విజయానికి చుట్టాలెక్కువే గానీ అపజయానికి మాత్రం పాపం బంధు గణమే ఉండదుట! రామలింగ రాజు గారు ఎప్పటిలాగానే "రాజు గోరు"లా ఉండి ఉంటే ఈ సాదా సీదా పుస్తకానికి ఎంత హడావుడి జరిగి ఉండేదో?
ఆకాశమంత పందిరి,భూదేవంత అరుగు వేసి రతన్ టాటా లాంటి తెలుగేతరుడిని పిల్చి, హంగామా చేసి ఆవిష్కరించే వాళ్ళేమో! ఏ తొమ్మిదో టీవీనో దాన్ని 45 నిమిషాల ప్రోగ్రాములో ఊదరగొట్టేసేది.ఇంగ్లీషు,తెలుగు దినపత్రికలు కూడా ఈ పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తూ "గొప్ప" రివ్యూలు రాసేసి రాజుగార్ని సంతోష పెట్టేవాళ్ళు.
కానీ ఇవేమీ జరగలేదు, నెమ్మదిగా ఈ పుస్తకం ఎలాంటి హడావుడీ లేకుండా మార్కెట్లోకొచ్చింది. సత్యం రామలింగ రాజు తీరిక వేళల్లోనో,మనసులో ఆలోచనలు రేగిన వేళలోనో ఎప్పటికప్పుడు రాండమ్ గా రాసుకున్న కవితల్ని ఆయన భార్య నందిని పుస్తకంగా తెచ్చారు. ఇందులో ఏ కవితలు ఎప్పుడు రాసుకున్నారో వివరం లేదు. అందువల్ల ఈ కవితల్లో ఏవైనా ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ముందుగానే సూచించాయా అనే కుతూహలంతో చదవడం సహజమే కానీ గట్టిగా ఒక నిర్థారణకు వెంఠనే రావడం కష్టం!
మనసులో కవిత్వ భావనలుండి, భాష కూడా ఎంతో కొంత ఉంటే కవిత్వం కాస్త నాలాంటి కవితా సువాసనలు అర్థం కాని వాళ్ళక్కూడా అర్థమయ్యేలా బయటికి వస్తుందనుకుంటా!
రామలింగ రాజు గారికి భాష అంతగా సహకరించకపోవడంతో కవితా భావనలు అంత refined గా కాక raw గా కనిపిస్తాయి. అయితే ఆయన స్వతహాగా కవి కాదని అందరికీ తెలుసు కనుక ఆ భావాలు raw గా ఉండటమే బాగుంది. వాటిని refined గా తీర్చి దిద్దాలని ప్రయత్నించి ఉంటే ఆ ప్రయత్నం తేటతెల్లంగా కనపడిపోయేది!
కొన్ని కవితలు మరీ సాదా సీదాగా ఉండి, మరీ ఎప్పుడో ఎనభైల్లో సామాజిక స్పృహ పేరుతోనో,జీవితాన్ని నిర్వచించే అత్యుత్సాహంతో ఔత్సాహిక కవి కుమారులు రాసిన కవితలు గుర్తొచ్చేలా ఉన్నాయి.
టికెట్ లేని ప్రయాణీకుడు_____కవితలో జీవితం రైలు ప్రయాణంలా ఎంత రద్దీగా ఉంటుందో చెప్తూ
"ఏ క్షణాన్నైనా టికెట్ కలెక్టర్ రావొచ్చును,
ఆ వచ్చేదే నీ ఆఖరి స్టేషన్ కావొచ్చును"
అంటాడు రాజు! ఈ లైన్ల వెనుక ఏముందనేది వెంటనే ఊహించాలనిపిస్తుంది. ఇలాంటివే మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి.
"ఆటలో దెబ్బలను ఎలా తట్టుకోను?
అన్యాయపు ఆటగాళ్లను ఎలా వదుల్చుకోను (ఎన్ని ఆటలు నేను ఆడను?)
