వు?ఎందుకేడుస్తున్నావు?నీ పేరేమిటి? అనడిగితే ఆవిడ "నా పేరు పద్మండీ! ఢిల్లీలో వాళ్ళు నన్ను పెంచుకుంటున్నారు! అర్హత ఉన్నా లేకపోయినా ఎంతోమందిని ఆవహించాను గానీ ఈ బాపు అనే వ్యక్తిని మాత్రం చేరాలని ఎంత ఉత్సాహ పడుతున్నా ఆయన దగ్గరికి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆయన నన్ను కోరడు. నేనే  ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఏడుస్తున్నా"అందిట! ఆ స్త్రీయే పద్మ అవార్డు!



అద్భుత చిత్ర ప్రపంచంలో ప్రతి దాన్నీ ఆస్వాదిస్తూ చూడాలంటే ఒక ఏడాది కావాలి. అది కుదర్దు కాబట్టి గంటల్లోనే ముగించుకుని, నచ్చిన వాటిని భద్రపరుచుకున్న్నాం! మా ఇంటికి దగ్గరే కావడంతో ఎక్కువ సేపూ ఉండగలిగాం, ఇల్లు ఎప్పుడు చేరాలో అనే బెంగ లేకుండా !



బొమ్మల కొలువుకి వచ్చిన అపూర్వ స్పందన వల్ల దీన్ని వచ్చే శనాదివారాలు కూడా (జూన్ 11,12 తారీకుల్లో) సందర్శకులకు అందుబాటులో ఉంచుతారట. మిస్ అయ్యామని బాధ పడేవారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు!














June 6, 2011

శబ్బాష్ రా భరణీ....!


కొంతమంది మనుషుల్ని చూస్తుంటే పరిచయం ఉన్నా లేకపోయినా ఎప్పుడో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మాట్లాడితే మరింత అనుబంధమేదో ఉందనిపిస్తుంది.తనికెళ్ళ భరణి ఈ కోవకే చెందుతారు .సరళమైన భాష, అందులో తళ తళ మెరిసే చమక్కులు, మాటల్లో ఆప్యాయత,ఆహార్యంలో నిరాడంబరత...ఇవన్నీ భరణిని మనకి దగ్గర చేస్తాయి. అంతెందుకు...."పరికిణీ" చదివితే చాలు అసలు మన ప్రమేయంలేకుండానే భరణి మనసులో (మెదడులో కాదు) అలా ఒక పేము కుర్చీ వేసుక్కూచుంటాడు దర్జాగా!ఒక్కో కవితా ఒక్కో ఆణిముత్యం!  

అలాంటి భరణి మహాదేవుడికి మహాభక్తుడు. పరమ శివుడికి పరమ ప్రీతిపాత్రుడు. ఆటగదరా శివా   అంటూ చనువుగా ఒరే అని పిలిచి మరీ తత్వాలు రాశాడు.




శివాలయాలన్నీ తిరిగి ప్రతి మూల విరాట్టుకీ కమ్మగా పాడి వినిపించాడు. దానితో శివుడికీ అత్యాశ కల్గినట్టుంది. ఇంకా రాయాల్సిందేనని ముద్దుగా మారాం చేసినట్టున్నాడు.

శివుడే రాయమన్నాక భరణి ఆగుతాడా! అయితే ఈ సారి తెలంగాణా యాసలో రాసి చూపిస్తా కాస్కోమన్నాడు!

అయితే ఓకే, రాస్కోమన్నాడు పెద్దాయన!అంతే శివాజ్ఞ  అయిందన్నమాట.భరణి దాన్ని ఇలా చెప్తాడు

శంకర అంటేనే నాకు 
శక్కర లెక్కన ఉంటదయ్య
శివునాగ్నైతది.....సీమనైత
శబ్బాష్ రా శంకరా

అలా పుట్టినవే ఈ "శబ్బాష్ రా శంకరా" తత్వాలు!

ఆడియో సీడీ సైజులో ఎక్కడికెళ్ళినా బాగులోనో జేబులోనో పడేసుకుని తీసుకెళ్ళేలా ప్రింటు కొట్టిన భరణి తెలివికి నేను ఫిదా!

తెలంగాణా యాసలో రాస్తూనే "వాడు ప్రాసకీ యాసకీ లొంగుతాడా" అంటాడు మళ్ళీ!

ఇవి మనసులో ఉద్భవించిన భక్తి,ప్రేమ,చనువు,ల్లోంచి పుట్టినవే తప్ప భరణి కలంలోంచి అప్పటికప్పుడు "రాసినవి కాదు"! అందుకే నాకు వీటిలో మహాదేవుడితో మరింత సాన్నిహిత్యం,ఇంకా ఇంకా భక్తితో దగ్గర కావాలన్న తపన కనిపించాయి. ప్రతి తత్వంలోనూ కొంత ఆర్దృత కనిపిస్తుంది.అందుకే ఇవి రాస్తున్నపుడు కన్నీళ్ళు వచ్చేసేవిట భరణికి!