నిజం రూపాన్ని కొద్ది కొద్దిగా చెక్కాలి
నిర్థారించిన నిజాలు చిరకాలం నిలవాలి(సాక్ష్యాలే)
"వంచనలన్నీ మించిన వచన
నాకు నువ్వే చేసుకునే మహా వంచన
ఆత్మవంచన
ఇలాంటి కొన్ని లైన్లు ఆయన జీవితానికి అద్దంపడతాయేమో అన్నట్లు అక్కడా తోస్తాయి. (అయినా కాకపోయినా)
ఇందాక చెప్పినట్టు భాష మీద పట్టు లేకపోయినా కొన్ని భావాలు బాగున్నాయి,చాలా కామన్ గా అందరిలో మెదిలే ఆలోచన్లే అవి! అలాగే ఒక కవితా వస్తువంటూ ఎంచుకోకుండా, అప్పుడప్పుడూ మదిలో అప్పటికప్పుడు తోచిన ఆలోచన్లను రాసి పెట్టుకున్నారంతే! కొన్ని కవితలు ఎందుకు రాశారో నాకర్థం కాలేదు.
"ఓ కోడి పుంజా!"
"అలవాట్లు"
"అభాగిని" _____ఇలాంటివి!
దాదాపుగా ప్రతి కవితా రేడియో కవితల్లాగా మొదటి పాదం మళ్ళీ మళ్ళీ మధ్యలో రిపీట్ అవడం ఎందుకో అంతుపట్టలేదు నాకు!
ఇవన్నీ రాయడానికి ఆయన కు సమయం దొరకడమే గొప్ప విషయం!
మొన్నొకాయన నిర్వచించారు "అడ్డంగా రాసే పేరా గ్రాఫు ని నిలువుగా రాస్తే అదే కవిత్వం అవుతుంద"ట!
ఆ కోవ కవిత్వం ఈ మధ్య ఎక్కడ చూసినా గుర్రపుడెక్కలా విస్తరించి చుట్టేస్తోంది. పువ్వులూ,పిట్టలూ,ప్రేమా,మనసూ,జీవితం,నువ్వూ నేనూ,అంతరంగం,వెన్నెలా,వర్షమూ _______ఇవే వస్తువులు తిరగా మరగా వేసి అవే కవితలు!
వాటితో పోల్చుకుని చూస్తే రాజు కవితలు చాలా ఉత్తమస్థాయిలోనే ఉన్నాయి.
విశ్వం,సృష్టి,వైజ్ఞానిక ప్రగతి,సమాజ వైఖరిమీద నమ్మకమూ,విస్మయమూ,మనుషుల పట్ల సుహృద్భావం,ఇవన్నీ ఈ కవితల్లో చోటు చేసుకున్నాయి!
రామ్ గోపాల్ వర్మ "నా ఇష్టం" పుస్తకానికి ప్రచురణ సంస్థ ఎంత హడావుడి చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.
రాజు గారు కుప్ప కూలకుండా ఉండుంటే ఈ ఏడాది పుస్తకాల సంతలో కూడా ప్రత్యేకంగా ఒక స్టాలు పెట్టి మరీ అమ్మేవాళ్ళే ఈ పుస్తకాన్ని!
కవర్ పేజీ మీద రాజుగారే! ఎందుకో మనసు చివుక్కుమంది ఆ కవర్ పేజీ చూస్తే! రాజు మీద నాకున్న అభిమానమే తప్ప మరో దీనికి కారణమేదీ కనపడలేదు. (కారణం లేని హీరో వర్షిప్ అని విమర్శకులెవరన్నా వచ్చేస్తారేమో... రాకండి! నా అభిమానం నా ఇష్టం!)
ఎమెస్కో వాళ్ళు వేసిన ఈ పుస్తకం వెల 90 రూపాయలు!