అందుకే అంటాడు

కన్నీళ్లల్లనె బుట్టిన పెరిగినా
కన్నీళ్లల్లనే కాలినా!
ఒక్క  బొట్టయిన  స్ఫటిక లింగమైతే
శబ్బాష్ రా శంకరా! 

నాకు నచ్చిన కొన్ని తత్వాలు కొన్ని

ఖానాకైతే అన్నపూర్ణమ్మ
పీనేకో గంగమ్మ
సోనా యాడైతేంది సోనానె
శబ్భాష్ రా శంకరా

ఏనుగునెల్క మోస్తది
నెమలేమో పాముతో దోస్తీ జేస్తది
శైవ కుటుంబమంటే అది
శబ్బాష్ రా శంకరా!

ఎన్నో గుళ్లలో దేవులాడి
యాష్టొచ్చి  గూసుంటే
నా గుండేలొ ఘల్లుమన్నవులె
శబ్బాష్ రా శంకరా!

ఇంకా చాలా ఉన్నాయి గానీ అన్నీ చెప్పేస్తే భరణి గుస్స జేస్తడేమో!

కేవలం భక్తి భావనే కాక లోకంలో కళ్ళముందు కనపడే బాధల్ని,లోకం పోకడలని కూడా శివుడితో చెప్పుకుని "ఇదేంటయ్యా?"అని ఆవేదన చెందే ధోరణి, బాధపడే ధోరణి కొన్ని తత్వాల్లో కనిపిస్తుంది.

లింగం మింగెడి దొంగనాకొడుకులు
గుడినే మింగెడు నీ కొడుకులు 
మూడో కన్నును తెర్వవేమిటికి రా
శబ్బాష్ రా శంకరా!

కుత్కెలు గోసుకుంటరు 
కులాల మతాల పేరుజెప్పి
పెద్ద కులపోనికి పెద్ద సావొస్తదా
శబ్బాష్ రా శంకరా!


జాతకమంటడు..చెక్రమంటడు
గాచారమంత గలతండడూ 
పైసలతోనే ఫైసలంటడూ
శబ్బాష్ రా శంకరా 


మరి కాసేపు వైరాగ్య ధోరణి

మాంకాళమ్మకు పులిని బలినెయ్యి
నీకంత దమ్ముంటె
అని మేకలన్నయయ్యా 
శబ్బాష్ రా శంకరా

ఇల్లాలంటడు పిల్లలంటడు
ఎన్నో ఇండ్లూ బండ్లంటడు
నువ్వు బిల్వంగనే కాట్ల పంటడు
శబ్బాష్ రా శంకరా!

నాకు అన్నింటికంటే నచ్చిన ఆణిముత్యం

శివుడిని చూడండి భరణి ఎలా వర్ణిస్తాడో..

బైటికి "బండ" బూతువి
అర్థంకాని లోలోతువి
కరిగే రాతివి పరంజ్యోతివి
శబ్బాష్ రా శంకరా!

పేజీకి రెండు చొప్పున తత్వాలు తాపడం చేసి 64 పేజీల్లో అచ్చు తప్పుల్లేకుండా అందించిన ఈ పుస్తకం వెల యాభై రూపాయలు.అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభ్యం!

 ఈ తత్వాలన్నీ స్వయంగా భరణి గానం చేసిన సీడీ వెల అరవై రూపాయలు.

జూన్ 5న శిల్పకళావేదికలో బాల గాంధర్వం పేరిట బాలూకి జరిగిన సన్మాన సభలో ఈ పుస్తకాన్ని సీడీనీ ఆవిష్కరించారు! పుస్తకమేమో ప్రకాష్ రాజ్ కీ ఆడియో సీడీ ని బాల సుబ్రహ్మణ్యంగారికీ అంకితమిచ్చారు భరణి!

ఈ తత్వాలను చూసి సుద్దాల అశోక్ తేజ ఇలా అన్నారు

"జబర్దస్త్ గుంది ఉస్తాద్
నువు కయిగట్న పజ్యాలు, శంకరుని మెడలున్న పాముకి సమజైతే
కుత్తుకలున్న విసం అమృతమైతది


గంతెందుకు  శంకరుని  మూడోకన్ను నిప్పులకు బదులు కన్నీళ్లు పెట్టుకుంటదిగదే......


బస్..ఖుషీతో ఫిదా అయిపోతున్నా! 

నల్లని కవర్ పేజీమీద ఎర్రని "శబ్బాష్ రా శంకరా! "అన్న అక్షరాలు కొట్టొచ్చినట్టు కనపడకపోవడం ఒక్కటే చిన్న అసంతృప్తి!